అనసూయ సినిమాకు కేంద్ర మంత్రి సపోర్ట్
సహజంగా రాజకీయ నాయకులకు రాజకీయాలతోనే సరిపోతుంది. వీరు అధికార పక్షానికి చెందిన వారై, ఏదో ఒక మంత్రి పదవిలో ఉంటే మాత్రం ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత వీరిదే. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నేతలు మధ్య వచ్చే సమస్యలను తీర్చడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక ప్రత్యర్ధి పార్టీలు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో ఏకంగా ఓ కేంద్ర మంత్రి ఓ తెలుగు సినిమాను చూడాలని పిలుపునిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో ఓటీటీకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. థియేటర్లలో టికెట్ ధరలకు జడుసుకుంటున్న సామాన్యులు , కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ , జబర్దస్త్ ఫేమ్ అనసూయ భరద్వాజ్ నటించిన రజాకార్ చిత్రం కోసం ఓటీటీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. గతేడాది రిలీజైన ఈ సినిమా నేటి వరకు ఓటీటీలోకి రాలేదు.

హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అండ చూసుకుని రజాకార్లు, ఖాసీం రజ్వీ సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఊళ్ల మీద పడి దోపిడీలు, లూటీలు, అత్యాచారాలు, హత్యలు వంటి మారణహోమంతో ప్రజలను చిత్రహింసలకు గురిచేసింది. ఎదురు తిరిగిన వారిని అత్యంత దారుణంగా బహిరంగంగానే హతమార్చేది. ఈ నేపథ్యంలో నిజాం పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో ఎలా విలీనం చేశారన్న ఇతివృత్తంతో తీసిన చిత్రమే రజాకార్.
యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడురు నారాయణ రెడ్డి ఈ రజాకార్ సినిమాను నిర్మించారు. అనసూయ భరద్వాజ్, వేదిక, ప్రేమ, ఇంద్రజ, తేజ్ సప్రూ, అనుశ్రీ, రాజ్ అర్జున్ , ప్రేమ, బాబీ సింహా తదితరులు నటించారు. రంగస్థలంలో రంగమ్మత్త, పుష్పలో ద్రాక్షాయణి తర్వాత అనసూయ పాత్ర ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. గతేడాది మార్చి 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. అయినప్పటికీ ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

దాదాపు ఏడాది తర్వాత రజాకార్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జనవరి 24 నుంచి రజాకార్ మూవీనీ వీక్షించవచ్చని, ఆహా గోల్డ్ మెంబర్స్ 48 గంటల ముందే ఈ సినిమాను చూడొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో రజాకార్ సినిమాను అందరూ చూడాలని పిలుపునిచ్చారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా .. హైదరాబాద్కు స్వాతంత్ర్యం రాకపోవడాన్ని, రజాకార్ల అకృత్యాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని బండి సంజయ్ చెప్పారు.
హిందువులను ఇస్లాంలోకి మార్చాలని రజాకార్లు ఎంతో ప్రయత్నించారని.. ప్రాణాలు కోల్పోయినా సరే మతం మారేందుకు నాటి ప్రజలు ఇష్టపడలేదని కేంద్ర మంత్రి తెలిపారు. రజాకార్ సినిమా ఓటీటీలోకి వచ్చిందని.. అందరూ చూడాలని తెలంగాణ ప్రజలకు, బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











