Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రూలర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నందమూరి బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఇంతకుముందు జై సింహా అంటూ మాస్ సినిమాను తీసి కమర్షియల్ హిట్ కొట్టారు. మరోసారి రూలర్ అంటూ ప్రేక్షకుల ముందకు ఈ శుక్రవారం వచ్చారు. మరి మరోసారి ఈ ద్వయం ప్రేక్షకులను మెప్పించిందా? విలన్లపై బాలయ్య రూలర్ అంటూ ఏ విధంగా గర్జించాడు? అసలు రూలర్ వెనుక ఉన్న కథ ఏంటో ఓసారి చూద్దాం.
కథ
ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ పెరుగుతోందని, వాటికి ఆకలే కారణమని అది తగ్గించాలని మంత్రి వీరేంద్ర నాథ్ ఠాకూర్ (ప్రకాశ్ రాజ్) ప్రభుత్వానికి సలహా ఇస్తాడు. ఈ క్రమంలో అక్కడి వారికి వ్యవసాయాన్ని నేర్పి, ఆ ప్రాంతాన్ని సస్యశామలం చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది రైతులను ఝాన్నీ జిల్లాకు తీసుకొస్తారు. వ్యవసాయం చేసుకునేందుకు ఐదు వేల ఎకరాల స్థలాన్ని వారికి ఇస్తారు.
కథలో ట్విస్టులు
తెలుగు రాష్ట్రాల నుంచి యూపీకి వెళ్లిన రైతుల పరిస్థితి ఏమైంది? సాఫ్ట్వేర్ రంగాన్ని ఏలుతున్న సరోజిని దేవీ (జయసుధ) అతని కుమారుడు అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ)కు ఆ రైతులకు సంబందం ఏంటి? మంత్రి వీరేంద్ర నాథ్ ఠాకూర్ తమ్ముడు భవానీ నాథ్ ఠాకూర్(పరాగ్ త్యాగీ) చేసిన అకృత్యాలేంటి? ఈ కథలో ధర్మ ఎవరు? అతని గతం ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానమే రూలర్.
ఫస్టాఫ్ అనాలిసిస్..
యూపీలో 1987 నాటి పరిస్థితులు, అక్కడి అరాచకాలు, వాటిని తగ్గించేందకు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులను తీసుకురావడం లాంటి అంశాలతో కథ మొదలు పెడతారు. అక్కడి నుంచి ప్రస్తుత కాలంలోకి కథ ఎంటర్ అవుతుంది. యూపీలో సోలార్ ప్లాంట్ పెడదామని బయల్దేరిన సరోజినీ దేవీకి తీవ్ర గాయాలతో హీరో ఎదురుపడటంతో ఏం జరిగి ఉంటుందన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతను గతం మరిచిపోయాడని డాక్లర్లు చెబుతారు. ప్రాణాలకు తెగించి తన ప్రాణాలను కాపాడంతో అతడ్ని సరోజినీ దేవీ దత్తత తీసుకోవడం లాంటి సీన్లతో కథ ముందుకు సాగుతుంది. ఆపై రెండేళ్ల తరువాత అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ)గా ఏసియన్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోగా ఎంట్రీ ఇవ్వడం, వచ్చీ రాగానే అన్యాయానికి గురైన మహిళా ఉద్యోగిని న్యాయం చేయడం లాంటి సీన్లతో హీరోయిజం ఎలివేట్ చేయడం బాగుంటుంది. తన కంపెనీని నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు హారిక (సోనాల్ చౌహాన్) పథకాలు వేయడం, అందుకోసం చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఇక కథ ఇలా ముందుకు వెళ్తుండగా.. సరోజినీ దేవీ యూపీలో పెట్టాలనుకున్న సోలార్ ప్రాజెక్ట్ గురించి అర్జున్ తెలుసుకోవడం, అక్కడికి వెళ్లి భవానీ నాథ్ ఠాకూర్ మనుషులతో గొడవ పడటంతో ప్రథమార్థం ముగుస్తుంది. కామెడీ, యాక్షన్, సాంగ్స్ ఇలా ప్రతీ దాన్ని లెక్కేసుకుని చేసినట్టు అనిపించినా.. ఓవరాల్గా ఫస్టాఫ్ అందర్నీ మెప్పించేలానే ఉంది.
Recommended Video
సెకండాఫ్ అనాలిసిస్..
అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. అర్జున్ ప్రసాద్ను చూసి ధర్మ అని ఆ ఊరి జనం రావడం, వారి నుంచి ధర్మ గతాన్ని తెలుసుకునే సీన్లతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఝాన్సీలో స్థిరపడిన తెలుగు రైతులు ఎంతో గొప్పగా బతుకుతుండటం, అక్కడి చోటామోటా రౌడీలు బెదిరిస్తే ధర్మ వారి తాట తీయడం లాంటి సీన్లతో సెకండాఫ్లో వేగం పెరుగుతుంది. సంధ్య (వేదిక) ఎంట్రీ ఇవ్వడం, లవ్ ట్రాక్ మొదలవడం.. ప్రేక్షకులు కాసింత ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశం ఉంది. వీరేంద్ర నాథ్ ఠాకూర్ కూతురు(భూమిక) వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, అది నచ్చని భవానీ నాథ్ ఠాకూర్ అతడ్ని అందరి ముందే చంపేస్తాడు. అంతేకాకుండా తన అన్నను, ఆయన కూతురును కూడా చంపాలని ప్రయత్నిస్తాడు. ధర్మ వచ్చి కాపాడి, భవానీని అరెస్ట్ చేయించడంతో కథ ఇంకాస్త ముందుకు సాగుతుంది. వీరేంద్ర నాథ్ ఠాకూర్, అతని కూతురికి తెలుగు రైతులు తమ ఊళ్లలో ఆశ్రయమిస్తారు. దీంతో వారందరి పని పట్టాలని రెవిన్యూ మంత్రిగా తన పొలిటికల్ పవర్ను భవానీ ఉపయోగించడం, దానికి వీరేంద్ర నాథ్ తిరగబడడంతో అతన్ని చంపేస్తాడు. ఆయన కూతరును కూడా చంపేసేందుకు ప్రయత్నించడం, ధర్మ తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడడంతో ఫ్లాష్ బ్యాక్ ముగియడం, చివరకు భవానీ నాథ్ ఠాకూర్ను అంతమొందిచడంతో ద్వితీయార్థం ముగుస్తుంది. ఎక్కువ యాక్షన్ పాళ్లను నమ్ముకోవడంతో ద్వితీయార్థం బీభత్సమైన యాక్షన్ సీన్లతోనే నిండిపోయిన ఫీలింగ్ కలగడం మైనస్గా మారవచ్చు.
నటీనటుల పర్ఫామెన్స్..
పోలీసాఫీసర్ ధర్మా, సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో అర్జున్ ప్రసాద్గా రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించాడు బాలయ్య. నటనలోనే కాకుండా గెటప్లో కూడా వైవిధ్యం చూపించాడు. అయితే ధర్మ లుక్పై కాసింత దృష్టి పెడితే ఇంకా బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్, డ్యాన్సుల్లో బాలయ్య మరోసారి రెచ్చిపోయాడు. వాటితో నందమూరి అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. హారిక పాత్రలో సోనాల్ చౌహాన్, సంధ్య పాత్రలో వేదిక గ్లామర్ టచ్కే పరిమితమయ్యారు. జయసుధ, భూమిక, నాగినీడు, ప్రకాశ్ రాజ్, ఝాన్సీ ఇలా సీనియర్ నటులంతా తమ అనుభవాన్ని చూపించారు. మిగతా పాత్రల్లో సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, ధన్ రాజ్, రఘు బాబు, రోలర్ రఘు లాంటి వారు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.
దర్శకుడి పనితీరు..
కథే ఎప్పటిదోనన్న ఫీలింగ్ కలిగితే.. కథను నడిపించిన విధానం, రాసుకున్న కథనాన్ని చూస్తే మరింత ఔట్ డేటెడ్గా కనిపించవచ్చు. మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరున్న కేఎస్ రవికుమార్.. ఇంకా ఆ తరంలోనే ఉన్నాడన్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ ఊరు, కష్టాలు పెట్టే రాక్షసుడు, ఊరిని కాపాడే ఓ హీరో, ప్రమాదంలో హీరో గతాన్ని మరిచిపోవడం, మళ్లీ రావడం, చివరకు విలన్ల పని పట్టడం ఈ ఫార్మూలానే నమ్ముకుని ఎప్పుడో పాతబడ్డ సీన్లతో తెరకెక్కించడంతో రూలర్ అందరినీ మెప్పించకపోవచ్చు. కేవలం నందమూరి అభిమానులను మెప్పించడానికే తీసినట్టుగా, బాలయ్య ఎంట్రీలో చేసిన నమ్మశక్యం కానీ సాహసం, యాక్షన్ సీక్వెన్స్లు పెట్టినట్టుగా, భారీ డైలాగ్లు చెప్పించినట్టు కనిపిస్తుంది. రూలర్ను అందరూ మెచ్చే చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడనే ఫీలింగ్ కలగవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు..
ఇక సాంకేతిక విభాగాలకొస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిరంతన్ మ్యూజిక్ గురించి. బాలయ్య ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా, మాస్ ప్రేక్షకులు మెచ్చేలా సంగీతాన్ని అందించాడు. సినిమాను ఎంతో రిచ్గా తెరకెక్కించారు సినిమాటోగ్రఫర్ రామ్ ప్రసాద్. సెకండాఫ్లో కొన్ని సీన్లకు కత్తెరేస్తే మరింత బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ఫైనల్గా..
నందమూరి అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసినట్టున్న రూలర్.. మిగతా సెక్షన్ ప్రేక్షకులకు ఎక్కక పోవచ్చు. మరి ఈ రూలర్ కమర్షియల్ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది బీ, సీ సెంటర్లపై ఆధారపడి ఉంది.
బలం బలహీనతలు
ప్లస్ పాయంట్స్
బాలకృష్ణ
సంగీతం
ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్
ఆసక్తికరంగా సాగని కథనం
కొత్తదనం లోపించడం
నటీనటులు
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక తదితరులు
దర్శకత్వం : కేఎస్ రవికుమార్
నిర్మాత : సీ కళ్యాణ్
బ్యానర్ : హ్యాపీ మూవీస్
మ్యూజిక్ : చిరంతన్ భట్
సినిమాటోగ్రఫి : రామ్ ప్రసాద్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు