మనసుకు హత్తుకునేచిత్రం

శివాజీ సతమ్, రీమాల ఏకైక కుమార్తె నిషా. కాలేజీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితుడు సునీల్. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. పరీక్షల సమయంలో నిషాకు జ్వరం వస్తుంది. ఎంతకీ తగ్గకపోవడంతో రక్తపరీక్ష చేస్తారు. అందులో నిషాకు హెచ్.ఐ.వి పాజిటివ్ ఉందని తెలుస్తుంది. చిన్నతనంలో అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగినప్పుడు రక్తాన్ని పరీక్షించకుండా ఎక్కించినందువల్లే ఈ దారుణం జరిగిందని డాక్టర్ చెపుతాడు. పెళ్ళికెదిగిన కూతురు ఎయిడ్స్ బారిన పడి చావును తప్పించుకోలేని పరిస్థితిని ఆ తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతారు. నిషా వ్యాధి గురించి సునీల్ కు చెప్పి తన కూతురును కలుసుకునే ప్రయత్నం చేయవద్దని శివాజీ చెపుతాడు.
అయితే, నిజమైన ప్రేమకు నిర్వచనం చెపుతూ సునీల్ నిషాను పెళ్లిచేసుకంటాడు. చిన్నపట్నుంచీ నిషా సంజయ్ దత్ అభిమాని. సంజయ్ దత్ నిషా ఉన్న ఆసుపత్రికి వచ్చి కలుసుకున్న తర్వాత... ఆమెను ఇంటికి తీసుకొస్తారు. కొద్దిరోజులకే ఆమె శాశ్వతంగా కన్నుమూస్తుంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తీసిన చిత్రం ఇది. అందుకే ఈ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం వినోదపు పన్నును రద్దుచేసింది. ఓ చక్కని కథను అల్లి మనసును కదిలించే విధంగా ఎయిడ్స్ వ్యాధి గురించి మహేష్ మంజ్రేకర్ చెప్పిన తీరు ప్రశంసనీయం. రాహూల్ రణడే సంగీతమూ ఈ చిత్రం మూడ్ కనుగుణంగా ఉంది. శివాజీ సతమ్, రీమాలాగూ వంటి సీనియర్ల నటనతో పాటు ఎయిడ్స్ పేషంట్ గా నిషాబైన్స్ నటనా ముగ్ధుల్ని చేస్తుంది. సునీల్ బార్వే నటన కూడా చాలా బావుంది.


Click it and Unblock the Notifications











