Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సాహో క్రిష్...మీసం తిప్పాల్సిందే! కానీ....(రివ్యూ: గౌతమీపుత్ర శాతకర్ణి )
నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ఈ రోజు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.
శాతకర్ణి జీవిత కథ... చరిత్ర ప్రకారం చూస్తే అతి తక్కువగా లభ్యమవుతోంది. అంత తక్కువ విషయాన్ని రెండున్నర గంటల సినిమాగా రూపొందించాలంటే చాలా కల్పన అవసరం. అలాగని చరిత్ర,కల్పన విడివిడిగా కనపడకూడదు. రెండూ కలిసిపోయి...ఏక కథలా ...నిజ జీవిత చరిత్ర ఇలాగే ఉండేదేమో అనిపించాలి. అలాంటి సాహసాన్ని,కల్పనని, అత్యంత సహనంతో,సామర్దంతో చేసి, గెలిచిన వాడు దర్శకుడు క్రిష్.
ఓ రకంగా ఈ నిరంతర యుద్ద వీరుడు చరిత్రను యుద్ద ప్రాతిపదికన అతి తక్కువ సమయంలో, చరిత్ర సినిమాలు ఎక్కించే బడ్జెట్ తో పోలిస్తే అతి తక్కువ మొత్తంతో ఎలా తీయగలడు,గ్రాఫిక్స్ కే చాలా సమయం పడుతుండే అని అనేక సందేహాలు అందిరిలో. వాటిన్నట్టికి చెక్ పెడుతూ..అనుకున్న సమాయానికి అత్యంత క్వాలిటీగా అవుట్ పుట్ ఇచ్చాడు.
తెలుగు జాతి మర్చిపోయిన ఓ సాహసవీరుడుని గాధని మన ముందుంచాడు. సినిమా ఎలా ఉంది, ఎంత పే చేస్తుంది...ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వంటి అనేకానేక ట్రేడ్ విషయాలను ప్రక్కన పెట్టి మొదట ఈ విషయంలో క్రిష్ ని సాహో క్రిష్ అనాల్సిన సమయం ఇది.
ఇక ఇలాంటి అరుదైన తెలుగువారు గర్వపడే ప్రాజెక్టు కోసం కష్టపడి, తెలుగు జాతి వీరత్వాన్ని చాటి చెప్పిన శకపురుషుడు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలోపాత్రలో ఒదిగిపోయి...తనదైన శైలి డైలాగులతో ప్రాణం పోసిన బాలయ్య అభినందనీయుడు. ఇంతకీ ఈ చిత్రం కథేంటి...మనం చూసిన ట్రైలర్స్ తగ్గట్లే సినిమా ఉందా అనే విషయాలు రివ్యూలో చూద్దాం.
శాతకర్ణి కల
అమరావతిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న శాతవాహన సామ్రాజ్య యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి (బాలకృష్ణ) అఖండ భరత జాతి...ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అని కలలుకంటూంటాడు. అఖండ భారతావనిని ఒకేతాటి మీదకు తేవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ముందుగా కళ్యాణదుర్గం రాజును జయిస్తాడు. వరుసగా 29 యుద్ధాలు చేసి ఆ రాజ్యాలను జయించి...వారిని తన సామంతులుగా చేసుకుంటాడు. కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు.
అశోకుడు,చంద్రగుప్తుడు చెయ్యలేని పనిని
ఈ క్రమంలోనే శాతవాహన చక్రవర్తి శాతకర్ణి వరస యుద్దాలతో...దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా అవతరిస్తాడు. దక్షిణభారతదేశంలో పెద్ద రాజు అయిన సౌరాష్ట్ర నహపాణుడి(కబీర్బేడీ)ని ఓడించి భారత్ను ఏకం చేయాలనుకుంటాడు. ఈ భారీ యుద్ధంలో శాతకర్ణి నహపాలుడిని ఓడించి అతడి అల్లుడు అయిన వృషభనాథుడిని అక్కడ తన సామంతుడిగా చేసుకుంటాడు. దాంతో శకపురుషుడిగా అవతరిస్తాడు. భారతేశాన్ని గతంలో పాలించిన ఎందరో గొప్ప రాజులు అయిన అశోకుడు, చంద్రగుప్తుడు చేయలేని పనిని శాతకర్ణి చేస్తాడు.
గ్రీకు నుంచి
తన పౌరష,పరాక్రమాలతో, యుద్ద నైపుణ్యంతో..తంత్రాలతో....ఉత్తర,దక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తాడు. అయితే.. అనితర సాధ్యంగా,అప్రతిహంగా సాగుతున్న దండయాత్రకు అడ్డం పడే సమయం వస్తుంది. ఇక గ్రీకువీరుడైన అలెగ్జాండర్ సమయం నుంచి భారతదేశం మీద దాడులు చేస్తున్న యువనులు (గ్రీకులు) డెమిట్రియస్ ఆధ్వర్యంలో భారత్మీద దండెత్తేందుకు ఎదురు చూస్తుంటారు.
శాతకర్ణిని చంపాలని కుట్ర
శాతకర్ణి కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కించుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. అఖండభారతాన్నిచేజిక్కించుకోవటంలో భాగంగా శాతకర్ణిపై కుట్రకు పూనుకుంటారు. ఆయనపై విషప్రయోగానికి పూనుకుంటాడు. ఈ నేపధ్యంలో శాతకర్ణి... డెమిత్రయస్ని వచ్చిన గ్రీకులను చిత్తుచిత్తుగా ఓడించి భారతజాతి ఖ్యాతిని చివరకు దశదిశలా శాతకర్ణి ఎలా వ్యాపింపజేశాడు ? తన జీవిత ప్రయాణంలో తన తల్లి గౌతమి(హేమమాలిని), భార్య వశిష్టి దేవి (శ్రియా), తన పిల్లలతో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అన్నదే ఈ సినిమా కథ.
అదే చూపించారు
ఈ సినిమాలో మనం సాధారణంగా... ఓ రాజుగా..చక్రవర్తిగా..శాతకర్ణి ప్రస్దానం ఎలా సాగింది అనే యాంగిల్ లో చూపెట్టి ఉండారు అని ఎక్సపెక్ట్ చేస్తాం. కానీ దర్శకుడుగా క్రిష్ మరో యాంగిల్ ని ఎంచుకున్నారు. శాతకర్ణి ముందుగా భారత్ను ఏకం చేసి, తర్వాత గ్రీకులను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాన్ని చెప్పాలనుకున్నాడు. అదే చూపించారు.
విదేశీయల నుంచి ముప్పు
భారతదేశం ఏకంగా ఎప్పుడూ కలిసి ఉండాలి అనే ఆలోచనతో ఈ స్క్రిప్టు రెడీ చేసినట్లు మనకు అర్దమవుతుంది. భారత్ ఏకమయ్యితే... మన దేశానికి విదేశీ రాజ్యాల నుంచి ముప్పు తప్పుతుందనే కోణంలోనే కథనం నడిపించారు.అందుకేనేమో...సినిమా ప్రారంభమే కళ్యాణ్దుర్గం మీద యుద్ధంతో మొదలెట్టారు. ఆ తర్వాత మరో పెద్ద రాజ్యమైన సౌరాష్ట్ర మీద దండెత్తడంతో రెండో యుద్ధం చేసి, ఇండియాను ఏకం చేయటం చూపించారు. చివర్లో గ్రీకుల యుద్ధాన్ని భారీగా చూపించారు. ఎక్కడా ప్రక్కకు వెళ్లలేదు.
యుద్దమే కాదు...అవి కూడా
ఈ సినిమా కేవలం యుద్దమే కాకుండా... మూడు ప్రధాన అంశాలు చుట్టూ తిరుగుతుంది. శాతకర్ణికి, అతని తల్లికి మధ్య ఉన్న అనుబంధం, భార్య పాయింటాఫ్ వ్యూలో శాతకర్ణి, అఖండ భారతాన్ని శాతకర్ణి సాదించాలనుకోవడంలో అతని అంతరంగం, అందుకోసం అనుసరించిన కఠిన మార్గాలు, కొడుకును పణంగా పెట్టి శాతకర్ణి పడిన కష్టాలు చుట్టూ కథను బలంగా అల్లుకున్నారు.
యుద్దాలు అంతంత ఉన్నాయి
ఈ సినిమా తొలి భాగం పూర్తి గ్రాండ్ విజువల్స్ తో , అబ్బురమనిపించే డైలాగ్స్ తో , అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సాగింది. ముఖ్యంగా షార్ప్ గా క్రిస్పీగా ఉంది. అయితే ఫస్టాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ వార్ ఎపిసోడ్ చాలా లెంగ్తీగా ఉందనిపిస్తుంది. అలాగే రెండో వార్ ఎపిసోడ్ చాలా లెంగ్తీగా సాగుతూనే ఉంటుంది. ఎంతకీ అవదు. క్లైమాక్స్ అప్పుడే చూపించేస్తున్నారా అనే సందేహం వస్తుంది. బడుగు జాతి కాదు..తెలుగు జావి వంటి డైలాగులతో లాగేసారు
విషంలో విషయంలేదా
ఈ సినిమా సెకండాఫ్ ..ఫస్టాఫ్ లో ఉన్నంత వేగం, ఉత్సుకత లేకుండా సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా లెంగ్తీగా ఉంది. దాన్ని ట్రిమ్ చేస్తే బాగుండును అనే ఫిలింగ్ తెస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్..శాతకర్ణిపై విషప్రయోగం జరిగాక..ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. అయితే విషంలో విషయం లేనట్లుంది. శాతకర్ణి కోలుకుని మళ్లీ యుద్దం ప్రారంభించేస్తాడు. ఇక్కడే మనకు రెగ్యులర్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్, హీరోయిజం కనిపించేసి నీరసం వచ్చేస్తుంది.
తల్లికు, భార్యకు మధ్య నలిగిపోతూ..
తల్లి గౌతమి బాలాశ్రీ(హేమామాలిని)కి ఇచ్చిన మాట ప్రకారం గణ రాజ్యాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఏక దేశంగా చేసి ఒక పాలనలోకి తీసుకురావడానికి నడుం బిగించి, ఆ పని మీద ఉంటాడు గౌతమిపుత్ర శాతకర్ణి, మరో ప్రక్క శాతకర్ణి భార్య వశిష్టికి యుద్ధాలంటే నచ్చవు. ఆమె శాతకర్ణితో విభేదిస్తూ ఉంటుంది. ఇదే సినిమాలో మెయిన్ కాంప్లిక్స్. శాతకర్ణికి.. వ్యక్తిగత జీవితంలో తల్లికి-అతడికి మధ్య వచ్చే సీన్స్ చాలా తక్కువుగా రాసుకున్నాడు. ఇక భార్యకు అతడికి మధ్య వచ్చే సన్నివేశాలు తక్కువే అయినా అవి నీట్గా ఉన్నాయి. శాతకర్ణి, అతని బార్య మధ్య ప్రేమ-అప్యాయత-అనురాగం-ఆందోళన-శృంగారం ఇలా అన్ని అంశాలను ఆవిష్కరించాడు.
ఎమోషన్స్ పీక్స్
ఈ యుద్ద ప్రధాన చిత్రంలో కొన్ని సీన్స్ క్రిష్ ట్రేడ్ మార్క్ ని పట్టిస్తాయి. ఆయన డ్రామా పండించే తీరుకు అద్దం పడతాయి. అటువంటి వాటిలో ఒకటి.. నహపాణుడు సామంతరాజల వారసుల్ని బంధించి.. యుద్ధానికి వచ్చేటప్పుడు శాతకర్ణిని తన కొడుకు పులోమావిని తీసుకుని రమ్మని చెప్పినప్పుడు జరిగే భావోద్వేగ సన్నివేశం. వాటి మాటకు సై అని.. శాతకర్ణి యుద్ధానికి కుమారుడిని తీసుకెళ్తాడు. అలా తీసుకువెళ్లే సమయంలో శాతకర్ణి భార్య వాసిష్ఠి దేవి అడ్డుచెప్పేటప్పుడు సగటు తల్లి కనిపిస్తుంది. ఎమోషన్స్ ని అద్బుతంగా పండించారనిపిస్తుంది. యుద్ధభూమికి బాలయ్య తన చిన్న కుమారుడిని కూడా తీసుకెళ్లి చేసే సాహసం కూడా బాగుంది. అక్కడ బాలయ్య కొడుకు పులోమావి నహపాలుడి కళ్లల్లోకి ఎలాంటి భయం లేకుండా చూసే సీన్ చాలా హైలెట్ గా నిలుస్తుంది.
కేక పెట్టించాయి ఈ డైలాగ్స్
నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు.... ఓ చరిత్రకు
ఆడదాని కడుపులో నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి
శాతకర్ణి ఒక్కడు మిగిలి ఉంటే చాలు... మనలో ఒక్కడు కూడా మిగలడు
నా రాజ్యంలో పాలించడానికి కాదు...యాచించడానికి కూడా అనుమతించను
మమకారం..అహాంకారం రెండూ లేనివాడే నాయకుడు అవుతాడు
మనం కథలు చెప్ప కూడదు...మన కథలు జనం చెప్పుకోవాలి
శరణం అంటే రక్ష...రణం అంటే మరణశిక్ష ఏదీ కావాలి
ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం... ఇక ఉనికిని చాటుదాం
మగనాలికి గాజులు అందం...మగాడికి గాయాలు అందం
మారావు అనుకున్నా...గెలిచిన రాజ్యాలు మార్చలేదు...వలచిన ఇల్లాలు మార్చలేదు
ఇంకా ..సమయం లేదు మిత్రమా శరణమా..రణమా..,దేశం మీసం తిప్పుదాం, మరీ ముఖ్యంగా...రాజసూయ యాగం నేపథ్యంలో వచ్చే తల్లి గొప్పతనాన్ని చెప్తూ సాగే డైలాగు అద్బుతంగా ఉంది.
బాలయ్య వన్ మ్యాన్ షో మాత్రమే కాదు
ఈ సినిమా కేవలం బాలకృష్ణ వన్ మ్యాన్ షో అన్నట్లుగానే కాకుండా మిగతా పాత్రలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చారు దర్శకుడు . ముఖ్యంగా బాలయ్య ను తప్ప వేరే తెలుగు నటుడుని శాతకర్ణి పాత్రలో ఊహించుకోలేం అని చెప్పటం అతిశయోక్తి మాత్రం కాదు. కథలో భాగమైన వీరత్వాన్ని చూపుతూ మరో ప్రక్కన ఎమోషన్స్ ని అంతే సమర్దవంతంగా పండిస్తూ... కత్తికి రెండు వైపులులా పదును ఉన్నట్లుగా బాలయ్య తనలోని నటుడుని మరోసారి ఆవిష్కరించారు.
వాళ్లంతా కూడా
శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో హేమమాలిని ఒదిగిపోయారు. శ్రియ వాసిష్ఠిదేవిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. నహపాణుడిగా కబీర్బేడి ఆకట్టుకుంటారు. యుద్ధమే ధర్మం అనే ధీటైన పాత్రలో హేమమాలిని నటిస్తే, యద్ధం వద్దు భర్త శ్రేయస్సే ముఖ్యం అనుకునే సజీవమైన పాత్రలో శ్రేయ జీవించింది. మిగిలిన నటుల్లో బాలయ్య రాజ్యంలో సైనిక సామ్రాజ్యంలో శివకృష్ణ, తనికెళ్ల భరణి, దూతగా శుభలేఖ సుధాకర్, ఇక గ్రీకు మనుష్యులుగా డెమిట్రియస్, ఎథినా రోల్లో చేసిన వారుగా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు.
అక్కడ కూడా కసరత్తు
సినిమాలో ఓ డాక్యుమెంటరీ వాతావరణం క్రియేట్ చేస్తుంది చాలా చోట్ల. ముఖ్యంగా యుద్దం సీన్స్ లో కూడా టెన్షన్ ఎలిమెంట్ ని చొప్పించలేదు. దాంతో ఉత్కంఠ కానీ, ఉత్సుకత కానీ, ఎమోషనల్ కనెక్ట్ చేయటం లేకుండా వరస వార్ సీన్స్ నడిచిపోయాయి. దాంతో మనకు సంభందం లేని వ్యవహారమేదో తెరపై నడుస్తూంటే మనం చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగని అంత గొప్ప డ్రామాను పండించలేదు. తెరపై చేసిన కసరత్తు స్క్రిప్టు పై కూడా చేసి ఉంటే బాగుండేది.
సాంకేతికికంగా
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా గత క్రిష్ సినిమాలు లాగానే టెక్నికల్ గా సౌండ్గా ఉంది. ముఖ్యంగా జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాకు చారిత్రకమైన పరమైన లుక్ తీసుకురావడంలో చాలా వరకూ సక్సెస్ అయింది. ఇక చిరంతన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతం అని చెప్పలేం కానీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.
మర్చిపోలేం
ఇలాంటి సినిమాల్లో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విభంగా..ఆర్టి డిపార్టమెంట్. ఈ సినిమాకు భూపేష్ భూపతి అందించిన ఆర్ట్ వర్క్ హై స్టాడర్డ్స్ లో ఉంది. శాతవాహన సామ్రాజ్యం, కళలు, శిల్పాలు, ఇలా అన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసారు. ముఖ్యంగా శాతకర్ణి జీవిత చరిత్రను వివరిస్తూ శివరాజ్కుమార్ చేసే సాంగ్లో ఆర్ట్ వర్క్ను మరలేం.
మర్చిపోలేం.
దర్శకుడుగా..
దర్శకుడు క్రిష్ తన విభిన్నతను చరిత్రపై తనకున్న మమకారాన్ని కంచే చిత్రంలోనే చూపెట్టారు. శాతకర్ణి కథను ఎంచుకోవటంలోనే క్రిష్ చాలా బాగం సక్సెస్ అయ్యారు. శాతవాహన చక్రవర్తి ని ఏ కోణంలో చూపెట్టాలనుకున్నాడో..ఎలాగైతే తను ఆవిష్కరించదలుచుకున్నాడో...స్పష్టంగా అలా చెప్పుకుంటూ పోయాడు. కమర్షియలాటిలి కోసం అని ప్రక్క దారులు తొక్కలేదు. ఈ చారిత్రక కథలో అక్కడక్కడా కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా తన దైన టేకింగ్, డైరెక్షన్ తో డీల్ చేసి బాగుందనిపించాడు.
ఈ సినిమా కు పనిచేసిన టీమ్
సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు:యువరత్న నందమూరి బాలకృష్ణ, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్: చిరంతన్ భట్
ఆర్ట్: భూపేష్ భూపతి
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్ర
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు
సమర్పణ: బిబో శ్రీనివాస్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
దర్శకత్వం: జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్)
రన్ టైం: 2 గంటల 12 నిమిషాలు
సెన్సార్ సర్టిఫికెట్: యూ/ఏ
రిలీజ్ డేట్: 12 జనవరి, 2016
ఫైనల్ గా ... యుద్దానికి , యుద్దానికి మధ్య జరిగే కథలా అనిపించినా... ఈ చిత్రం క్రిష్ దర్శకత్వ ప్రతిభకు, బాలయ్య నటనాభినయానికి అద్దం పడుతుందనటంలో సందేహం లేదు. ఇప్పటికైనా మన తెలుగు జాతి వీరత్వాన్ని చాటి చెప్పిన శకపురుషుడు ఎవరో మనం తెలుసుకునే అవకాసం కల్పించినందుకు దర్శక,నిర్మాతలకు,హీరోకు సినిమా కృతజ్ఞతలను సినిమా చూడటం ద్వారా చెప్దాం. ఇలాంటి మరిన్ని చారిత్రక చిత్రాలు వచ్చేందుకు ప్రోత్సాహం ఇద్దాం. సాహో శాతకర్ణి.