Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పరమ వీర చెత్త ('పరమ వీర చక్ర' రివ్యూ)
-సూర్య ప్రకాష్ జోశ్యుల
బ్యానర్: తేజ సినిమా
నటీనటులు: బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, రాజ్ ప్రేమి, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్,
విజయ్ కుమార్, చలపతిరావు, అశోక్ కుమార్, బ్రహ్మానందం, అలీ, హేమ, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: రమణ రాజు
ఎడిటింగ్: గౌతమ్ రాజు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: సి.కల్యాణ్
కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: దాసరి నారాయణరావు
తేది: 12/01/2011
"యంగ్ ఇండియా" వంటి డిజాస్టర్ సినిమా తీసి ఈ మధ్య కాలంలో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపిన దాసరి తన తదుపరి చిత్రానికి బాలకృష్ణను హీరోగా ఎంపికచేసుకున్నాడనగానే అంతటా అంచనాలు కన్నా అనుమాలు ఎక్కువ మొదలయ్యాయి. అయితే సింహా ఇచ్చిన కిక్ తో బాలయ్య చాలా జాగ్రత్తగా ఉంటాడని, దాసరి కూడా తన 150 చిత్రం కదా అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఎవరకి వారే సర్దిచెప్పుకుని రిలీజ్ కోసం ఎదురుచూసారు. అయితే వారి ఆశలు నిరాశలే అయ్యాయి. అభిమానులు సైతం ఫరవాలేదు అనలేని స్ధితిలో చిత్రం తెరకెక్కింది. సైనికాధికారిగా, సినీ హీరోగా, రావణాబ్రహ్మగా, కొమురం భీమ్ గా రకరకాల గెటప్స్ లో బాలకృష్ణ కనపించి అలరించినా, అదంతా బాలకృష్ణ ఇన్నిగెటప్స్ వేసి ఒప్పించగలడు, ఇంత బాగా చేయగలడు అని చెప్పటానకి ప్రత్యేకంగా పనిగట్టుకుని తయారు చేసిన ప్రచార చిత్రంలా తయారైంది. కథా లోపమే కాక దశ, దిశ లేని దర్శకత్వం పాపం కూడా సినిమాను, బాలకృష్ణ క(ఇ)ష్టపడి చేసిన నటనాకౌశలాన్ని దారుణంగా దెబ్బతీసింది.
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్టార్ హీరో చక్రధర్(బాలకృష్ణ). అతన్ని అభిమానిస్తూ వెంటబడే (షీలా) అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. అయితే అతని తల్లి(జయసుధ)కి అలాంటివి గిట్టవు. ఆవిడకి తన కొడుకు పెద్ద మిలిట్రీ మేజర్ అయ్యి, దేశానికి సేవ చేయాలనే జీవితాశయం. ఈ స్ధితిలో చక్రధర్ కు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ పరిచయమై తమ దగ్గరో అధ్బుతమైన కథ ఉందని చెప్తారు. కథ నచ్చితే ప్రీగా చేస్తానని మాట ఇచ్చిన చక్రధర్ కి ఆ కథని జితేంద్ర(మురళి మోహన్)అనే మిలిట్రీ ఆఫీసర్ నోటిగుండా వినటానకి రెడీ అవుతాడు. ఆ కథ ఆర్మీలో సిన్సియర్ ఆఫీసర్ మేజర్ జయసింహ(బాలకృష్ణ)కి చెందింది. కథ వింటున్న చక్రధర్ అందులో లీనమై తనను తాను జయసింహాగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే ఆ కథ జరిగిందని తెలుసుకుంటాడు. విన్న ఆ కథ ప్రకారం కొందరు కుట్రదారులు (సినిమా ఈ రేంజి పాత వాసనలుతో ఉంటుంది) వల్ల నష్టపోయి, దేశద్రోహిగా మిగిలిన జయసింహకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకోసం సినిమా నటుడు, జయసింహ పోలికలతో ఉన్న చక్రధర్ ఏం చేసాడు. ఈ కథకీ పరమవీరచక్ర బిరుదుకీ సంభందం ఏమిటీ అన్నది మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
బాలకృష్ణ చేత ఈ చిత్రం బొబ్బిలిపులికి సీక్వెల్ కాదు...రీమేక్ అంతకన్నా కాదు అని ప్రత్యేకంగా ఇంటర్వూల్లో చెప్పించిన దాసరి ఈ చిత్రాన్ని బొబ్బిలిపులి సీన్ తోనే మొదలెడతారు. అలాగే మేజర్ జయసింహ కథంతా విన్న హీరో చక్రధర్ కి ఊహించని విధంగా ఏదో ట్విస్ట్ వస్తుందని ఎన్నో సినిమాలు చూసిన సగటు ప్రేక్షకుడు ఎదురుస్తాడు. అయితే వారి ఊహకు అందనిరీతిలో అంతసీనెందుకు అన్నట్లుగా రొటీన్ గానే కథనం సా...గు..తూంటుంది. కొన్ని సార్లు చాలా మందికి విజయేంద్రవర్మ చిత్రం కూడా గుర్తుకు వచ్చి ఆ ప్లాపుకి కనెక్టు అయిపోయారు.
సినిమా ప్రారంభమైన చాలా సేపటికిగాని కథలోని సమస్యలోకి వెళ్ళకపోవటమే ఈ సినిమా కథకున్నప్రధాన సమస్య.ఎప్పటికో మురళిమోహన్ చెప్పే ప్లాష్ బ్యాక్ పూర్తి కావాలి, అప్పుడు గానీ మన హీరో చక్రధర్ చలనంలోకి వచ్చి విలన్స్ పనిపట్టడు. అప్పటివరకూ మనకెంత ఓపికకావాలి. అప్పటివరకూ ప్లాష్ బ్యాక్ లో కనపించే జయసింహకు సమస్యలు రావా అంటే కథ ప్రకారం చక్రధర్ కి సమస్య వచ్చి వాటిని ఫేస్ చేస్తేనే కదా కథనం రక్తి కట్టేది. ఇంతకు మించి రొటీన్ గా సాగే ఈ కథ, కథనాలను విశ్లేషించటానికి కూడాఏమీ లేదు.
అలాగే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనపడి షాక్ ఇస్తాడు. మరో ప్రక్క కోడి రామకృష్ణ, బోయపాటి శ్రీను, జొన్నవిత్తుల, సింగీతం శ్రీనివాసరావు వంటి సినీ ప్రముఖులను చూపి ఆకట్టుకోవాలని చూడటం దాసరి వంటి మెగా(అప్పట్లో) దర్శకుడు ప్రయత్నించటం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది. బాలకృష్ణతో కథకు సంభందం లేని వివిధ గెటప్స్, డైలాగులు, సెలబ్రేటీలను చూపటం ఇదంతా చూస్తుంటేనే ఏదో రకంగా ఒడ్డున పడాలని ప్రయత్నిచినట్లు స్పష్టంగా తెలిసిపోతూంటుంది. వీటిన్నట్టికీ తోడు హీరోయిన్స్ అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా...వీళ్ళలో ఒక్కరికీ సరైన పాత్ర, డైలాగులు, జస్టిఫికేషన్ ఉండదు. కేవలం బాలకృష్ణను ఎలా చూపాలా అని ఆలోచించి డిజైనా చేసినట్లుగా సినిమా అంతా జరుగుతూంటుంది.
ఇక సినిమాలో ప్లస్సులు లేవా అంటే...అది బాలకృష్ణే. ఆయన నటన, డైలాగులు చెప్పే తీరు సినిమా సినిమాకూ పదునెక్కుతోందని స్పష్టం చేస్తుందీ చిత్రం. అలాగే క్లైమాక్స్ లో కోర్టులో చెప్పే డైలాగ్స్ కూడా బావున్నాయి. అలీ, బ్రహ్మానందం చేసిన రోబో పేరడీ కామెడీ ఏ సి సెంటర్ల వారకన్నా ఎక్కాలేమో కానీ మిగతావారికి కష్టం. అదే దాసరి టార్గెట్ అయితే అంతవరకూ విజయం సాధించినట్లే. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, మురళి మోహన్, జయసుధ, రఘుబాబు వంటివారుకి పెద్ద పాత్రలు లేకపోయినా ఉన్నంతలో బాగా చేసారు. చాంతాడంత డైలాగులకు దాసరి నారాయణ రావు పెట్టింది పేరనే విషయం మరో మారు గుర్తుకు వస్తుంది. అయితే డైలాగులు కొన్ని చోట్ల బాగానే పేలాయి. అయితే ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏదీ గుర్తుండే అవకాశమేలేదు. ఇక పాటల విషయానికి వస్తే మణిశర్మ అప్పుడప్పుడూ ఎవియస్ చిత్రాలకు ఇచ్చిన సంగీతంలా నీరసంగా ఉంటుంది. నేపధ్య సంగీతమూ అదే రేంజిలో ఏడ్పిస్తుంది. కెమెరా, మేకప్, ఎడిటింగ్, ఆర్ట్ దాదాపు అన్ని విభాగాలు దాసరి గారి పురాతన దర్శకత్వానికి పోటీ పడి పనిచేసాయి.
పైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు ఎలాంటి దర్శకులను, కథలను ఎంచుకోవాలి అన్న విషయంలో స్ఫష్టమైన ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహాతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కడ దెబ్బతిందో ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే అదే సమయంలో దాసరిగారు ఇంత దారుణమైన ప్లాపులు ఇవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం కొంతకాలం పాటు దర్శకత్వానికి దూరంగా ఉండటమే బెస్ట్ అని ఈ చిత్రం చెప్తుంది. ఇక మనలాంటివారికి సింహా లాంటి హిట్ తర్వాత వచ్చే ప్రతీ చిత్రం సింహా కానక్కర్లేదని, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నిరూపిస్తుంది.