వద్దంటూ రజినీకాంత్ అఫీషియల్ ప్రకటన
చెన్నై: సూపర్స్టార్ రజినీకాంత్ ఈ శనివారం 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే... ఈసారి తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ వేడుకలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అభిమానులు సైతం వరదబాధితులకు సహాయం చేయడానికి చేయీ చేయీ కలపాలని కోరారు. తన పుట్టిన రోజు వేడుకలు జరపడం కన్నా రాష్ట్ర ప్రజలకు చేయూత ఇవ్వడమే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీకాంత్ 'కబలి' చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు.
మరో ప్రక్క రజనీకాంత్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. ఎడతెగకుండా తమిళనాడులో కురుస్తున్న వర్షా లతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సీఎం సహాయనిధికి రజనీ రూ.10 లక్షలు అందజేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. కాస్తంత కూడా తెరిపివ్వకపోవడంతో జనజీవనం అతలాకుతలమైంది. చెన్నైలోని పలు కీలక ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెన్నై నగరం గాడాంధకారంలో చిక్కుకుంది.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలకు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. చెన్నైలో మరో నాలుగురోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. తమిళనాడులోని 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.


Click it and Unblock the Notifications











