హీరోయిన్కు వైసీపీ నేతల వేధింపులు.. గదిలో బంధించి టార్చర్.. మీడియాలో సంచలనం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వై నాట్ 175 అంటూ బరిలో దిగిన జగన్ సేన.. బొక్క బోర్లా పడింది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీని జనం ఈసారి 11 స్థానాలకే పరిమితం చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి విజయం సాధించిన వైఎస్ జగన్.. ఘోర ఓటమిని సైతం మూటకట్టున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ నేతలెవ్వరూ అడ్రెస్ లేరు. కేసుల భయం కావొచ్చు.. కొత్త ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తుందన్న అనుమానం కావొచ్చు వైసీపీ నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు.
పార్టీ కేడర్ సంగతి పక్కనబెడితే.. స్వయంగా అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పత్తా లేకుండా పోయారు. ఎన్నికల తర్వాత ఆయన ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్లోనే సేద తీరుతున్నారు. మొన్నామధ్య వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య జరగడంతో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు అప్పటికప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లిలో దిగారు. ఆ వెంటనే రాష్ట్రంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు , వేధింపులు ఎక్కువయ్యాయంటూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసన దీక్ష చేశారు. దీక్ష ముగిశాక నేరుగా బెంగళూరుకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అడపాదడపా నేతలతో సమీక్షలు , సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇకపోతే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్పై అక్కసుతో టికెట్ ధరలను భారీగా తగ్గించింది. అలాగే పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతులు నిరాకరించింది. జగన్ దెబ్బకు టాలీవుడ్ షేకయ్యింది. దీంతో చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు తాడేపల్లికొచ్చి సమస్యలు పరిష్కరించాలంటూ జగన్ను వేడుకున్నారు. ఈ సమయంలో హీరోల కార్లను గేటు బయటే ఆపించి.. లోపలికి నడుచుకుంటూ వచ్చేలా చేశారంటూ వారి అభిమానులు మండిపడ్డారు.
అయితే అధికారం కోల్పోయాక కూడా వైసీపీ నేతల తీరులో మార్పు రాలేదంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన ఓ సినీనటిని ఓ వైసీపీ నేత విజయవాడకు పిలిపించి ఓ గెస్ట్హౌస్లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ నటి హిందీలో సినిమాలు, సీరియల్స్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైసీపీ నేత అయిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో ఆమె ప్రేమలో పడ్డారట. అతనిని పెళ్లాడాలని అనుకోగా.. విషయం ఆ యువకుడి తండ్రి వరకు వెళ్లిందట. దీంతో ఆయన తన కొడుకుతో పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని నయానా, బయానా చెప్పి చూశాడట. అయినప్పటికీ వినకపోవడంతో ఆ హీరోయిన్ను బెజవాడ పిలిపించి వేధించినట్లుగా ఆ ఛానెల్ పేర్కొంది.
నాడు జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతను సదరు పారిశ్రామికవేత్త సాయం కోరినట్లుగా ఛానెల్ తెలిపింది. ఆ పెద్దమనిషి రంగంలోకి దిగి కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారట.. దానికి ఒప్పుకోకపోవడంతో ఫైనల్గా రూ.5 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారట. అయినప్పటికీ సదరు హీరోయిన్ రాజీకి రాలేదని పేర్కొంది. దీంతో ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ఇష్యూని డీల్ చేశారట. హీరోయిన్పై చీటింగ్ కేసు పెట్టి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను జైలుకు పంపడంతో ఆ నటి భయపడి పారిపోయిందని ఆ ఛానెల్ కథనంలో తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఆమెను టార్చర్ చేసిన వైసీపీ నేత ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
...........


Click it and Unblock the Notifications











