'ఒరేయ్ పండు' రివ్యూ: దూరంగా ఉండు

సినిమా: ఒరేయ్ పండు
నటీనటులు: సచిన్, సంధాలీ సిన్హా, భానుప్రియ, తెలంగాణ శకుంతలు,
సన, చందన నరేష్, షియాజీ షిండే, బెనర్జీ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, ఎవిఎస్ తదితరులు
కథ: సత్యానంద్
మాటలు: చింతపల్లి రమణ
సంగీతం: ఆనంద్రాజ్ ఆనంద్
కెమెరా: అజయ్ విన్సెంట్
దర్శకత్వం: ఎస్వి కృష్ణారెడ్డి
నిర్మాత: గిరీష్ సంఘి
ఈ సినిమా ఒక మానసిక వికలాంగుడి ప్రేమ కథ. గతంలో ఎన్నో చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రం కాబట్టి ఓపెనింగ్ రోజు ప్రేక్షకుల స్పందన బాగున్నా సినిమాకు 'ఫ్లాప్' టాక్ వచ్చింది.
కథ: పండు (సచిన్) చిన్నప్పుడే యాక్సిడెంటై మనసు ఎదగక 'కోయి మిల్గయా' చిత్రంలో హీరోను అనుకరిస్తూ, తల్లి భానుప్రియతో ఊటీలో ఉంటాడు. మెదడు ఎదగక తనకంటే వయసులో చాలా చిన్న వయసున్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఊటీకి టూరుకి వచ్చిన పెద్ద పిల్ల మధు (సంధాలీ సిన్హా) పండును ఆకర్షిస్తుంది. తాను మానసిక వికలాంగుడినన్న విషయం మర్చిపోయి పండు ఆమెతో ప్రేమలో పడిపోయి డ్యూయట్లుపాడుతుంటాడు. కానీ ఆమె 'ఛీ నిన్నా ప్రేమించేది' అని వెళ్ళి పోతుంది. అప్పుడు పండు తల్లి అతను వినేలా ఫ్లాష్బ్యాక్ విప్పి చెబుతుంది.
ఫ్లాష్బ్యాక్ సారాంశమేమిటంటే మధు తండ్రి బెనర్జీ పండు కుటుంబానికి తీవ్ర ద్రోహం చేస్తాడు. కారు యాక్సిడెంట్లో పండు తండ్రిని చంపేస్తాడు. ఆ యాక్సిడెంట్లోనే పండు మానసిక వికలాంగుడవుతాడు. ఈ విషయాన్ని తల్లి ద్వారా తెలుసుకున్న పండు ఎలాగైనా మధును పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. మానసిక వికలాంగుడికి ఇంతటి పట్టుదల ఎలా వస్తుందన్నది అడకూడదు.
ఈ లోపు తెలుగు సినిమా రూలు ప్రకారం మధుకి రాజీవ్ కనకాల అనే జూనియర్ విలన్తో పెళ్ళి కుదురుతుంది. పండుకు ఏం చేయాలో తోచదు. ఆత్మహత్య చేసుకోబోతుండగా ఒక వృద్ధుడు ఆపి ఒక పండు ఇస్తాడు. అది తిన్న పండుకు ఏ దివ్య శక్తులు వస్తాయి? అతను మధును ఎలా గెలుచుకుంటాడు? ఇవన్నీ ఓపిక ఉంటే సినిమా చూసి తెలుసుకోవచ్చు.
కథకోసం 'కోయి మిల్గయా' కామెడీ ట్రాక్ను 'ఫోన్బూత్' సినిమా ను ఆశ్రయించిన దర్శకుడు స్క్రీన్ ప్లేను నిర్లక్ష్యం చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు దూరంగా పారిపోవడం ఖాయం. అనేక సీన్లు పూర్తి కాకుండానే కొత్త సీన్లు వచ్చేయడం విసుగు కలిగిస్తుంది. ఒరిజినల్ కథలో హీరోను ఆదుకునే వ్యక్తి ఉపగ్రహ వాసి. ఆ కథ మానవత్వ కోణంలో నడుస్తుంది. ఇక్కడ అటువంటివి లేకపోవడంతో కథ తేలిపోయింది.
వేణు మాధ వ్ కామెడీ ఫర్వాలేదు. 'రాలేవా... ఒక్కసారి' పాట బాగున్నా మిస్ప్లేస్ కావడం లోపమే. సినిమా మొత్తం మీద నీట్ గా నటించిది భానుప్రియ ఒక్కరే. మంచి సీన్లు లేపపోతే ఎంత మంచి రచయితైనా మంచి మాటలు రాయలేడనడానికి చింతపల్లి రమణ ఒక ఉదాహరణ.
తలనొప్పి ఉన్నవారు ఈ సినిమాను చూడకపోవడం మంచిది. పాతికకు పైగా సినిమాలు విడుదలవుతున్న ఈ నెలలో 'ఒరేయ్ పండు' ఆడడం అసంభవం.


Click it and Unblock the Notifications











