Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ రివ్యూ: ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది, కానీ....
మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు మూవీ శుక్రవారం గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రంలో మనోజ్ నటన ప్రశంస నీయంగా ఉంది. పీటర్, సూర్య పాత్రల్లో మనోజ్ మెప్పించాడు.
Recommended Video
మన పక్కదేశం శ్రీలంకలో అక్కడి ప్రభుత్వానికి, తమిళ టైగర్లకు జరిగిన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ బ్రతకలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భారత దేశం వైపు సముద్ర మార్గంలో వలస బాటపట్టిన శరణార్థులు ఎందరో. అలా బయల్దేరిన వారిలో సముద్రంలోనే సమాధి అయిన వారే ఎక్కువ.
శరణార్థులుగా భారత దేశం చేరిన కొద్ది మంది ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనే కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా 'ఒక్కడు మిగిలాడు' చిత్రం తెరకెక్కించారు. మంచు మనోజ్ కెరీర్లోనే ఒక విభిన్నమైన చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.... పీటర్(శ్రీలంకలో తమిళ టైగర్ల నాయకుడు), సూర్య (ఇండియాలో యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్)గా మనోజ్ ద్విపాత్రాభినయం చేశాడు.
దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి ఈ చిత్రం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేరకు కనెక్ట్ అవుతుంది అనేది రివ్యూలో చూద్దాం...
ఇండియా, శ్రీలంక నేపథ్యంతో స్టోరీ
ఇండియాలో 2017లో జరిగే కథ నేపథ్యానికి వస్తే.....సూర్య (మంచు మనోజ్) పసి బిడ్డగా ఉన్నపుడే శ్రీలంక నుండి భారత దేశం వలస వస్తాడు. అందరినీ పోగొట్టుకున్న అతడిని తోటి శరణార్థులు చేరదీసి పెంచుతారు. స్థానిక యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్గా ఎదిగిన సూర్య.... ఇక్కడ శరణార్థుల పట్ల కొందరు రాజకీయ నాయకులు, స్వార్థపరులు చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తాడు. శ్రీలంకలో ఇది మీ దేశం కాదు మీరు శరణార్థులు అంటున్నారు. భారత దేశం వస్తే ఇది మీ దేశం కాదు శరణార్థులు అంటున్నారు. మాకు దేశం అంటూ లేదా? మాకు ఎక్కడా స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా? అని పోరాడే పాత్ర సూర్య పాత్ర.
శ్రీలంకలో 1990లో జరిగే కథ విషయానికొస్తే.....
పీటర్ (మంచు మనోజ్) తమిళ ప్రజల పక్షాన పోరాడే నాయకుడు. శ్రీలంక స్వాతంత్రం తర్వాత అక్కడి ప్రభుత్వం తమిళులను భారత దేశం నుండి వలస వచ్చిన శరణార్థులుగా పేర్కొంటూ వారిని బానిసలుగా చూస్తుంది. వారికి విద్య, వైద్యం, ఉద్యోగాలు, రాజకీయ పరంగా తొక్కేస్తుంది. వారు చేసే అన్యాయాలు సహిస్తూ బానిసలుగా బ్రతకడం కంటే ప్రత్యేక దేశం కోసం సాయుధ పోరాటం చేసి భావితరాలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుంటాడు.
సూర్య, పీటర్కు సంబంధం ఏమిటి?
శ్రీలంకలో జరిగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం కంటే.... భారత దేశానికి శరణార్థులుగా వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలనుకునే వారిని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు పీటర్. పరాయి దేశం వలస వెళ్లినా అక్కడ శరణార్థులుగా బానిస బ్రతకు తప్పదు. ఇక్కడే మన స్వేచ్ఛ కోసం పోరాడితే భావితరాలకు మేలు జరుగుతుంది అని వాదిస్తుంటాడు. మరి సూర్యకు, పీటర్కు సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
మనోజ్ పెర్ఫార్మెన్స్ అదుర్స్
మంచు మనోజ్ పీటర్ పాత్రలో, సూర్య పాత్రలో పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. ముఖ్యంగా శ్రీలంకలో సాయుధ పోరాట నాయకుడు పీటర్ పాత్రలో మంచు మనోజ్ నటన అద్భుతంగా ఉంది. స్టూడెంట్ లీడర్ సూర్య పాత్రలోనూ తనదైన నటనతో మనోజ్ మెప్పించారు.దేశం వర్ధిల్లాలి అంటూ చెప్పిన కొన్ని ఆవేశ పూరితమైన డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి.
ఇతర పాత్రలు
సినిమాలో మనోజ్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర...... దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి పోషించిన విక్టర్ పాత్ర. పీటర్, సూర్య పాత్రల మధ్య వారధిలా విక్టర్ పాత్ర ఉంది. అజయ్ ఆండ్రూస్ పెర్ఫార్మెన్స్ పరంగా ఫర్వా లేదు. నీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ అంశాలు
వి.కోదండ రామరాజు అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్లో మరింత షార్ప్గా ఉంటే బావుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. గోపీమోహన్ అందించిన స్క్రీన్ ప్లే మరీ అంత గొప్పగా ఏమీ లేదు. శివ నందిగామ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరు ఓకే. నిర్మాణ విలువలు యావరేజ్గా ఉన్నాయి. సెండాఫ్ బోటు జర్నీలో కనిపించే విఎఫ్ఎక్స్ పెద్దగా ఆకట్టుకోలేదు.
దర్శకుడి పనితీరు
శ్రీలంక నుండి ఇండియా వలస వచ్చే శరణార్థుల వ్యధను కథగా ఎంచుకున్న దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి..... దాన్ని తెరపై ప్రేక్షకులు సంతృప్తిపడేలా ఆవిష్కరించడంలో కాస్త తడబడ్డాడని చెప్పక తప్పదు. ఈ సినిమా ద్వారా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్ట్రైట్గా చెప్పలేక పోయాడు. సినిమాను ముగించిన తీరు కూడా సాధారణంగా ఉంది.
ఫస్టాఫ్
సినిమా ఫస్టాఫ్ శ్రీలంకలో ప్రభుత్వానికి, తమిళ టైగర్లకు మధ్య జరిగే యుద్ధంతో రక్తపాతంతో వయొలెంట్గా సాగుతుంది. ఈ ఎపిసోడ్ చూస్తుంటే గతంలో వచ్చిన ‘రావణ దేశం' సినిమా సీన్లను గుర్తుకు తెస్తుంది. యాక్షన్ సీన్లతో స్క్రీన్ ప్లే స్పీడ్గా సాగడం వల్ల ప్రేక్షకులకు పెద్దగా బోర్ అనిపించదు.
సెకండాఫ్
సెకండాఫ్ లో శ్రీలంక నుండి ఇండియా వైపు సముద్ర మార్గంలో వలస వస్తున్న శరణార్థుల బోటు జర్నీ ఎక్కువ చూపించారు. సాగదీత ఎక్కువగా ఉన్నట్లు ఉండటంతో ప్రేక్షకులు బోర్ పీలవుతారు.
ప్లస్ పాయింట్స్
మనోజ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్
కెమెరా, బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్లో వచ్చే సీన్లు
సినిమా క్లైమాక్స్
ఫైనల్గా
మనం బావుంటే సరిపోదు. ఎదుటివారికి అన్యాయం జరిగితే స్పందించాలి అనే సందేశంతో ఒక్కడు మిగిలాడును తెరకెక్కించారు. ఈ కాన్సెప్టుకు ఎంత మంది కనెక్ట్ అవుతారు అనే దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
నటీనటులు
మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.