Mrithyunjay Celebrity Review: మృత్యుంజయ్ మూవీపై హీరో నాని రివ్యూ..శ్రీవిష్ణు థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Mrithyunjay Celebrity Review: విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. తాజాగా మరోసారి కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన తాజా సినిమా 'మృత్యుంజయ్' ఇప్పటికే ట్రైలర్, ప్రమోషన్స్తో మంచి బజ్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని చేసిన ప్రశంసలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. విడుదలకు ముందే ప్రముఖ హీరో, నాచ్యురల్ స్టార్ నాని నుంచి వచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?
'మృత్యుంజయ్' సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. ఇందులో చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతున్నట్లు సమాచారం. కథ ప్రకారం విక్రాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ ఘటనతో అతని చిన్నారి అనాథగా మారుతుంది. ఆ చిన్నారి మౌనం వెనుక ఉన్న రహస్యం కథలో కీలక అంశంగా మారుతుంది. ఇక తన స్నేహితుడి మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి జయ్ (శ్రీవిష్ణు) అనే యువకుడు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ అతడిని అధికారులు తిరస్కరిస్తారు. అయినప్పటికీ తన స్నేహితుడి హత్య వెనుక ఉన్న మిస్టరీని బయటపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడు ఎందుకు రకరకాల వేషాలు వేస్తాడు? అసలు హత్య వెనుక ఉన్న నిజం ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ సాగుతుందట.
ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన హీరోయిన్గా రెబ్బా మోనికా జాన్ నటించారు. వీరిద్దరూ గతంలో 'సామజవరగమన' సినిమాలో కలిసి నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే జంట మళ్లీ స్క్రీన్పై కనిపించనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో బేబీ ఉల్హా, సుదర్శన్, రచ్చ రవి, అయప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నందగోపాల్, మిర్చి మాధవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
'మృత్యుంజయ్' సినిమాకి శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంగీతాన్ని కాలభైరవ అందించగా, సినిమాటోగ్రఫీని విద్యాసాగర్ చింతా, ఎడిటింగ్ను శ్రీకర్ ప్రసాద్ నిర్వహించారు. ప్రొడక్షన్ డిజైనర్గా మనీష్ దత్ పని చేశారు.
ఇప్పటికే విడుదలైన 'మృత్యుంజయ్' ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయడం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ట్రైలర్లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి UA16+ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా సుమారు 2 గంటల 2 నిమిషాల రన్టైమ్ను ఫిక్స్ చేశారు. కథను సాగదీయకుండా కాంపాక్ట్గా తెరకెక్కించారని సెన్సార్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
నాని రివ్యూ
'మృత్యుంజయ్' సినిమా ప్రీ వ్యూ చూసిన తర్వాత నాని సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మృత్యుంజయ్ మూవీని మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాను. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, ఫన్ రోల్స్లో ఎంత బాగా నటిస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఆయన నటన మాత్రం ఒక సర్ప్రైజ్ లా అనిపించింది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన మరో కొత్త కోణంలో కనిపించారు. చాలా బాగా చేశారు'అని ప్రశంసించారు.
అంతేకాదు, ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న సన్నీ గుణ్ణం (Sunny Gunnam) గురించి కూడా నాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'నా స్నేహితుడు సన్నీ గుణ్ణం తొలి నిర్మాణం చేస్తున్నందుకు అభినందనలు. ఎప్పుడూ నువ్వు కొత్తదనాన్ని ఎంచుకుంటావని నాకు తెలుసు. ఈ సినిమాతో కూడా అదే నిరూపించావు. టీమ్ మొత్తానికి రేపటి విడుదలకు ఆల్ ది బెస్ట్' అంటూ ఆయన ట్వీట్ చేశారు.నాని చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంసలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.
పలువురు నెటిజన్లు, సినీ అభిమానులు కూడా నాని వ్యాఖ్యలకు స్పందిస్తూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంసలు మూవీ మేకర్స్ కి మంచి బూస్ట్గా మారాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. నాని చేసిన ప్రశంసలు చూస్తుంటే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











