Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కిట్టు ఉన్నాడు జాగ్రత్త రివ్యూ
హీరో రాజ్ తరణ్ .. తాజా చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఓ క్రైమ్ కామెడీ చిత్రం.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
కామెడీ సినిమాలకు నిన్న,మొన్నటివరకూ అల్లరి నరేష్ కేరాఫ్ ఎడ్రస్ గా మారాడు. కానీ వరస ఫెయిల్యూర్స్ తో ఆయన దూసుకుపోతూండటంతో నెక్ట్స్ జనరేషన్ లో నరేష్ ప్లేస్ ని ఫిల్ చేసే వాళ్లు వచ్చేస్తున్నారు. ముఖ్యంగా రాజ్ తరణ్ ...కామెడీ సినిమాలు చేసే నిర్మాతలకి ఆల్టర్నేట్ గా మారారు. ప్రేక్షకులు కూడా ఫన్ కోసం ...రాజ్ తరణ్ సినిమాలను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు.
రాజ్ తరణ్ కూడా చాలా తెలివైన వాడు. రొటీన్ కథాంశాలు ఎంచుకుంటే రొటీన్ గానే అతి తక్కువ కాలంలో అవుట్ డేట్ అయిపోతాను అని అర్దం చేసుకుని, కొత్త బ్యాక్ డ్రాప్ లతో కూడిన కథలు ఎంచుకుంటున్నాడు. మినిమం గ్యారెంటీగా కామెడీని పెట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా డాగ్ కిడ్నాపర్ అంటూ కొత్త బ్యాక్ డ్రాప్ తో ముందుకు వచ్చి క్యూరియాసిటీ పెంచేసాడు. మనం మాత్రమే కామెడీ పండిస్తే కష్టమవుతుందనుకున్నారో ఏమో, మొత్తం కామెడీ గ్యాంగ్ ని మొత్తం తీసుకుని రంగంలోకి దూకేసాడు.
అక్కడితో ఆగాడా...నాని తాజా చిత్రం మజ్ను ఫేమ్ అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా జంటగా తీసుకున్నాడు , టైటిల్ లోనే కొత్తదనం చూపించడం వంటి అన్ని జాగ్రత్తలతో ముందుకు రావటంతో... అసలు ఈ సినిమాలో ఏమున్నది అనే ఆత్రుత ప్రేక్షకుల్లో పెరిగింది..వారి క్యూరియాసిటీ కు ఈరోజు ఉదయం ఆట తో తెరపడింది.
ఈ నేపధ్యంలో సినిమాపై ఇంట్రస్ట్ పెంచుకుని వచ్చిన జనం అంచనాలను ఎంతవరకూ రీచ్ అయ్యాడు. సినిమా హిట్టవుతుందా..కథేంటి..కుక్కల కిడ్నాప్ గోలేంటి వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
లవ్ లో పడి ..
అనాధ అయిన కిట్టు(రాజ్తరుణ్) మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తన స్నేహితులతో కలసి ఓ గ్యారేజీ నడుపుతుంటాడు. ఆడుతూ, పాడుతూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతని జీవితంలోకి జానకి(అను ఇమ్మాన్యుయేల్) ప్రవేశించటంతో , ఆమె ప్రేమలో పడటంతో అతని లైఫ్ టర్న్ అవుతూుంది.
అప్పు చేస్తారు
ఓ రోజు జానికి యాక్సిడెంటల్ గా అతని గ్యారేజ్ లో ఓ పాతిక లక్షలు రూపాయల బ్యాగ్ పెట్టి మరిచిపోతుంది. మరుసటి రోజు ఆ బ్యాగ్ పట్టుకెళ్దామనుకునేలోగా ...కిట్టు ఫ్రెండ్స్ లో ఒకరు ..దాన్ని పట్టుకుని పారిపోతాడు. దాంతో తన ప్రేమ పై మచ్చపడకుండా ఉండటానికి కిట్టు తాము దాచుకున్న డబ్బుకు, ఓ పదిహేను లక్షలు, ఎక్కువవడ్డీ రేటుకు అప్పు చేసి ఇచ్చేస్తాడు.
విషయం తెలిసిన హీరోయిన్
అయితే తాము గ్యారేజ్ లో పనిచేస్తూ..చేస్తూ అంత పెద్ద మొత్తం తీర్చలేమని కిట్టు తన ఫ్రెండ్స్ తో కలిసి కుక్కుల కిడ్నాపర్ అవతారం ఎత్తి ఆ డబ్బుని అప్పు తీరుస్తూంటారు. ఈ విషయం జానకికి తెలిసిపోయి నిలదీస్తుంది. కిట్టు నిజం చెప్పలేకపోతాడు. దాంతో కిట్టూ, జానకి విడిపోతారు.
సీజ్ చేసేస్తారు
ఇదిలా ఉంటే మరోవైపు ఏఆర్(అర్ఫాజ్ఖాన్) సెలబ్రెటీలను బ్లాక్మెయిల్ చేస్తూ వారి ద్వారా తన అవసరాలను తీర్చుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో ఐటీశాఖ ఏఆర్ ఇంటిపై దాడి చేస్తుంది. బ్లాక్మెయిల్ చేయాలనుకున్న సెలబ్రెటీల జాబితా ఉన్న లాకర్ను ఐటీ ఆఫీసర్(నాగేంద్రబాబు) సీజ్ చేసి తీసుకెళ్లిపోతాడు.
కిట్టు ఎలా ...
దీంతో ఐటీ ఆఫీసర్ కుమార్తె అయిన జానకిని ఏఆర్ కిడ్నాప్ చేయిస్తాడు. అదే సమయంలో కిట్టు సైతం తెలియక ..తన లవర్ జానికి కుక్కను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసేలోగా జానికి కిడ్నాప్ ... నేరం కిట్టుపై పడుతుంది. దాని నుంచి కిట్టు ఎలా బయటపడ్డాడు? జానకిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడు. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథనమే దెబ్బ కొట్టింది
ఇలాంటి క్రైమ్ కామెడీలో నిజానికి చెప్పుకోదగ్గ కథ ఉండదు. చిన్న లైన్ అనుకుని ...కథనం పరుగెట్టిస్తారు.మని, అనగనగా ఒక రోజు,స్వామి రారా వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. అయితే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే మైనస్ అయ్యింది. ఎక్కడా ట్విస్ట్ లు ఉండవు. చాలా ప్లాట్ గా సాగుతూంటుంది.
తొలిభాగం అంతా ..
ఫస్టాఫ్ మొత్తం కుక్కల కిడ్నాప్ లు, తన లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ని ఓ డాన్ కు చెప్పటం వంటి వాటితో నిండిపోయింది. అంటే సెటప్ తోనే ఫస్టాఫ్ మొత్తం నింపేసారు. ఇంటర్వెల్ దాకా అసలు కథలోకే రాలేదు. దాంతో ఏదో జరుగుతోంది అంటే జరుగుతోంది అన్నట్లుగా సీన్స్ వచ్చి పోతున్నట్లుగా ఫస్టాఫ్ లో అనిపించాయి. ఇంటర్వెల్ ముందు హీరో,హీరోయిన్స్ విడిపోవడం, హీరోయిన్ కిడ్నాప్ కు గురికావడంతో కథలోఇంట్రెస్ట్ మొదలవుతుంది.
అప్పటిదాకా పెద్దగా ఏమీ లేదు
ఇంటర్వెల్ దగ్గర కథ మొదలెట్టిన దర్శకుడు సెకండాఫ్ ని పరుగెట్టించాలనే ప్రయత్నం చేసాడు. అలాగే ...విలన్ క్యారక్టర్ కూడా సెకండాఫ్ లోనే మొదలవుతుంది. అయితే విలన్ కు, హీరో కు మధ్య పోరు మాత్రం ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కు పది నిముషాల ముందు దాకా మొదలు కాలేదు. దాంతో ప్రీ క్లైమాక్స్ నుంచే కథ బాగున్నట్లు అనిపిస్తుంది.
ఫృధ్వీనే ఉన్నంతలో
అయితే దర్శక,రచయితలు కథలో విషయం కదలకపోయినా కామెడీ పండించాలని చూసారు. కథలో మలుపులుతో ఆ కామెడీ పుట్టి ఉండి ఉంటే బాగుండేది. అలా లేకపోవటంతో కన్ఫూజన్ కామెడీ, రేచీకటితో ఫృధ్వీ చేసే కామెడీ ఉన్నంతలో బాగుంది.
రఘుబాబు బాగానే చేసాడు కానీ..
అలాగే సినిమాలో దొంగబాబాగా రఘుబాబు, నవ్వించాడు కానీ...ఆ పాత్రకు ఆది, అంతం ఉండదు...ఆ పాత్రకు సినిమాకు సంభందం ఉండదు. వేరే సినిమాలో పాత్ర పొరపాటున ఈ సినిమాలోకి వచ్చి నటించేస్తోందా అని కూడా డౌట్ వచ్చేస్తోంది. దాంతో క్యారక్టర్ కు డెప్త్ మిస్సై...ఆ పాత్రను మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కలిసి క్లైమాక్స్ సీన్స్ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి.
ఇది కవర్ చేసుంటే...
సినిమాకు పెద్ద మైనస్ ..సరైన నెగిటివ్ పాత్ర లేకపోవటం. రాజ్ తరణ్ హీరో కదా విలన్ ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉండాలని ఫీలయ్యారో ఏమో కానీ మరీ సిల్గా ఉన్నాయి ఆయన మీద సీన్స్. క్లైమాక్స్ కు వచ్చేసరికి దారుణంగా ఆ విలన్ పాత్ర చివరకు తేలిపోయింది. అంతెందుకు కథకు కీలకమైన ఐటీశాఖ సీజ్ చేసిన లాకర్ను తీసుకెళ్లేపోయే ఎపిసోడ్ మరీ తేల్చేసారు. ఆ పాత్రకు చెప్పిన డబ్బింగ్ బేస్ వాయిస్ కావడంతో అక్కడక్కడా మాటలు అర్థం కావు.
టెక్నికల్ గా ...
సినిమాలో అనూప్రూబెన్స్ అందించిన సంగీతం బాగుంది. ఎందగానో పబ్లిసిటీ చేసి వదిలిన ఐటమ్ సాంగ్ అసలు సినిమాలో కిక్ ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగినట్టు సాగింది. బుర్రా సాయిమాధవ్ డైలాగులు ఆయన గత సినిమాల స్దాయిలో లేవు. కెమేరా, ఎడిటింగ్ అన్నీ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.
టీమ్ ఇదే
నటీనటులు: రాజ్తరుణ్.. అను ఇమ్మాన్యుయేల్.. అర్ఫాజ్ఖాన్.. పృథ్వీ.. నాగబాబు.. రఘుబాబు.. రాజా రవీంద్ర.. తాగుబోతు రమేష్.. ప్రవీణ్.. సుదర్శన్ తదితరులు
మాటలు: బుర్రా సాయిమాధవ్
కథ: శ్రీకాంత్ విస్సా
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
ఎడిటింగ్: ఎంఆర్ వర్మ
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం: వంశీకృష్ణ
విడుదల తేదీ: 03-03-2017