Peddi: పెద్దిపై చిరంజీవి రివ్యూ.. రామ్ చరణ్ నటించలేదంటూ
Chiranjeevi Review on Peddi:రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో పెద్ది టీమ్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సినిమాపై తన రివ్యూను ఇస్తూ.. దర్శకుడు బుచ్చిబాబు, తన కుమారుడు రామ్ చరణ్పై ప్రశంసల జల్లు కురిపించారు.
సినిమా గురించి మాట్లాడిన చిరంజీవి, 'పెద్ది' తనపై ఎంతో ప్రభావం చూపిందని అన్నారు. "నేను షూటింగ్లతో బిజీగా ఉండి సినిమా ఆలస్యంగా చూశాను. కానీ సినిమా పూర్తయ్యాక కూడా అందులోని భావోద్వేగాలు నన్ను వెంటాడాయి. ఇది కేవలం సినిమా కాదు.. జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొంటూ పైకి రావాలనుకునే ప్రతి మనిషి కథలా అనిపించింది. నిద్రలో కూడా కొన్ని సన్నివేశాలు గుర్తొచ్చాయి. అంత డీప్ ఇంపాక్ట్ ఇచ్చింది' అని అన్నారు.

ఇక రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. "సినిమా చూసిన తర్వాత వాళ్ల అమ్మ చరణ్ చాలా బాగా నటించాడని చెప్పింది. కానీ నేను మాత్రం బాగా నటించాడు అనడం సరిపోదు అన్నాను. చరణ్ ఆ పాత్రలో జీవించాడు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు" అని అన్నారు. నటన అంటే కేవలం ఏడుస్తూ ప్రేక్షకులను కదిలించడం కాదని, భావాలను కళ్లలో పలికిస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకడం నిజమైన నటన అని చిరంజీవి వివరించారు.
"ఒక నటుడు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే అది నటన. కానీ కళ్లలో భావోద్వేగాలను పలికిస్తూ, మాటలు లేకుండా ప్రేక్షకుల మనసును కదిలిస్తే అది పాత్రను జీవించడం. 'పెద్ది'లో చరణ్ అదే చేశాడు. నేను తెరపై రామ్ చరణ్ను చూడలేదు. పెద్ది అనే వ్యక్తినే చూశాను" అని ప్రశంసించారు. ముఖ్యంగా అప్పలసూరి పాత్ర మరణించిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో చరణ్ నటన తనను బాగా కదిలించిందని తెలిపారు.
"ఆ ఎమోషనల్ సన్నివేశాల్లో చరణ్ కళ్లలో కనిపించిన బాధ, ఆవేదన గుండెల్ని పిండేసినట్టుగా అనిపించింది. ఎలాంటి అతిశయోక్తి లేకుండా, ముఖ కవళికలను అతిగా ఉపయోగించకుండా కేవలం తన భావోద్వేగాలతోనే ప్రేక్షకులను ఏడిపించాడు. అదే చరణ్ ప్రత్యేకత" అని కొనియాడారు. తండ్రిగా తన ఆనందాన్ని దాచుకోలేకపోయిన చిరంజీవి, "చరణ్ నా కొడుకు కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ నేను నటుడిగా కూడా అతడిని చూస్తున్నాను. ఒక తండ్రిగా, ఒక సహనటుడిగా చరణ్పై నాకు ఎంతో గర్వంగా ఉంది" అని అన్నారు.
ఈ సందర్భంగా " పుత్రుడు పుట్టినప్పుడు కాదు.. ఆ పుత్రుడు ఎదిగి నలుగురు మెచ్చుకున్నప్పుడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహం. ఈ రోజు ఆ భావన నాకు పూర్తిగా అర్థమవుతోంది. చరణ్ను చూసి నాకు ఆ గర్వం కలుగుతోంది" అని వ్యాఖ్యానించారు. అలాగే.. సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ "ప్రతిరోజూ కఠినమైన డైట్ పాటిస్తూ, గంటల తరబడి జిమ్లో శ్రమించాడు. కొన్ని సందర్భాల్లో ఇంత కష్టం అవసరమా అనిపించేది. నేను కూడా నా కెరీర్లో ఎన్నో పాత్రల కోసం శ్రమించాను. కానీ చరణ్ ఈ సినిమాకు పెట్టిన కష్టం మరో స్థాయిలో ఉంది" అని చెప్పారు.
ఇక సినిమాలో నటించిన ఇతర నటులపై కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు అద్భుతంగా ఒదిగిపోయారని, ఆయన వాయిస్ వింటే తప్ప అది జగపతి బాబు అని గుర్తుపట్టలేమని అన్నారు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని కొనియాడారు. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కూడా కథలో బాగా కలిసిపోయిందని, ముఖ్యంగా పాటల్లో ఆమె డ్యాన్స్ ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సానాపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన చిరంజీవి, "ఒక గ్రామానికి చెందిన సమస్యను జాతీయ స్థాయిలో ఆలోచింపజేసేలా చూపించారు. క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎంత అవసరమో బలంగా చెప్పగలిగారు. ముఖ్యంగా అప్పలసూరి మరణం తర్వాత కథ మరో స్థాయికి చేరుకుంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక సామాజిక సందేశం" అని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications






