వినోదం మనది జయం వారిది

నటీనటులు - వెంకటేష్, సౌందర్య, భానుప్రియ, బ్రహ్మానందం,
ఏవీయస్, ఎల్.బి శ్రీరాం, భరణి, జయప్రకాష్, సత్యప్రకాష్, అశోక్ కుమార్,
సూర్య, రాజారవీంద్ర, వెన్నిరాడై నిర్మల, అహుతి ప్రసాద్, రమాప్రభ తదితరులు
మాటలు -పరుచూరి బ్రదర్స్
సంగీతం- వందేమాతరం శ్రీనివాస్
కెమేరా- రవీంద్రబాబు
సమర్పణ- డి. రామానాయుడు
నిర్మాత- డి. సురేష్బాబు
దర్శకత్వం- ఎన్. శంకర్.
సర్వసాధారణంగా ఆ సంస్థ తీసిన చిత్రాలు 90శాతం వరకు నిరాశపరచవు. ఈ సంస్థ నిర్మించిన చిత్రాల్లో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల మసాలాలు ఉంటాయి. ఏ తరహా కథని ఎంపిక చేసుకున్నా జనరంజకంగా మలచడంలో సిద్ధహస్తులైన నిర్మాతలు సురేష్బాబు, రామానాయుడు. తాజాగా శనివారం (7.10.2000) విడుదలైన జయం మనదేరా చిత్రాన్ని కూడా అదే కోవకు చెందిన చిత్రంగా పేర్కొనవచ్చు. అండర్ కరెంట్లో అందరికీ సామాజిక న్యాయం అనే పాయింట్ ఉన్నప్పటికీ, షుగర్ కోటెడ్ పిల్లా మాస్ మసాలా కూర్చి రూపొందించిన చిత్రం ఇది. క్లయిమాక్స్ మినహా మిగిలిన చిత్రం మొత్తాన్ని ఆకట్టుకునేలా రూపొందించారు దర్శక నిర్మాతలు. వెనుకబడిన వర్గాల వారికి ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా సమానత్వం ఉండాలని పోరాడుతూ విద్రోహుల చేతుల్లో హతమైన వ్యక్తి కుమారుడు తండ్రి ఆశయాలను ఎలా నెరవేర్చాడనేదే ఈ చిత్రం.
కుమారుడి పెళ్లి చూపుల నిమిత్తం, వచ్చిన నరసింహనాయుడి (జయప్రకాష్) కుటుంబాన్ని హతం చేయాలని ప్రయత్నించి ఓ బృందం విఫలం అవుతుంది. దాంతో అలర్ట్ అయిన నరశింహ నాయుడు శత్రువుల్ని వేటాడాలని నిర్నయించుకుంటాడు. కట్ చేస్తే యూరప్ ఖండానికి సీను మారుతుంది. థమ్స్ అప్ పోటీ విజేతల యూరోప్ ట్రిప్లో భాగంగా వాళ్లని రిసీవ్ చేసుకోనున్న స్నేహితుని విన్నపంతో వచ్చిన హీరో ఆ బృందంలోని సౌందర్యతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ, డ్యూయెట్లు షరామామూలే. అయితే హీరో తండ్రి ఇండియా అమ్మాయిని పెళ్లాడటానికి ఒప్పుకోడు.
ఇండియా వచ్చిన సౌందర్య కోసం వెంకటేష్ కూడా ఇండియా వస్తాడు. అప్పటికే వెంకటేష్ (రుద్రమ నాయుడు) తమ శత్రువు నరసింహదేవనాయుడి కొడుకుగా గుర్తించి చంపడానికి ప్రయత్నిస్తారు నరసింహనాయుడి బృందం. ఈ నేపథ్యంలో తన వాళ్లని కలుసుకుంటాడు రుద్రమనాయుడు. ఆ తర్వాత వాళ్లద్వారా తన గత చరిత్ర తెలుసుకుని నరసింహనాయుడి బృందాన్ని అంతం చేసి తండ్రి ఆశయాన్ని నెరవేర్చడంతో కథ ముగుస్తుంది.
యూరోప్ అందాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. సినిమా ప్రారంభ సన్నివేశం నుంచి ప్రథమార్ధం వరకూ ఆసాంతం అందర్నీ అలరించేలా ఉంది. అయితే ద్వితీయార్ధంలో ఆ పట్టు కొంచెం సడలిందనే చెప్పవచ్చు. ప్రత్యేకించి క్లయిమాక్స్ మక్కీకి మక్కీ కాపీ. ఇద్దొక్కటే చిత్రంలో నచ్చని అంశం. రెండు మూడు పాటలు, వాటి చిత్రీకరణ బాగానే ఉన్నాయి. పరుచూరి సంభాషణలు పర్వాలేదు. దర్శకుడు శంకర్ పనితీరు శ్రీరాములయ్యను మరిపించింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్ (ద్విపాత్రాభినయం) బాగానే చేసినప్పటికీ తండ్రి పాత్ర కృష్ణంరాజు వంటి నటుడు చేసి ఉంటే బాగా ఉండేదేమో అనిపించింది. సౌందర్ ఒ.కె. భరణి, బ్రహ్మానందం, ఎల్.బి శ్రీరాం బృందం ప్రధమార్ధంలో కామెడీని బాగా పండించింది. వందేమాతరం రీ రికార్డింగ్ కూడా బావుంది. నిర్మాణపరంగా ఏ విషయంలోను రాజీ పడలేదు అన్న విషయం స్పష్టం అయింది. అయితే పతాక సన్నివేశాలను భారీ జన సందోహం మధ్య చిత్రీకరించి ఉంటే హైలెట్ అయ్యేది. ఒకటి మాత్రం నిజం. నిరాశ పరచని చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











