సఖియా సమీక్ష: సగటు సినిమా

చిత్రం: సఖియా... నాతో రా
నటీనటులు: తరుణ్, నౌహిద్, రంగనాథ్, లక్ష్మి,
ఎంఎస్ నారాయణ, అలీ, శ్రీనివాసరెడ్డి, శంకరాభరణం రాజ్యలక్ష్మి,
దువ్వాసి మోహన్ తదితరులు
సంగీతం: మణిశర్మ
కథ: దీన్రాజ్
స్క్రీన్ప్లే, మాటలు: పరుచూరి బ్రదర్స్
కెమెరా: జవహర్ రెడ్డి
దర్శకత్వం: జయంత్. సి.పరాన్జీ
బ్యానర్ : సూర్యోదయా ఆర్ట్స్
నిర్మాతలు: అప్పలరాజు, ఎకె కుమార్
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టు జయంత్, లవర్బాయ్ ఇమేజి గల 'తరుణ్'ల కాంబినేషన్లో వచ్చిన కొత్త సీసాలో పాత సారా ఈ సినిమా. 'ప్రేమంటే ఇదేరా' సినిమాను మళ్ళీ కొత్తగా తీసినట్టున్న చిత్రం 'సఖియా... నాతో రా...'
కథ
హరి అనే కుర్రాడు (తరుణ్) దుర్గాదేవి (లక్ష్మి)ని రైలులో దుండగుల నుంచి రక్షించే ప్రయత్నంలో అతని యాక్షన్ చూసి ముచ్చట పడి, అతనికి ఒక ఆసైన్మెంట్ అప్పగిస్తుంది. స్విట్జర్లాండ్లో ఉన్న తన కూతురు చందనను (నౌహిద్) తెసుకొచ్చి ఆమెకు అప్పగించడం ఆ అసైన్మెంట్. కుటుంబపరంగా డబ్బు అవసరమైన హరి ఆ పని ఒప్పుకుని రంగంలోకి దిగుతాడు. స్విట్జర్లాండ్ వెళ్లి రకరకాల నాటకాలాడి ఆ అమ్మాయిని ప్రేమలో పడేసి ఇండియాకు తీసుకొస్తాడు. అంత కష్టపడి తీసుకువచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో తెలిసుకుని హీరో ఆశ్చర్యపోతాడు. ఆమె దుర్గాదేవి కూతురు కాదు, ఆమె శత్రువు సిద్ధప్పనాయుడి కూతురు. దుర్గాదేవి తన కొడుక్కి ఆ అమ్మాయితో పెళ్ళి జరిపించడానికి ఆ పథకం వేసిందని గ్రహించడంతో ఇంటర్వెల్ పడుతుంది.
చందనను దుర్గాదేవి బారి నుంచి రక్షించి తన ప్రేమను నిరూపించుకునే ప్రయత్నంతో కథ క్లెయిమాక్స్కు వెళ్తుంది. కలవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం అనే 'బాయ్ మీట్స్ ద గాళ్' ఫార్ములాకు యాక్షన్ను జోడించిన చిత్రమిది. సుందరమైన స్విట్జర్లాండ్ దృశ్యాలు ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులను మురిపిస్తే, ఆ తర్వాత వచ్చే ఫ్యాక్షన్ తరహా యాక్షన్ దృశ్యాలు కంగారు పెడతాయి.
ఇండియా నుంచి పారిపోయిన చందన అడ్రసును హీరో స్విట్జర్లాండ్ వెళ్ళీ వెళ్లగానే పట్టుకోవడం ఒక మిస్టరీ. ఆ దేశంలో చందన ఒంటరిగా ఎలా ఉంటోంది? తన తలిదండ్రులను చంపిన వారిపై పగ గానీ, బతికున్న తాత, మేనమామలతో ఆమె ఇంటరాక్ట్ అవడం గానీ ఉండకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత పెద్ద అసైన్మెంట్ను అపరిచితుడైన హరికి దుర్గాదేవి అప్పగించడం వింతగా ఉంటుంది.
హరి చందనను ఇండియాకు తీసుకురావడానికి ప్రేమ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? దుర్గాదేవి కొడుకుని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నప్పుడు శత్రువులు ఎటాక్ చేసినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఏ మాత్రం ప్రతిఘటించకుండా సినిమా పోలీసులా చనిపోవడం చూసి ప్రేక్షకులు అంత సీరియస్ సన్నివేశంలో కూడా నవ్వుకోవడం సినిమాలోని ఒక లోపం.
ఈ అనుమానాలన్నీ పక్కన పెడితే వెంట వెంటనే వచ్చే పాటలను ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చక్కగా చూడవచ్చు. పరుచూరి వారి కలంలో పడుచుదనం తగ్గినట్టు సంభాషణలు నిరూపిస్తున్నాయి. పాటలు బాగున్నాయి. తరుణ్ని యాక్షన్ తరహాలో చూపాలనే తపన అక్కడక్కడ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినా జయంత్ కథనంలో అది కలిసిపోవడం సినిమాలోని ప్లస్ పాయింట్.
దట్స్ తెలుగు రిమార్క్స్ పాటలు విజువలైహేషన్, దర్శకత్వ ప్రతిభ కారణంగా ఈ సినిమా యావరేజిగా ఆడవచ్చు. ఈ సినిమా జయాపజయాలు పోటీ సినిమాలపై ఆధారపడి ఉంటాయి. ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగిన చిత్రమిది.


Click it and Unblock the Notifications











