హిందీ వద్దంటే.. తమిళ్ హిందీ డబ్బింగ్ ఆపేయండి.. పవన్ సంచలనం
తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం మధ్య గత కొద్దిరోజులుగా త్రిభాషా విధానంపై చాలా రోజులుగా వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. దేశంలోని విద్యార్ధులు హిందీ, ఇంగ్లీష్తో పాటు ఓ స్థానిక భాషను కూడా నేర్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని రూపొందించింది. అయితే ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్రం సూచించగా..ఇందుకు తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మాత్రం మొండికేస్తోంది. హిందీ నేర్చుకోమని తమ విద్యార్ధులను బలవంతం చేయొద్దని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కేంద్రంతో వివాదం నేపథ్యంలో తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద రావాల్సిన రూ.573 కోట్లను మోడీ ప్రభుత్వం నిలిపివేసింది. ఎన్ఈపీ మార్గదర్శాలు అమలు చేస్తేనే ఆ డబ్బులు విడుదల చేస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఎంకే స్టాలిన్ స్ట్రోక్ ఇచ్చారు. ఇటీవల ప్రవేశపెట్టిన తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా హిందీలో ఉండే రూపాయి గుర్తును తొలగించి దాని స్థానంలో తమిళ అక్షరాన్ని పెట్టారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుండగా.. తమిళ ప్రజలు మాత్రం స్టాలిన్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి త్రిభాషా విధానంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఎన్టీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినప్పటికీ త్రిభాషా సూత్రానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయి. కానీ తమిళనాడులోని పార్టీలు, కొన్ని సంస్థలు తమ ప్రయోజనాల కోసం హిందీని అడ్డుకుంటున్నాయని పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఎన్టీయేలో భాగస్వామి, జనసేన పార్టీ అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్రిభాషా సూత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన నేతలు, కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ త్రిభాషా విధానంపై మాట్లాడారు. మాతృభాషను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని.. అలాగే బహుభాషా విధానం కూడా మన అభివృద్ధికి దారి తీస్తుందని పవన్ చెప్పారు. హిందీ వ్యతిరేక ఉద్యమం క్రమంగా దేశ విభజనకు దారి తీస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

హిందీ భాషను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి .. వారి సినిమాలను కూడా హిందీలోకి డబ్ చేయొద్దని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ వాళ్ల డబ్బులు కావాలి.. కానీ ఆ భాష విషయంలో రాజకీయం ఎందుకు చేస్తున్నారని జనసేన అధినేత ప్రశ్నించారు. తమిళనాడులో ఒక్క భాషా విధానం కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే సంబంధించిన అంశమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే మిగిలిన భారతదేశంలో బహుభాషా విధానంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని జనసేనాని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఇతర డీఎంకే పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











