Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీహరి మార్క్ మాస్ మసాలా చిత్రం 'గణపతి'
తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన విలన్స్ని వెంటాడి వధించిన హీరో కథలతో గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఆ తరహాను పోలిన చిత్రమే 'గణపతి'. అయితే కథకు ఎంచుకున్న బ్యాక్డ్రాప్, నడిపించిన తీరు, పదునైన సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. వీటికి తోడు అచ్చెరువొందించే శ్రీహరి ఫైట్స్ షరా మామూలే.
అసలు సంగతికి వస్తే హీరో ఎమ్.ఆర్. వో.ప్రభుత్వం కాల్వ నిర్మాణానికి నష్ట పరిహారం చెల్లించి రైతుల పొలాలు స్వాధీనం చేసుకుంటుంది. అయితే, ఆ నష్టపరిహారంలోని ఎక్కువ మొత్తాన్ని విష్ణంశెట్టి బ్రదర్స్ కొట్టేస్తారు. ప్రభుత్వం సొమ్ముపై చెయ్యి వేస్తే తల్లి గుండెలపై చెయ్యివేసినట్లుగా భావించే హీరో వారిని కోర్టుకీడుస్తాడు. బ్రదర్స్ తాము మింగిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి జమ చేయాల్సి వస్తుంది. దీంతో ఆస్తి అంతా పోగొట్టుకుని రోడ్డున పడతారు బ్రదర్స్. భర్తలు హత్యలు చేసి వస్తే ఆనందంగా ఎదురెళ్లే వారి భార్యల్లో పెద్దామె ఈ స్థితిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే మిగిలినవాళ్లు వాళ్లని దూషించి పుట్టింటికి వెళ్లడంతో కథ వూపందుకుంటుంది.
కక్ష సాధించడానికి విలన్లు హీరోను బంధిస్తారు. అతని ఎదుటే నిండు గర్భిణి అయిన అతని భార్యను హింసించి చంపుతారు. అంతేకాకుండా హీరోను చంపకుండా వుండడానికి అతని చెల్లెల్ని తండ్రి చేతే ముస్తాబు చేయిస్తూ కొన్నాళ్లు అనుభవిస్తారు. దీంతో హీరో చెల్లెలుకు పిచ్చెక్కుతుంది. విలన్లకు సహకరించిన ఎస్ఐని చంపి హీరో జైలుపాలవుతాడు. ఇదంతా చిత్రంలో ఫ్లాష్బ్యాక్ కింద వస్తుంది.
ఆ కథంతా విన్న నాగబాబు (ఐ.జి. ప్రిజన్స్), మాన్య (ఇన్స్పెక్టర్) హీరోను జైలు నుంచి తప్పిస్తారు. జైలు నుంచి బయట పడిన హీరో విలన్లను ఒక్కొక్కర్ని ఒక్కో విధంగా చంపి తన బిడ్డను మాన్యకు అప్పగించడంతో సినిమా ముగుస్తుంది.
కథలో చిన్న చిన్న లోపాలున్నా అవి పట్టించుకోదగ్గవి కావు. హీరో కుటుంబాన్ని విలన్లు హింసించే దృశ్యాల నిడివి కొంత తక్కువగా వుంటే బాగుండేది. సినిమా కూడా రక్తి కట్టి వుండేది. డబ్బింగ్లో పర్ఫెక్షన్ లోపించింది. నటనలో అగ్రతాంబూలం హీరో శ్రీహరిదే. ఫైటింగ్ సీన్స్లో అతని బాడీ ఎలా కావాలంటే అలా మౌల్డ్ కావడం అచ్చెరువొందించే విషయం. అయ్యప్ప దీక్ష తీసుకున్న నాగబాబు పాత్ర వున్నంత సేపు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోసాని సంభాషణలకు పలు సందర్భాల్లో ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేయడం ఖాయం. వందేమాతరం శ్రీనివాస్ రీ-రికార్డింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకుని వుంటే చిత్రం మంచి ఆదరణ పొందేలా రూపొంది వుండేది.
థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఫరవా లేదని మాత్రమే చెబుతాడు గానీ బాగుందని, చాలా బాగుందని చెప్పడు. 'ఎ' క్లాస్ సెంటర్లో వారి కన్నా 'బి', 'సి' క్లాస్ సెంటర్స్ వారికి చిత్రం నచ్చుతుంది.