జగన్ ఓటమి .. పవన్ గెలుపు.. వేల మందితో టాలీవుడ్ పార్టీ.. ఏవరిస్తున్నారో తెలుసా?
ముఖానికి మేకప్ వేసుకునేవాళ్లు.. రాజకీయాలకు పనికొస్తారా అంటూ హేళనలు ఎదురైన వేళ వాటిని ధీటుగా ఎదిరించి నిలబడ్డారు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత. కాకలు తీరిన నాయకులనే మట్టికరిపించి రాజకీయానికి కేరాఫ్గా నిలిచారు ఈ ముగ్గురూ. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో వీరు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆ మహనీయులు వేసిన బాటలోనే ఎందరో నటీనటులు, కళాకారులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ అయినవారు కొందరే. చివరి వరకు నిలబడ్డ వారినే విజయం వరిస్తుందనే సూత్రాన్ని నిజం చేస్తూ ఇప్పుడు వారి సరసన స్థానం సంపాదించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇంటా బయటా, మీడియాలో , సోషల్ మీడియాలో .. ఎవరి నోట విన్నా, ఎక్కడ చూసినా పవన్ నామస్మరణే .
తెలుగునాట పవర్స్టార్గా అభిమానుల మన్ననలు పొందుతూ.. రోజుకు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ , విలాసాలు, విహారయాత్రలు, ఫారిన్ ట్రిప్పులు కాదనుకుని ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు పవన్. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్తో సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన పవర్స్టార్.. ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అనే భరోసాను ఇస్తూనే వచ్చారు.

జనసేన పుట్టుకకు ఐదేళ్ల ముందు నుంచే ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పవన్ .. జనం బాధలను చాలా దగ్గరి నుంచి చూశారు. పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు ఆ కష్టాలు తెలుసు. రాజకీయాల్లోనూ తను డిఫరెంట్ అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. తను మద్ధతిచ్చిన కూటమి అధికారంలోకి వచ్చినా ఏ పదవీ తీసుకోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఊరుకోనని చెప్పి, కూటమి నుంచి బయటికొచ్చేశారు. ఎవరి మద్ధతు లేకున్నా .. తనకు పరిస్ధితులు వ్యతిరేకంగా ఉన్నా పోటీ చేశారు. తాను రెండు చోట్లా ఓడిపోయినా , గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ లాగేసుకున్నా ఎక్కడా చలించలేదు.
మొండిగా పోరాడుతూ.. పార్టీ నడపటం కోసం సినిమాలు చేసి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి జనసేనను నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి వంటి బలవంతుడైన శత్రువును ఎదుర్కోవాలంటే తన శక్తి సరిపోదని భావించిన పవన్.. టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి తనకిచ్చిన సీట్లను కూడా వదులుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు.

పవన్ అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదు, జగన్ 11 స్థానాలకు పరిమితమయ్యేవారు కాదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేరన్న వారికి తన విజయంతోనే సమాధానమిచ్చారు జనసేనాని. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో పాటు తాను నిలబెట్టిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని భారతదేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నారు పవన్ కళ్యాణ్.
కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ మూడోసారి అధికారాన్ని అందుకోవడంలోనూ పవర్స్టార్ది కింగ్మేకర్ పాత్ర. ఆయన సత్తాను గుర్తించారు కాబట్టే.. మోడీ అంతటి వ్యక్తి పవన్ను తుఫాన్ అంటూ ఆకాశానికెత్తేశారు. తన ఆశయ సాధన కోసం , తాను కలలుగన్న పాలన అందించడం కోసం ఈసారి ప్రభుత్వంలోనూ భాగస్వామి కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు కేబినెట్లో డిప్యూటీ సీఎం పోస్ట్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను
స్వీకరించారు.

పవన్ కళ్యాణ్ సాధించిన అపూర్వ విజయంతో ఊరువాడా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అయితే తమ్ముడిని చూసి పొంగిపోతున్నారు. ఆయన ఇప్పట్లో నేల మీదకు దిగొచ్చేలా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. మరి తమ సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకుంటే.. మనం సైలెంట్గా ఉంటే బాగుండదని అనుకున్నారో ఏమో కానీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆదివారం గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్లో సినీ, రాజకీయ, మీడియా వ్యక్తులకు పార్టీ ఇస్తున్నారు. దీనికి దాదాపు 2000 మంది వరకు హాజరవుతారని అంచనా. ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ ఇస్తున్న పార్టీ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే విశ్వప్రసాద్ ఒక్కరే వ్యక్తిగతంగా పవన్ కోసం ఇంత చేస్తుంటే.. మిగిలిన సినీ ప్రముఖులంతా ఏం చేస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











