Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ఎప్పటిదీ కథ సార్? (‘జాగ్వార్’రివ్యూ )
---సూర్య ప్రకాష్ జోశ్యుల
మన తెలుగు ప్రేక్షకులు కథ బాగుండి కనెక్ట్ అయితే భాషా భేధం లేకుండా ఎక్కడ హీరోనైనా మెచ్చుకుని, వంద రోజుల సినిమాలు చేసేస్తారు. అందుకు బిచ్చగాడు లాంటి సినిమా ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. అదే ధైర్యంతో మాజీ ప్రధాని మనవడు, కర్ణాటక మాజీ సీఎం కొడుకు అయిన నిఖిల్ గౌడ కూడా మన తెలుగు వారి ముందుకు వచ్చాడు.
ఒక్క దెబ్బతో కన్నడ, తెలుగులో సెటిలైపోవాలన్నట్లుగా ... డబ్బుని నీళ్లులా పోసుకుంటూ లాంచింగ్ చిత్రమే భారీగా తీసారు. అంతేకాకుండా తెలుగువాళ్లని ఎట్రాక్ట్ చేయటానికి బాహుబలి, బజరంగి భాయీజాన్ వంటి రీసెంట్ హిట్లతో దూసుకుపోతున్న విజయేంద్రప్రసాద్ కథని తీసుకున్నారు.
బాలయ్యతో మిత్రుడు చిత్రం తీసిన తెలుగు దర్శకుడు మహదేవ్ తో డైరక్ట్ చేయించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి తెలుగు ఆర్టిస్టులని కీ రోల్స్ కు తీసుకున్నారు. అయితే మాత్రం ఇక్కడ తెలుగు హీరోల కొడుకుల లాంచింగ్ సినిమాలకే కథ, కథనం కుదరకపోతే భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టే పరిస్దితి. ఈ స్దితిలో 'జాగ్వార్' పరిస్దితి ఏమిటి..వర్కవుట్ అవుతుందా అనే విషయాలు చూద్దాం.
ఇదే ట్విస్ట్
మెడిసిన్ చదవే... ఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) పగలు సరదా ప్రపంచం. రాత్రిళ్లు జాగ్వార్ గా మారి మర్డర్స్ చేసే వేరే ప్రపంచం. సిటీలో పేరున్న ఓ టీవీ ఛానల్నే హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తూ అవి లైవ్లో వచ్చేలా చేస్తూంటాడు. అది సంచలనంగా మారుతుంది
ఛానెల్ ఎండీనే..
ఇంతకీ హ్యాక్ కు గురి అయ్యే...ఆ ఛానెల్ ఎవరిదీ అంటే..ఎన్నో వ్యాపారాలు ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త శౌర్య ప్రసాద్ (సంపత్ రాజ్)., తన బిజినెస్ లను కాపాడుకునేందుకు ఎస్ ఎస్ టివి అనే న్యూస్ చానల్ ను కంచెలా పెట్టుకుని నిర్వహిస్తుంటాడు. తన టీవీ టీఆర్పీలు పెంచుకునేందుకు ఎలాంటి పనికైనా సిద్ధపడే సంపత్ ఛానల్ ను ఓ ముసుగు మనిషి(నిఖిల్ గౌడ) హ్యాక్ చేసి ఓ మర్డర్ ను లైవ్ టెలికాస్ట్ చేయటంతో షాక్ అవుతాడు.
జగపతిబాబు రంగంలోకి
ముసుగు వేసుకుని మన హీరో చేసే లైవ్ లో ఓ జడ్జి(ఆదిత్యా మీనన్ ) ని మర్డర్ చేస్తాడు. ఆ ముసుగు వ్యక్తిని పట్టుకునే బాధ్యత సిబిఐ ఆఫీసర్ జెబి(జగపతిబాబు)కి అప్పగిస్తారు. తను డీల్ చేయబోయే ఆ కేసుకు ఆ మర్డర్ చేసిన వ్యక్తికి జాగ్వర్ అని పేరు పెట్టుకుంటాడు జెబి.
అక్కడా అదే విలన్
మరోవైపు మన హీరో మెడికల్ కాలేజీలో మాత్రం చాలా హుషారైన కుర్రాడు. తన సీనియర్లని కూడా ఆట పట్టిస్తూ ఉంటాడు. తనతో పాటు చదువుతున్న ప్రియ(దీప్తి)ని ప్రేమిస్తాడు. ఎస్.ఎస్ ఛానల్ అధినేత శౌర్య ప్రసాద్ (సంపత్ రాజ్). విద్య.. వైద్యాన్ని వ్యాపారాలుగా చూస్తాడు. ఆయనకి సంభందించిందే ఆ కాలేజ్.
తొలి రోజు నుంచే గొడవ
తనని తాను అనాథగా పరిచయం చేసుకొని శాంతి మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా జాయిన్ అయిన మన హీరో ... అదే కాలేజిలో ఫైనల్ ఇయర్ చదివే సిన్సియర్ స్టూడెంట్ ఆర్యతో ఫస్ట్ రోజునుంచే గొడవ పడతాడు. అదే సమయంలో ఆర్య.., కాలేజ్ లో, హాస్పిటల్ లో జరిగే అన్యాయాల మీద పోరాటం మొదలు పెడతాడు.
ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ని చంపేస్తాడు
తన కాలేజీలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్య (అవినాష్) అనే విద్యార్థి గళం ఎత్తితే... దాంతో ఆర్యని అడ్డు తొలగించుకోవాలని భావిస్తాడు శౌర్య ప్రసాద్. ఎన్కౌంటర్ శంకర్ (కాట్రాజు)ని దింపి చంపించే ప్రయత్నం చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్నీ జాగ్వార్ చంపేస్తాడు.
ఇదే కీ ట్విస్ట్
ఈలోగా జాగ్వార్కి సంబంధించిన ఓ కీలకమైన సమాచారం సీబీఐ ఆఫీసర్ జగపతిబాబు కి అందుతుంది. అదేంటి? ఆ జాగ్వార్.. ఈ కృష్ణ ఒక్కడేనా..? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ‘జాగ్వార్' కథ.
రావు రమేష్ పాత్రేంటి
కృష్ణ ఇలా హత్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఆ హత్యలన్నింటినీ లైవ్లో ఎందుకు ప్రదర్శిస్తూంటాడు? ఈ కథలో రామ చంద్రయ్య (రావు రమేష్), రమ్యకృష్ణ పాత్రలు ఏమిటి.... ప్రియ (దీప్తి సతి) ప్రేమ వ్యవహాం ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.
అనాధ కాదా...అసలేంటి
అసలు హీరో కృష్ణ, జాగ్వర్ పేరుతో ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? నిజంగానే కృష్ణ అనాథేనా..? జాగ్వర్ కేసును డీల్ చేస్తున్న జెబి జాగ్వర్ ను పట్టుకున్నాడా..? అన్నదే మిగతా కథ.
అప్పట్లో రాసిన కథ
విజియేంద్ర ప్రసాద్ ...ఇచ్చిన కథ, కథనమే ఈ సినిమాకు మైనస్ గా మారాయని చెప్పాలి. తమిళ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో వచ్చే అపరిచితుడు, జెంటిల్ మెన్ తరహాలో హీరో..వేరే వ్యక్తిగా మర్డర్స్ చేస్తూ సమాజంలో చీడ పురుగులను తొలిగించే కార్యక్రమం చేపట్టడం, అతనికో భారీ ప్లాష్ బ్యాక్ ఉండటం, చివరల్లో భారీ క్లైమాక్స్ లో హీరో రివీల్ అవటం జరుగుతూంటుంది. అలాంటి కథే ఇది. దాంతో చాలా సార్లు చూసిన కథే ఇది అనిపిస్తుంది.
దాచి పెట్టడమే దెబ్బ కొట్టింది
సినిమాలో హీరో వ్యవస్దపై కాకుండా తన రివేంజ్ తీర్చుకునే విధంగా సీన్స్ ఉంటాయి. అలాగే విలన్ కూడా ఉన్నాడు. అలాంటప్పుడు విలన్ కు ఫలానా వాడు హీరో అని ఇంటర్వెల్ కు అయినా తెలిస్తే...వాళ్లద్దరి మధ్యా పోటా పోటీ సన్నివేశాలు క్రియేట్ అయ్యేవి. అలా కాకుండా, చివరి దాకా..విలన్ కు హీరో ఫలానా అని తెలియకుండా దాచి పెట్టారు. ప్రీ క్లైమాక్స్ దాకా రివీల్ అవ్వలేదు. రివీల్ అయ్యాక ఫైట్ తో సినిమా క్లైమాక్స్ అయ్యిపోయింది.
ఓ కుర్రాడు సీబీఐ నే మోసం చేయటం...హ..హ..హ
మోసాలు చేయటానికి, కన్నంగ్ గా ఉండటానికి వయస్సుతో సంభంధం లేదనేది నిజమే కానీ సీబీఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్దకు చెందిన ఆఫీసర్ ని మోసం చేయాలంటే మాత్రం వాడు చాలా ఇంటిలిజెంట్, ఇల్లీగల్ ఎక్సపర్ట్ అయ్యిండాలి. ఈ కథలో హీరో వయస్సులో చిన్న కుర్రాడే కానీ సీబీఐకే ట్విస్ట్ ఇస్తే, సీబీఐ ఆఫీసర్ మామూలుగానే ఉంటాడు, మనకు షాక్ గా ఉంటుంది. అంటే మన రక్షణ, ఇన్విస్టిగేటివ్ వ్యవస్ద ఇంత దారుణంగా ఉందా అనే డౌట్ వచ్చేలా అనిపిస్తుంది
అప్పటినుంచే అనాసక్తి
మొదటి హీరో ఇంట్రడక్షన్, సినిమా కథ మొదలైన విధానం అన్నీ ఆసక్తిగానే అనిపించాయి. అలాగే సీబీ ఐ ఆఫీసర్ ఎంట్రీకూడా స్పీడుగానే జరిగింది. అక్కడ నుంచే కథ ఒక్క అడుగు కూడా కదలదు. సీబీఐ ఆఫీసర్ ఏమీ స్టెప్స్ తీసుకోడు తన తెలివితో. విలన్ కూడా తనకు ట్విస్ట్ ఇచ్చినవాడు ఎవరన్నట్లు వెతకడం మొదలెట్టడు. అంతా ప్యాసివ్ గానే..
కాలేజీ సీన్స్ ..దారుణం
కథ ఎప్పుడైతే కాలేజీలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి బోర్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ఒక్క అడుగూ ముందుకు వెయ్యడు. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాలను చాలా రొటీన్ గా తప్పదనన్నట్లు లాగించారు. ముఖ్యంగా ఆ కాలేజీలోనూ అదే విలన్ ..ఇలా విసిగిస్తుంది.
జగపతి, రమ్యకృష్ణ, బ్రహ్మానందం
సిబిఐ ఆఫీసర్గా రగ్డ్ లుక్తో జగపతిబాబు కొత్తగా బాగున్నారు. అయితే చేయటానికి కథలో ఏమీ లేదు. కేవలం అటూ ఇటూ తిరగటం, ఆలోచించంట ఈ షాట్స్ తోనే సినిమా అంతా సరిపోయింది. విలన్ సంపత్నంది, ఆదిత్యమీనన్ల వీల్లదీ పరమ రొటన్ క్యారక్టర్సే. ఇక పాపులారిటీ పద్మనాభంగా బ్రహ్మానందం నవ్వించాలనే ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. రమ్యకృష్ణ చిన్న పాత్రలో కనపడి మెప్పించింది.
విషయం బాగుంది కానీ..
నిజానికి ఈ సినిమాలో చర్చించిన విషయం మందిదే..అభినంచదగ్గదే. కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీని చూపాలనుకున్నారు. కానీ అందుకోసం ఎంచుకున్న ట్రీట్ మెంటే అసలు సంభంధం లేకుండా నడిచింది.
తమన్నా, తమన్ ఎలా చేసారంటే
తమన్నా ఐటం సాంగ్ గురించి బాగా పబ్లిసిటీ చేసారు. అయితే సినిమాలో అది పెద్దగా కిక్ ఇవ్వలేదు. ప్లేస్ మెంట్ కూడా కరెక్ట్ గా లేదు. ఇక తమన్ పాటలు అంత గొప్పగా లేవనే చెప్పాలి. కన్నడ వాల్ళకు అవి కొత్తగా అనిపించవచ్చేమో కానీ, మనకు రొటీన్ రొట్టకొట్టుడులా అనిపిస్తాయి.
వీళ్లే ఎస్సెట్..
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ టెక్నికల్గా బిగ్గెస్ట్ ప్లస్. విజువల్స్ అన్నీ రిచ్గా కనిపించేలా, లొకేషన్స్ను బాగా వాడుకుంటూ, లైటింగ్, ఫ్రేమింగ్తో మనోజ్ పరమహంస ప్రతిచోటా ఆకట్టుకున్నారు. తమన్ పాటలు ఎలా ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు. రూబెన్ ఎడిటింగ్ ఓకే.
డైరక్టర్ కన్నా వాళ్లే బెస్ట్..
ఈ సినిమాలో చెప్పుకోవాలి, మెచ్చుకోవాల్సిన వాళ్లు యాక్షన్ కంపోజ్ చేసిన యాక్షన్ డైరక్టర్సే. సినిమా ఫస్టాఫ్ ఛేజ్, సెకండాఫ్లో కార్ ఛేజ్ బాగా డిజైన్ చేసి దుమ్ము దులిపారు. డైరక్టర్ మాత్రం లావిష్ గా సినిమా తీసాడు కానీ ఎక్కడా తన ప్రతిభ మాత్రం కనపడనివ్వలేదు. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్కు ఎక్కడా కాస్త కూడా వంక పెట్టడానికి లేదు.
టీమ్ వీళ్లే...
సంస్థ: చిన్నాంబిక ఫిల్మ్స్
నటీనటులు:నిఖిల్ గౌడ, దీప్తి, జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యమీనన్, భజ్రంగ్ లోకేష్, అవినాష్, వినాయక్ జోషి, ప్రశాంత్, సుప్రీత్ రెడ్డి, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం:మనోజ్ పరమహంస
కూర్పు:రూబిన్
కథ: విజయేంద్రప్రసాద్
ఆర్ట్: నారాయణరెడ్డి,
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి,
ఫైట్స్: రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా), సెల్వ,
కో డైరెక్టర్: అమ్మినేని మాధవసాయి,
స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: మహదేవ్
నిర్మాత: అనితా కుమారస్వామి
సమర్పణ: హెచ్.డి. కుమారస్వామి,
విడుదల: 06-10- 2016
ఫైనల్ గా తెలుగులో చెప్పుకోదగ్గ ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం ఇక్కడ వాళ్లకు ఎన్నో సార్లు చూసిన పరమరొటీన్ కథే కాబట్టి కొంచెం కూడా కొత్తగా అనిపించదు. కొత్తగా అనిపించని చిత్రాలే మాకు ఇష్టం..పెద్దగా మైండ్ కు శ్రమ పెట్టవు అనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.