నటీనటులు:తరుణ్,ఇలియానా,జగపతిబాబు,ఛార్మీ,సునీల్, బ్రహ్మానందం,వేణుమాధవ్,సుధ,చంద్రమోహన్,సనా, నరసింహరావు,మల్లిఖార్జునరావు,ప్రదీప్ రావత్ తదితరులు. సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ పాటలు: వేటూరి, భువనచంద్ర, చంద్రబోస్ సంభాషణలు: అబ్బూరి రవి సినిమాటోగ్రఫి: జగన్ కథ,స్కీన్ ప్లే ,దర్శకత్వం :విజయభాస్కర్ నిర్మాత :శాఖమూరి పాండు రంగారావ వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ భాస్కర్ తన తొలినాటి హీరో తరుణ్, నేటి హాట్ హీరోయిన్ ఇలియానాలతో జతకట్టి భలే దొంగలును రెడీ చేసాడు. కాని స్క్రిప్ట్ బలం తోడు లేకపోవటంతో వాళ్ళు డల్ గా మారి కలెక్షన్లు కొల్లగొట్టే పరిస్థితి కనపడటం లేదు. అప్పటికీ బాలీవుడ్ హిట్ బంటి ఔర్ బబ్లి రూట్ మేప్ లా వారికి రిఫెరన్స్ ఇచ్చినా ఫలితం కనపడేట్లు లేదు.అంతేగాక వారిని హుషారెత్తించటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్మి సాంగ్ కూడా చప్పగా సాగింది. దాంతో ఓపినింగ్స్ ఫరవాలేదనిపించినా ప్రేక్షకులకు చివర వరకు కూర్చునే ఓపిక కనపడటం లేదు. తమకు మించిన ఆశలతో రోడ్డున పడి ప్రమాదాలు పాలై తిరిగి తమలో ఉన్న మంచితనంతోనే సేవయ్యే ఓ జంట కథ ఇది. రాము(తరుణ్), జ్యోతి(ఇలియానా) మిడిల్ క్లాసులో పుట్టి ఇమడలేక తాము ఉన్నతంగా ఊహించే కెరీర్(రాము వ్యాపారం చేసి కోటీశ్వరుడవ్వాలని...జ్యోతి మిస్ ఇండియా అవ్వాలని ఆశ)కోసం వేర్వేరుగా హైదరాబాద్ వస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ ఒక చోటకు చేరుతారు. కాని తమ కలలు కలిసిరాకపోవటంతో తప్పని స్థితిలో దొంగతనాలు ప్రారంభింస్తారు. మొదట సరదాగా, తరువాత అలవాటుగా అవి మారి వారికి పాపులారిటీనే కాక ఎన్నో చిక్కులు ఎదుర్కుంటారు. అంతేగాక సిటిలో ఉన్న మాఫియా లార్డ్(ప్రదీప్ రావత్),డి.సి.పి.యుగంధర్(జగపతిబాబు)ల మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ గా మారుతారు. వారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు అనేది మిగతా కథ. బాలీవుడ్ హిట్ బంటి ఔర్ బబ్లి ఆధారంగా రూపొందించిన ఈ కథ పస్టాఫ్ చాలా వరకు ఒరిజనల్ నే ఫాలో అయ్యారు. క్లైమాక్స్ కోసం సెకండాఫ్ లో మాఫియా కథ తీసుకొచ్చి ముడి వేసారు. కాని హీరో కి విలన్ కి పోటాపోటి లేకుండా చేసి..పాసివ్ గా మార్చారు. మధ్యలో వచ్చిన జగపతి బాబు పాత్ర హఠాత్తుగా హీరోగా మారుతుంది. దాంతో చూస్తున్న ప్రేక్షకుడు ఎవరిని ఫాలో అవ్వాలో తెలియని స్థితి ఏర్పడింది. అలాగే బంటి ఔర్ బబ్లి చిత్రంలో హీరో హీరోయిన్లు తాము తప్పు చేస్తున్నామని తెలియని స్థితిలో ముందుకు వెళ్ళుతూ ఇబ్బందులు పాలవుతూ బుద్ది తెచ్చుకుంటారు. కాని ఈ సినిమాలో భలే దొంగలు ఇద్దరూ మంచివాళ్ళే. దోచిన డబ్బు అందరికీ పంచిపెడుతూంటారూ. అలాగే కాన్సర్ బారిన పడిన ఓ పాపను రక్షిస్తూ మంచితనం ప్రదర్శిస్తూంటారు.దాంతో వారి పాత్రలకు నిబద్దత లేకుండా పోయింది. దర్శకుడు విజయభాస్కర్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిలో వున్నారు.'మల్లీశ్వరి' తర్వాత ఆయన రూపొందించిన 'జై చిరంజీవ', 'క్లాస్మేట్స్' సినిమాలు ఫ్లాపయ్యాయి.ఈ సినిమా బాగానే తీసినా అప్పటి ఎనర్జీ కనపడక పోవటం విచిత్రం. కథనం పై మరింత దృష్టి పెట్టి ఉండి ఉంటే బాగుండేది. అలాగే 'నవ వసంతం'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తరుణ్కు ఈ సినిమా కలిసివచ్చేటట్లు కనపడటంలేదు. 'ఆనంద్', 'గోదావరి', 'చందమామ' ఫేమ్ కె.ఎం. రాధాకృష్ణన్ ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమాకు డల్ గానే సాగింది. హాస్య నటులు సునీల్, బ్రహ్మానందం, వేణుమాధవ్ కామెడీ అలరిస్తుంది. ఇందులోని పాటల్ని వేటూరి, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు. ఇక అబ్బూరి రవి రాసిన సంభాషణలు త్రివిక్రమ్ ను అనుకరిస్తూ సాగినా పెద్దగా పేలలేదు. జగన్ సినిమాటోగ్రాఫి బాగుంది. ఏది ఏమైనా అసభ్యత, హింస లేకుండా తీసిన ఈ సినిమా ఫ్యామిలీలకు ఫరవాలేదనిపిస్తుంది. యూత్ కి ఎక్కటం కష్టమే.