Tamilnadu 2026 Elections: ఓటింగ్కు పోటెత్తిన సినీ తారలు.. తమిళ పీఠం విజయ్ కైవసమా?
తమిళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊహించని ట్రెండ్ కనిపిస్తున్నది. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు సంచలన రీతిలో తీర్పు ఇస్తారా? అనే సందేహాలు బలంగా కనిపిస్తున్నాయి. గతంలో చూస్తే తమిళ రాష్ట్రంలో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల మధ్యే పోటీ ఉండేది. ఓ దఫా ఓ పార్టీ అధికారంలోకి వస్తే.. మరోసారి మరో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొనే ఆట కనిపించేది. కానీ 2026 సంవత్సరంలో జరిగే ఎన్నికలు ప్రత్యేకంగా మారబోతున్నాయి. ఈసారి రెండు ప్రధానా పార్టీల ఆధిపత్యానికి సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ గండి కొట్టబోతుందా? అనే వాదనకు మరింత బలం చేకూరేలా ఓటింగ్ నమోదు అవుతున్నది. తమిళ అసెంబ్లీకి జరిగిన ఓటింగ్ సరళి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం మే 23వ తేదీన జరుగుతున్న ఓటింగ్కు సాధారణ ప్రజల నుంచే కాకుండా సినీ తారల నుంచి భారీ స్పందన కనిపించింది. ఎన్నడూ లేని విధంగా సినీ నటీనటులు ఓటింగ్కు పోటెత్తారు. విజయ్, అజిత్, శింబు, రజనీకాంత్, కార్తీ, సూర్య, జ్యోతిక, సాయిపల్లవి, శివకార్తీకేయన్, సిద్దార్థ్, కీర్తీ సురేష్, మణిరత్నం, సుహాసిని, వీటీవీ గణేష్ లాంటి తారలు, అలాగే టెలివిజన్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భారీగా తరలిరావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇక సాధారణ ప్రజలు కూడా ఓటు హక్కు ఉపయోగించుకొనేందుకు బారులు తీరారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తమిళ ప్రజలు, యువత భారీగా తమ సొంత ప్రాంతాలకు చేరుకోవడం ఓటింగ్ ట్రెండ్ను ప్రభావితం చేసింది. ఈ సారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపించడంతో యువతీ, యువకులంతా ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారనే విషయం ఓటింగ్ సరళిని బట్టి చూస్తే అర్ధమవుతుంది అని ఎన్నికల విశ్లేషకులు తెలిపారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ట్రెండ్ క్రేజీగా మారింది. సినీ తారలతోపాటు సాధారణ ఓటర్లు కూడా విజయ్ ధరించే తెల్ల షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకొని ఓటు సమర్పించడానికి రావడం చూస్తే.. ఈసారి ఎన్నికల్లో టీవీకే స్పష్టమైన ప్రభావం చూపబోతున్నదా? అనే అనుమానం క్రియేట్ అయింది. అయితే గత రెండు రోజులుగా టీవీకే, విజయ్ పట్ల సానుకూలమైన స్పందన రావడం ఓటింగ్ ట్రెండ్ను మార్చబోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు లెవెల్లో ఓటింగ్ శాతం నమోదు కానున్నదనే విషయం క్లియర్గా కనిపిస్తున్నది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 70 శాతం ఓటింగ్ నమోదు అయింది. అదే 2021 సంవత్సరంలో కేవలం 52 శాతం ఓటింగ్ నమోదు అయింది. అంటే ఈ సారి దాదాపు 18 శాతం ఓటింగ్ ఎక్కువగా అయింది. తమిళనాడులో మొత్తం 5,73,43,291 ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 4,01,40,303 ఓట్లు నమోదు అయ్యాయి. ఇంకా మూడు గంటల సమయంలో 1,72,02,988 ఓట్లు నమోదు కావాల్సి ఉంది అని ఎన్నికల విశ్లేషకులు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. 5 గంటల వరకు 82.24 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే భారీ లెవల్లో ఓటింగ్ కావడం దేనికి సంకేతం... తమిళ యువత, కొత్త ఓటర్లు విజయ్కు ఓటేశారా? డీఎంకే, ఏఐడీఏంకే పార్టీలకు ముఖం చాటేశారా? తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని, యువత కోరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? అనే వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రశ్నలకు మే 4వ తేదీన జరిగే ఎన్నికల ఫలితాలే సమాధానంగా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications