ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారు..రాజకీయాల్లోకి మేం రాకూడదా..యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామల.. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై రోజు రోజుకు తన విమర్శల దాడిని పెంచుతున్నారు. రెండ్రోజుల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఆరేళ్ల చిన్నారి హత్యపై ఆరోపణలు చేసిన ఆమె.. తాజాగా తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే:
తన షోలు, సినిమా ఈవెంట్లు, సినిమాల్లో చిన్నాచితకా ఈవెంట్లతో మంచి పాపులారిటీ సంపాదించారు శ్యామల. మిగిలిన యాంకర్ల మాదిరిగా స్కిన్ షో చేయకుండా నిండైన వస్త్రధారణతో సాంప్రదాయబద్ధంగా కనిపించేవారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయినా శ్యామల అందం కొంచెం కూడా తగ్గలేదు. వైఎస్ కుటుంబంతో శ్యామల ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్, షర్మిల పాదయాత్రలలో నరసింహారెడ్డి, శ్యామల కనిపించిన సంగతి తెలిసిందే.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన శ్యామల.. ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు . ఈ సందర్భంగా ఓ ఛానెల్లో మాట్లాడుతూ .. ముసలి తోడేలు, గుంట నక్క కథ చెప్పింది. ఇది పరోక్షంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్లను ఉద్దేశించినదేనంటూ రెండు పార్టీల కేడర్ విరుచుకుపడింది. సోషల్ మీడియాలో శ్యామలను దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈ దెబ్బకు యాంకరమ్మ సెలైంట్ అయ్యారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమెస్తోందని తనను బతకనీయండి అన్నా అంటూ ఓ వీడియలో శ్యామల విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై దృష్టిపెట్టిన జగన్ .. పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్తగా నలుగురిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వారే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామల. అలా పదవి దక్కగానే ఇలా డ్యూటీ ఎక్కేశారు శ్యామల. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై వాడి వేడి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తొలుత సోషల్ మీడియాలో వీడియోలను వదిలిన ఆమె .. ఇప్పుడు ఏకంగా ప్రెస్మీట్లు పెట్టి ఆరోపణలు చేసే స్థాయికి చేరుకున్నారు.
తాజాగా శ్యామల మీడియాలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పిఠాపురంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుర్గాడ జాన్ అనే వ్యక్తిని కేసు నుంచి తప్పించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ సెటైర్లు వేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించిన తర్వాత తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని శ్యామల ఆరోపించారు.
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రాకూడదా.. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు నటులే కదా అని ఆమె గుర్తుచేశారు. మగవాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఏం కాదని.. అదే ఆడపిల్లలు ఎంట్రీ ఇస్తే మాత్రం అసభ్య వ్యాఖ్యలు చేస్తారా అని శ్యామల నిలదీశారు. తనపై ఎంత ట్రోలింగ్ చేసినా వెనక్కి తగ్గనని.. ఇండస్ట్రీలో తనకు పని లేకుండా చేశారని, అయినా నిలబడి తట్టుకునే శక్తి తనకు ఉందన్నారు. తను ఎంత కృంగదీయాలని ప్రయత్నించినా వెనకడుగు వేసేది లేదని శ్యామల తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











