పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకున్న యాంకర్ శ్యామల.. ఆయన వల్ల ఒరిగిందేమిటీ?
యాంకర్ శ్యామల ఫుల్ టైం రాజకీయాల్లోకి దిగిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఆమె స్పీడు చూసిన జగన్.. ఇటీవల వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఊహించని విధంగా పదవి దక్కడంతో శ్యామల తన విమర్శలను దాడిని పెంచారు. మీడియా ముందుకు రాకుండా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు శ్యామల. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై ఆమె విమర్శలు సంధించారు. ఆ వివరాల్లోకి వెళితే :
సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆరేళ్ల బాలిక హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. మూడున్నర లక్షల అప్పును తీర్చమన్నందుకే చిన్నారిని చంపేశారని పోలీసుల విచారణలో తేలింది. జిల్లా ఎస్పీ స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు.. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. చిన్నారిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు నిరాధారమన్నారు. వైసీపీ నేతలు చిన్నారి మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు. అనితతో పాటు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ తదితరులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బాలిక తండ్రిని సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు.

కాగా.. పుంగనూరులో బాలిక మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా. పాప అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. బాలిక మిస్ అయిన నాలుగు రోజుల వరకు పోలీసులు ఆమె ఆచూకీని కనుగొనలేకపోయారని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
ఫైల్స్ కాలిపోతే డీజీపీని హెలికాప్టర్లో పంపిన ముఖ్యమంత్రి.. ఆడపిల్లను దారుణంగా చంపితే ఎందుకు డీజీపీని పంపలేదని రోజా నిలదీశారు. జగన్ వస్తున్నారని తెలిసి.. పుంగనూరుకు హోంమంత్రిని, మంత్రులను పంపారని ఆమె ఆరోపించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లేడీస్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటనలో బాధితులనే బెదిరించి కేసును నీరుగార్చారని రోజా ఆరోపించారు. మచ్చుమర్రి ఘటనలో నేటికీ చిన్నారీ మృతదేహం కనుగొనలేకపోయారని, రాష్ట్రంలో ఆడపిల్లలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్ల కోసం గ్యారంటీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ @JaiTDP కూటమి పాలనలో.. పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైంది
— YSR Congress Party (@YSRCParty) October 6, 2024
రామ రాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చేశారు.. ఆడబిడ్డలపై ఇంతలా అత్యాచారాలు జరుగుతున్నా నోరుమెదపరేంటి?
-శ్యామల గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి… pic.twitter.com/GrHuvJf5E7
పుంగనూరు ఘటన నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే ఈ దేశంలో .. ఏపీ మాత్రం ఎటుపోతోందని ఆమె ప్రశ్నించారు. గ్యారంటీల పేరు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించి కూటమి అధికారంలోకి వచ్చిందని, సినిమా డైలాగులు కొట్టి పదవులు దక్కించుకున్న నేతలు అత్యాచారాలపై మాట్లాడరేంటీ అని శ్యామల నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోనే దారుణం జరిగిందని, బాబొస్తే అదొస్తుంది.. ఇదొస్తుందన్నారని.. కానీ ఆయనొచ్చాక ప్రాణాలు పోతున్నాయని ఆమె దుయ్యబట్టారు. ప్రస్తుతం శ్యామల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











