twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీరసించిన నరసింహుడు

    By Staff
    |

    Narasimhudu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: నరసింహుడు‌
    విడుదల తేదీ: 20-5-2005‌
    నటీనటులు: ఎన్‌టి రామారావు, అమీషాపటేల్‌, సమీరా రెడ్డి,‌
    ఆర్తి అగర్వాల్‌, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్ధి, కళాభవన్‌ మణి, నాజర్‌,‌
    చలపతిరావు, ధర్మవరపు సుబ్రమణ్యం, అలీ, పునీత్‌ ఇస్సార్‌, కైకాల సత్యనారాయణ,‌
    జీవి, రాహుల్‌దేవ్‌, కృష్ణ భగవాన్‌, జయప్రకాష్‌ రెడ్డి, తనికెళ్ళ భరణి, నర్రా వెంకటేశ్వరరావు,‌
    రాళ్ళపల్లి, శ్రీనివాసరెడ్డి, మనోరమ, హారిక, అర్పిత, రాధిక,‌
    రమ్యా చౌదరి, విమల, లావణ్య తదితరులు‌
    కథ: పి.రవిశంకర్‌‌
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌‌
    సంగీతం: మణిశర్మ‌
    పాటలు: వేటూరి సుందర రామ్మూర్తి, సిరివెన్నెల, భువనచంద్ర, వెన్నెలకంటి.‌
    సినిమాటోగ్రఫీ: కె.రవీంద్రబాబు‌
    ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు‌
    కొరియోగ్రఫీ: రాజు సుందరం, లారెన్స్‌, బృంద, కళ్యాణ్‌‌
    ఫైట్స్‌: విజయ్‌‌
    దర్శకత్వం: బి.గోపాల్‌‌
    నిర్మాత: చెంగల వెంకటరావు‌

    ఎన్టీఆర్‌ని 'బాలభీముడు'గా చిత్రీకరించిన 'నరసింహుడు' పాతకథ, బలహీనమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. ఎన్టీఆర్‌ అభిమానులను కూడా అలరించని సినిమా ఇది.

    సినిమా ప్రారంభంలోనే ఆశిష్‌ విద్యార్ధి ఉత్తర భారతదేశం నుంచి పోలీసు కమిషనర్‌గా వస్తాడు. నగరంలో ఇద్దరు దుర్మార్గులు జెడి (పునీత్‌ ఇసార్‌), పోతురాజు (కళాభవన్‌ మణి) గురించి తెలుసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులో కొన్ని హత్యల ద్వారా చూపిస్తారు. కొత్త కమిషనర్‌ వీరి అంతు చూడడానికి ప్రయత్నించినా, పై నుంచి వచ్చే వత్తిడుల వల్ల ఏమీ చేయలేకపోతాడు. నగర ప్రజలు ఈ దుర్మార్గుల అంతు చూసే 'భగవంతుడి' కోసం ఎదురు చూస్తుంటారు. సరిగ్గా అదే సమయానికి ఎన్టీఆర్‌ ప్రత్యక్షమవుతాడు.

    బస్సులో ఒకమ్మాయిని వేధిస్తున్న 11 మంది ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ని ఫుట్‌బాల్‌లా తంతాడు. అదో పెద్ద ఫైట్‌ సీన్‌. పోలీసులు వచ్చి ఎన్టీఆర్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తారు. కమిషనర్‌ అతడిని, రక్తం కారే అతని కళ్ళను చూసి, షాక్‌ తిని 'అడవిపులి' అని భయపడతాడు. ఎవరని ఎంక్వయిరీ చేస్తుండగా చలపతిరావు వచ్చి అతను మూగవాడని, మావాడని చెప్పి తీసుకెళ్తాడు. బస్సులో రక్షించిన అమ్మాయి వాళ్ళింట్లో సెటిల్‌ అవుతాడు ఎన్టీఆర్‌. అక్కడ సమీరారెడ్డి అనే పాల్గాట్‌ అమ్మాయి ఎన్టీఆర్‌ని చూసి మోజుపడి పాటలు పాడుకుంటుంది. ఆ కాలనీకి 'పొన్నాంబళం' అనే రౌడీ మామూళ్ళు వసూలుచేసుకోడానికి వచ్చి అక్కడ ఎన్టీఆర్‌ని చూసి నమస్కారం పెట్టి పారిపోతాడు. అంత పెద్ద రౌడీ భయపడిపారిపోయాడంటే ఎన్టీఆర్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎంతో పెద్దదని అర్ధమవుతుంది.

    ఫ్లాష్‌బ్యాక్‌ని కన్‌ఫర్మ్‌ చేయడానికి జయప్రకాష్‌రెడ్డి అనే ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ని చూసి గుండె ఆగి మరణిస్తాడు. రాత్రుళ్ళు ఎన్టీఆర్‌ ఎవరి కోసమో వెదుకుతూ కమిషనర్‌ కళ్ళల్లో పడతాడు. ఈలోగా ఎన్నికలు వచ్చి, జెడి తనకొడుకు రాహుల్‌దేవ్‌ని కళాభవన్‌ మణి తమ్ముడికి పోటీగా నిలబెడతాడు. కళాభవన్‌ మణి తమ్ముడిని ఎన్టీఆర్‌ చంపేస్తాడు. మణికి ప్రత్యర్ధుల మీద అనుమానం వస్తుంది. తర్వాత జెడి కొడుకుని కూడా ఎన్టీఆర్‌ చంపేస్తాడు. ఈ హత్యలు చేసింది ఎన్టీఆరేనని కమిషనర్‌ తెలుసుకుంటాడు. నువ్వెవరని నిలదీయగానే ఇంటర్వల్‌. ఆ తర్వాత ఫ్లాష్‌ బ్యాక్‌.

    ఎన్టీఆర్‌ పేరు కొండవీటి నరసింహుడు. అతని తల్లి, తండ్రి వరదల సమయంలో ఊరుకొట్టుకుపోకుండా కాపాడి మరణిస్తారు. ఊరంతా ఎన్టీఆర్‌ను తమ బిడ్డలా చూసుకుంటుంది. రోజుకో కుటుంబం భోజనం పెడుతుంటుంది. ఆ ఊరుకు వచ్చిన ఎమ్మార్వో ధర్మవరపు సుబ్రమణ్యం కూతురు అమీషా పటేల్‌ను ప్రేమిస్తాడు. ఇంతలో ఆ వూళ్ళో ఉండే చిట్టి అనే పన్నెండేళ్ళ పాపని జెడి కొడుకు, మణి తమ్ముడు రేప్‌ చేసి గెస్ట్‌హౌస్‌లోనే చంపేస్తారు. పోస్ట్‌మార్టం రిపోర్టును తారుమారు చేస్తారు. ఎన్టీఆర్‌ వీళ్ళ పనిపట్టడానికి నగరానికి బయలుదేరతాడు. అప్పుడు అమీషా పటేల్‌ పగతీరే వరకు మౌనంగా ఉండమని అతనికి సలహా ఇస్తుంది. ఇద్దరు విలన్లను హీరో ఎలా చంపుతాడన్నది మిగితా కథ.

    విశ్లేషణ:బి. గోపాల్‌ ట్రేడ్‌మార్క్‌ స్క్రీన్‌ప్లే పాత చింతకాయపచ్చడిలా ఉంది. హీరో చేసే హత్యలను జస్టిఫై చేసే ఫ్లాష్‌బ్యాక్‌ సీన్లు సరిగా ఎలివేట్‌ కాలేదు. అమీషాపటేల్‌- ఎన్టీఆర్‌ ప్రేమ సన్నివేశాల మీదే దృష్టి పెట్టారు. రేప్‌ చేయబడ్డ పాపకు, ఎన్టీఆర్‌కు ఉండే అనుబంధాన్ని ఎస్టాబ్లిష్‌ చేయలేదు. దానితో సన్నివేశాలు తేలిపోయి, సినిమా జీవం పోయింది. అమాయక గ్రామీణ యువకుడిగా ఎన్టీఆర్‌ వేష భాషలు నప్పకపోవడంతో పాత్ర ఔన్నత్యం దెబ్బతింది. హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్‌ డాల్స్‌గా పరిమితమయ్యారు. మాస్‌ వాతావరణం సృష్టించడంలో విఫలమయ్యారు. ఫస్టాఫ్‌లో అలీ బ్యాచ్‌ కామెడీ పండలేదు. సెకండాఫ్‌లో బ్రహ్మానందం జోకులు ఎన్నో సినిమాల్లో వచ్చినవే కాబట్టి విసుగు పుట్టిస్తాయి.

    ఫస్టాఫ్‌లో చలపతిరావు చనిపోయే సన్నివేశం లాజిక్‌కు అందదు. సెకండాఫ్‌లో ధర్మవరపు సుబ్రమణ్యం వయసులో ఉన్న కన్నకూతురు అమీషా పటేల్‌ చేత ఫైళ్ళను విలన్‌ గెస్ట్‌హౌస్‌కు పంపడం విడ్డూరం. ఎన్టీఆర్‌ ఉండే పల్లే విచిత్రంగా ఉంటుంది. ఉన్నది మూడువందల యాభై ఇళ్ళు అయినా గవర్నమెంట్‌ ఆఫీసులు అన్నీ ఉంటాయి. సినిమాలో చాలా సీన్లు పూర్తి కాకుండానే, మరో సీన్‌ రావడం ఎడిటింగ్‌ లోపం. దర్శకత్వపరంగా మెరుపులు ఏమీ లేవు. పల్లె కోసం నగరానికి వచ్చినట్టు చెప్పే ఎన్టీఆర్‌ పాత్రలో పల్లెతనం కన్పించదు. ఫస్టాఫ్‌ ఆసక్తికరంగా సాగినా సెకండాఫ్‌ భారంగా సాగుతుంది. కెమెరా పనితనం బాగుంది. ఇంటర్వల్‌ వరకు ఎన్టీఆర్‌ చేత ఒక్క మాట మాట్లాడించకపోవడం 'మండే సూర్యుడు' సినిమాలో లాగా ఉన్నా బాగుంది. ఆర్తి అగర్వాల్‌ ఐటంసాంగ్‌ బాగుంది. కొన్ని సీన్లలో ఎన్టీఆర్‌ ఉద్వేగాలను నియంత్రించుకోవడం బాగుంది. ఇది 'ఒరేయ్‌ రిక్షా' 'స్వామి' వంటి సినిమా కాబట్టి సి సెంటర్లలో కొంతవరకు ఆడవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X