జగన్ నోట రప్పా.. రప్పా .. అల్లు అర్జున్ డైలాగ్తో చంద్రబాబుకు వైసీపీ చీఫ్ చురకలు
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాలలోని డైలాగ్స్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. గల్లీ లీడర్స్ నుంచి ఏకంగా కేంద్ర మంత్రుల వరకు ఈ డైలాగ్స్ వాడుకుని ప్రత్యర్ధులపై విరుచుకుపడేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ పుష్ప 2లోని రప్పా రప్పా డైలాగ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఈ డైలాగ్పై వివాదం రాజుకుంది. తాజాగా ఇదే డైలాగ్పై జగన్ ఏకంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వివరాల్లోకి వెళితే..
పల్నాడులో ఉద్రిక్త పరిస్ధితులు
పల్నాడు జిల్లా రెంటళ్లపాడులో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావున మరణం ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. పోలీసుల వేధింపులతోనే నాగమల్లేశ్వరరావు చనిపోయారంటూ టీడీపీపై వైసీపీ నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించాని మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. అయితే ఆయన పర్యటనపై పల్నాడు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జగన్ తాడేపల్లి నుంచి పల్నాడు పర్యటనకు బయల్దేరారు. దారి పొడవునా ఆయనకు ప్రజల నుంచి మద్ధతు లభించింది.

రెచ్చగొట్టేలా వైసీపీ ఫ్లెక్సీలు
జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మరణించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత సత్తెనపల్లె నియోజకవర్గంలోని రెంటళ్లపాడుకు చేరుకోగా.. వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలు మరో వివాదానికి దారితీసింది. అల్లు అర్జున్ పుష్ప 2లోని ఫేమస్ డైలాగ్ను అనుకరించేలా.. 2029లో వైఎస్సార్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అని రాసున్న ఫ్లకార్డ్ను ఓ అభిమాని ప్రదర్శించాడు. దీనిపై టీడీపీ శ్రేణులు ఘాటుగా బదులివ్వగా.. వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
రప్పా.. రప్పా డైలాగ్ చెప్పిన జగన్
తన పల్నాడు పర్యటన, ఫ్లెక్సీ వివాదంపై జూన్ 19న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా ముందుకు వచ్చారు. ఈ ఫ్లెక్సీ వివాదంపై మాట్లాడుతూ ఆయన నవ్వులు పూయించారు. ఆ ఫ్లెక్సీలో ఏముందని ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులను అడిగి డైలాగ్ చెప్పించారు. ఇది పుష్ప 2 సినిమాలోని డైలాగ్ అని విలేఖరులు చెప్పడంతో .. సినిమా డైలాగ్ను కూడా ఫ్లెక్సీగా పెట్టుకోకూడదా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జగన్. అలాగే రప్పా.. రప్పా అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా గడ్డం కిందుగా పుష్పరాజ్లా డైలాగ్ చెప్ప్పడంతో విలేకరులు పకపక నవ్వారు.
వైసీపీ తీరుపై చంద్రబాబు ఫైర్
ఇదే సమావేశంలో కొందరు వైసీపీ నేతలు.. ఆ ఫ్లెక్సీని పట్టుకున్నది టీడీపీ వాళ్లేనని జగన్ దృష్టికి తీసుకెళ్లగా టీడీపీ కేడర్ కూడా వైసీపీ చేరి కూటమి పాలనపై ఇలా స్పందిస్తున్నారా అని మాజీ సీఎం అన్నారు. జగన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పల్నాడులో ఉద్రిక్త పరిస్ధితులు, ఫ్లెక్సీ వివాదంపై స్పందించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, గూండాలకు విగ్రహాలు పెడుతున్నారని వైసీపీపై మండిపడ్డారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శలా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపమంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారని.. ఇలాంటి తీరు సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మొత్తానికి అల్లు అర్జున్ డైలాగ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.


Click it and Unblock the Notifications











