twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్‌ ఫార్ములా నరసింహనాయుడు

    By Staff
    |

    Narasimha Naidu
    పట్టున్న కథ, చిక్కటి కథనం నరసింహనాయుడు సినిమాకు ప్రాణంలా నిలిచాయి. రాయలసీమ మార్కు కథలకు భిన్నంగా ఉండడం మరో ప్లస్‌ పాయింట్‌. ఇక కథలోకి వెళ్తే - రాయలసీమలోని ఒక ఊళ్ళో ఇటు రఘుపతి నాయుడు అటు అప్పల నాయుడు ఉంటారు. రఘుపతి నాయుడు ధర్మరాజు వంటి వాడు. అప్పలనాయుడు పచ్చి రక్తంతాగే పక్కా సినిమా మార్కు విలన్‌. లక్ష్మినరసింహస్వామి విగ్రహ ఊరేగింపు సందర్భంగా రఘుపతి నాయుడు మనుషులను అప్పలనాయుడు చంపిస్తాడు. ఇంతవరకు మామూలు కథే. దీనితో మనసు వికలమైన రఘుపతి నాయుడు ఈ దుర్మార్గుడి బారి నుంచి అమాయకులను రక్షించేదెలాగని సీరియస్‌ గా ఆలోచించి ఒక మార్గాంతరం కనిపెడతాడు. ఈ ఉపాయమే సినిమాకి హైలైట్‌. దీని ప్రకారం ఆ ఊళ్ళో ప్రతి ఇంటి వాళ్ళు తమకు పుట్టిన మగ బిడ్డను గ్రామ రక్షణకు ఇవ్వాలి. తన వంతుగా రఘుపతి నాయుడు తన కొడుకు బాలకృష్ణను ఇస్తాడు. వారందరితో ప్రజా రక్షణ సైన్యం తయారవుతుంది. దీనికి సహజంగానే బాలకృష్ణ నాయకత్వం వహించి అప్పల నాయుడు మీద యుద్ధ భేరి మోగించి అతన్ని చంపేస్తాడు.

    ఇదిలా ఉంటే గ్రామం కోసం మొరటు మషిగా తయారైన నరసింహనాయుడుకు ఎవరూ పిల్లను ఇవ్వక పోవటంతో అబద్దమాడి సిమ్రాన్‌తో పెళ్ళి జరిపిస్తాడు రఘుపతినాయుడు. అప్పలనాయుడుని చంపిన నరసింహనాయుడు పై పగతో అతని బావ కుప్పుస్వామి నాయుడు రఘుపతినాయుడు కుటుంబాన్ని కడతేర్చటానికి కంకణం కట్టుకుంటాడు. అన్నలను అవమానించిందని భావించిన సిమ్రాన్‌ ను ఇంటినుంచి వెళ్ళగొడతాడు నరసింహనాయుడు. అప్పటికే ఆమె గర్భవతి. నరసింహనాయుడు కుమారుడిని చంపాలనుకున్న కుప్పుస్వామి నాయుడు బారి నుంచి బిడ్డను రక్షించి సిమ్రాన్‌ ప్రాణాలు విడుస్తుంది. అయితే భార్య చివరి కోరిక మేరకు బాలయ్య ఆ ఊరు విడిచి పెట్టి డాన్సు టీచర్‌ గా శాంతియుత జీవితం గడుపుతుంటాడు. ఇదంతా ఫ్ల్యాష్‌ బ్యాక్‌లో వస్తుందనుకోండి. ఇక్కడితో ఆగిపోతే సినిమా ఏం బాగుంటుంది?

    అందుకే అతనికి ప్రీతి జింగ్యానీతో పరిచయం అవుతుంది. ఈ ప్రీతి కుప్పుస్వామి నాయుడు కూతురు. కొన్ని లవ్‌ సాంగ్స్‌,రొమాంటిక్‌ సన్నివేశాల అనంతరం డాన్స్‌ టీచరే నరసింహనాయుడు అని తేలటంతో దాడికి వస్తాడు కుప్పుస్వామి నాయుడు. తిప్పి కొట్టిన నరసింహనాయుడు ప్రీతిని తీసుకు వెళ్ళటానికి కళ్యాణ మంటపానికి వస్తానని సవాల్‌ చేస్తాడు. అలాగే వెళ్ళి విలన్‌ భరతం పట్టడంతో, హీరోకు సారీ చెప్పుకున్న కుప్పుస్వామి నాయుడు తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేయడంతో సినిమా సుఖాంతమవుతుంది. సినిమాలో రౌద్ర రసం, ప్రణయ రసం సమపాళ్లలో ఉండడం వల్ల ప్రేక్షకుడు ఎక్కడా బోర్‌ ఫీల్‌ కాడు. పాటలు బాగున్నాయి. వాటిని చిత్రీకరించిన లొకేషన్లు అద్బుతంగా ఉన్నాయి.

    ప్రత్యేకించి కథ కన్నా కథనం చాలా బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు కూడా మోతాదుకు తగ్గట్టే ఉండటంతో సినిమా రక్తి కట్టింది. చిన్ని కిష్ణ స్ర్కీన్‌ప్లే, పరుచూరి సోదరుల సంభాషణలు ఈ సినిమాకు ఆయువు పట్టుగా పేర్కొన వచ్చు. వి.యస్‌.ఆర్‌.స్వామి కెమెరా పనితనం, నటీనటుల నటన అన్ని సమస్థాయిలో ఉన్నాయి. విరామంకు ముందు వచ్చే ట్రయిన్‌ ఛేజ్‌ సినిమాకు హైలైట్‌. అయితే సినిమాలోని కేరక్టర్ల పేర్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. రాయలసీమలో చిత్తూరు జిల్లాలో తప్ప నాయుడులు మరెక్కడా ఉండరు. చిత్తూరు జిల్లాలో ఫ్యాక్షన్లు లేవు. అయితే ఈ చిన్న అపశృతి గురించి సామాన్యులకు అనవసరం గనుక సినిమా దివ్యంగా ఆడుతుంది. 2001 సంవత్సరంలో హిట్‌కు బోణీ కొట్టడమే కాకుండా తెలుగుసినీ పరిశ్రమకు మంచి రోజులు తీసుకొచ్చిన చిత్రంగా ఈ సినిమాను అభివర్ణించవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X