Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
GANDHARWA Movie Review: సందీప్ మాధవ్ నటించిన 'గంధర్వ' మూవీ ఎలా ఉందంటే?
వంగవీటి, జార్జి రెడ్డి వంటి బయోపిక్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు నటుడు సందీప్ మాధవ్. ఆయన ప్రధాన పాత్రలో గాయత్రి సురేష్ హీరోయిన్ గా సాయి కుమార్, సీనియర్ హీరో సురేష్, బాబు మోహన్ జబర్దస్త్ రాము, సమ్మెట గాంధీ వంటి వారు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం గంధర్వ. అప్సర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో లేని సరికొత్త పాయింట్తో తెరకెక్కింది అంటూ సినిమాను విడుదల చేస్తున్న సురేష్ కొండేటి ముందు నుంచి ప్రచారం చేయడంతో సినిమా మీద కాస్త ఆసక్తి నెలకొంది. మరి ఆ సినిమా ప్రేక్షకులు అంచనాలను ఏం మేరకు అందుకుంది? అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం
గంధర్వ కథ విషయానికి వస్తే
మిలిటరీ కెప్టెన్ అవినాష్(సందీప్ మాధవ్) పెళ్లి చేసుకోవడం కోసమే తన స్వగ్రామం వాల్తేరు వస్తాడు. అక్కడే అమూల్య(గాయత్రి సురేష్) అనే అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అయితే 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధానికి వెళ్లిన అవినాష్ మళ్లీ వెనక్కి తిరిగి రాడు. మిలిటరీ వాళ్ళు అవినాష్ చనిపోయాడని బాడీ తెచ్చి అప్పగిస్తారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేస్తారు. కట్ చేస్తే అవినాష్ కుమారుడు విజయ్ (సాయికుమార్) ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాడు. చావు బతుకుల్లో ఉన్న సీఎం తర్వాత సీఎం ఎవరు అవ్వాలనే విషయం మీద కాశి (సురేష్)తో పోటీ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే చనిపోయాడు అనుకున్న అవినాష్ 50 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. 50 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి తన కుటుంబాన్ని కలిసిన అవినాష్ వారిని తాను అవినాష్ నే అని ఎలా ఒప్పించగలిగాడు? నిజంగా 50 ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన వ్యక్తి కనిపించకుండా పోయినప్పటి వయసుతో బయటికి రావడం కుదురుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే
మొదటి భాగం అంతా కేవలం పాత్రల పరిచయానికి ఎక్కువ ఆస్కారం చూపించారు దర్శకుడు. అసలు అవినాష్ ఎవరు? అవినాష్ కుటుంబ నేపథ్యం ఏమిటి? మిలటరీకి వెళ్ళిన అవినాష్ ఏ పరిస్థితులలో కనిపించకుండా పోయాడు? అసలు అవినాష్ కి ఏమైంది? అనే విషయాలని మొదటి భాగంలో చూపించడానికి ప్రయత్నించారు. అలాగే 50 ఏళ్ల తరువాత అదే వయసుతో లేచిన అవినాష్ తనని తాను నిరూపించుకోవడం కోసం ఏం చేశాడు? చివరికి తన భార్యను సైతం నమ్మించిన అవినాష్ కొడుకుని లోకాన్ని నమ్మించడానికి ఏం చేయబోతున్నాడు అనే సస్పెన్స్ తో మొదటి భాగాన్ని పూర్తి చేశారు.
సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వాస్తే
సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా కనిపించకుండా పోయిన అవినాష్ తనని తాను ఎలా నిరూపించుకున్నాడు అనే విషయాన్ని చూపించడానికి ప్రయత్నించారు. అయితే సాధారణంగా 50 ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన వ్యక్తి తిరిగి వస్తే అది ఎవరూ నమ్మడం అంత సాధ్యం కాదు. కానీ ఎక్కడికక్కడ లాజికల్ గా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే విధంగా తెరకెక్కించడానికి దర్శకుడు విఫల ప్రయత్నం చేశారు. దానిలో చాలావరకు సక్సెస్ సాధించారనే చెప్పాలి. సెకండ్ హాఫ్ అంతా కొంత ఆశ్చర్యకర సీన్లు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
దర్శకుడు టేకింగ్ విషయానికి వస్తే
మిలిఅతరీ పని చేసి వచ్చి తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఈ సినిమాతో దర్శకుడిగా మారిన అప్సర్ ఎక్కడా కూడా కొత్త దర్శకుడు అనిపించే విధంగా డీల్ చేయలేదు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా చాలా సాదాసీదాగా సినిమా మొత్తం ప్లాన్ చేశారు. అయితే 50 ఏళ్ల పాటు కోమా స్థితిలో ఉండి తర్వాత వచ్చిన అవినాష్ తనకంటే వయసు ఎక్కువ వేషధారణలో ఉన్న హీరోయిన్ తో రొమాన్స్ చేసిన సీన్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ప్రేక్షకులు కొంతవరకు ఆ సీన్స్ ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఇక దర్శకుడు కూడా ఎక్కడ తొట్రు పడకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నం చేసి చాలా వరకు సఫలమయ్యారు. కొన్ని చిన్న చిన్న తప్పులు దొరిలాయి కానీ దర్శకుడు మొదటి అటెంప్ట్ లో చాలా వరకు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు అని చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే
లీడ్ హీరోగా ఇది సందీప్ కు మొదటి కమర్షియల్ సినిమా అని చెప్పవచ్చు. గతంలో కొన్ని బయోపిక్ చేశారు అలాగే ఇతర సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. కానీ హీరోగా మొట్టమొదటి కమర్షియల్ సినిమా ఇదే. అయితే సందీప్ ఎక్కదా ఇబ్బంది పడకుండా నటనలో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. గత సినిమాలతో పోల్చుకుంటే ఆయన నటన కాస్త మెరుగుపడిందని చెప్పాలి. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన గాయత్రి సురేష్ అటు యువ పాత్రలోనూ తర్వాత ముదుసలి పాత్రలోనూ తమదైన శైలిలో మెప్పించింది. ఆమె పాత్రతో యుక్త వయసులో లేని ముద్దు సీన్లు ముదుసలి అయ్యాక జొప్పించడంతో కాస్త ఇబ్బంది పడుతూనే ఆమె చేసినట్లు అనిపిస్తుంది. మంత్రి పాత్ర పోషించిన సాయి కుమార్ నటన ఎప్పటిలాగే ఆకట్టుకుంది. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులు ఆకట్టుకున్నాడు. ఇక బాబు మోహన్ టైమింగ్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. జబర్దస్త్ రాంప్రసాద్, రోహిణి సీన్లు బాగా పండాయి. సినిమా మొత్తానికి వారిద్దరిదే కామెడీ ట్రాక్ అని చెప్పొచ్చు. వీర శంకర్ సర్ప్రైజింగ్ రోల్ లో మెరిసారు. సై సూర్య, జబర్దస్త్ రాము, సమ్మెట గాంధీ వంటి వారు ఇతర కీలక పాత్రలో మెరిశారు. హీరో సురేష్ కూడా విలన్ క్యారెక్టర్ లో అద్భుతంగా రాణించారు.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే
సంగీతం అందించిన రాప్ రాక్ షకీల్ పలు పాటలతో ఆకట్టుకోవడమే గాక నేపథ్య సంగీతంతో కూడా ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ అందించిన బసవ పైడి రెడ్డి కూడా తనదైన శైలిలో సినిమా తీర్చిదిద్దడంలో మంచి చురుకైన పాత్ర పోషించాడు. సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి కూడా కొన్ని సీన్లకు అదనపు అందం జోడించినట్టే చెప్పాలి. అయితే నిర్మాణ విలువలు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. కొన్ని కొన్ని చోట్ల ఈ విషయం ప్రేక్షకులు ఇట్టే పసిగట్టే అవకాశం ఉంటుంది.
ఫైనల్ గా:
మిలటరీ సహా రక్షణ శాఖకు సంబంధించిన కుటుంబాల వారికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సాధారణ ప్రేక్షకులు కూడా ఒకసారి చూసి ఆనందించే సబ్జెక్ట్ ఇది. 50 ఏళ్ల పాటు కనిపించకుండా పోయి తర్వాత తిరిగి వస్తే అనే కాన్సెప్ట్ తోనే మొత్తం సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది.
నటీనటులు: సందీప్ మాధవ్, గాయత్రి సురేష్, సాయి కుమార్, వీరశంకర్ తదితరులు
దర్శకుడు: అప్సర్
నిర్మాతలు: సుభాని, సురేష్ కొండేటి
మ్యూజిక్ డైరెక్టర్ : రాప్ రాక్ షకీల్