Sing Geetham Movie Review: సింగ్ గీతం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: అహల్య బమ్రూ, ఆయన్, షాలిని కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, గెస్ట్ అప్పీయరెన్స్: విజయ్ దేవరకొండ, నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్ తదితరులు
రచన, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: నాగ్ అశ్విన్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: అకుంర్ సీ
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: సంకల్ప్ గోరా
బ్యానర్: స్వప్న సినిమా
రిలీజ్ డేట్: 2026-06-12
ఇష్టం లేకున్న జైలు నుంచి బయటకు నెట్టి వేయబడిన ప్రతాప్ (ఆయాన్) తన తండ్రి రాసిచ్చిన కొన్ని ఎకరాల భూమి పత్రాలు చేతికి దక్కిన ఆనందంతో తన ఆస్తుల దక్కించుకోవడానికి కుబేరపురంకు వెళ్తాడు. విచిత్రమైన మనషులు, వింత ప్రవర్తన మధ్య నైరోబి బిజినెస్మ్యాన్తో గోల్డ్ మైనింగ్ చేపట్టే ప్రయత్నంలో ఉన్న రేణు (షాలిని)ను ప్రతాప్ కలుసుకొంటాడు. తనను గ్రామస్థులంతా ఓ దేవుడిలా కోలవడం చూసి ప్రతాప్ ఆశ్చర్యంలో మునిగిపోతాడు. ఈ క్రమంలో తనకు అత్యంత సెంటిమెంట్గా భావించే భారీ వృక్షానికి రక్షణగా నిలిచిన గౌరీ (అహల్య)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే ప్రతాప్, రేణు కలిసి మైనింగ్కు అడ్డుగా మారిన ఆ వృక్షాన్ని నేలమట్టం చేస్తారు. దాంతో గౌరీ మనస్తాపం చెంది గ్రామ దేవుడు కుబేరుడిని నిందించి ప్రశ్నిస్తుంది. దాంతో గ్రామస్థులందరికి దేవుడు ఓ శాపం పెడుతాడు.

జైలు నుంచి కుబేరపురం గ్రామానికి వెళ్లిన ప్రతాప్కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? గౌరీ, నైరోబీ మైనింగ్ మాఫియా మధ్య ఎలాంటి డీల్ కుదిరింది? ప్రతాప్ ఎలాంటి పరిస్థితుల్లో మైనింగ్ డీల్లో భాగమయ్యాడు? గౌరీ, ప్రతాప్ మధ్య పరిచయం ఎలాంటి బంధానికి దారి తీసింది? మైనింగ్ కోసం భారీ వృక్షాన్ని కూల్చివేయడంతో గౌరీ రియాక్షన్ ఏమిటి? గ్రామంలో ఉన్న ఏకైక వృక్షాన్ని ధ్వంసం చేయడంతో గౌరీ ఎలాంటి మనో వేదనకు గురైంది? గౌరీ ఆగ్రహంతో కుబేరుడు పెట్టిన శాపం ఏమిటి? ఆ శాపం వల్ల గ్రామస్థుల బిహేవియర్ ఎలా మారింది? ఆ శాపం ఊరి ప్రజలను ఎలాంటి ఆందోళనకు గురి చేసింది? గోల్డ్ మైనింగ్ వ్యవహారానికి ఎలాంటి ముగింపు కలిగింది? మహా వృక్షంతో గౌరీకి ఉన్న అనుబంధం వెనుక కథ ఏమిటి? చివర్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఆకట్టుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకే కాకుండా భారతీయ సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుంచుకొనే విధంగా ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, పుష్పక విమానం లాంటి సినిమాలు ఎన్నో అందించారు. అయితే వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన ఈ వయసులో కూడా ఆయన సినిమాపై ఉన్న తపన, ప్రేమకు నిదర్శనంగా మరో ప్రయోగంతో సింగ్ గీతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కాగితం మీద రాసుకోవడానికి బాగుందనిపించే కథ అయినప్పటికీ.. తెర మీదకు వచ్చే సరికి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎమోషనల్ డ్రామాగా, సెంటిమెంట్ సినిమానా, కామెడీ ప్రధానంగా సాగే సినిమానా అనే విషయాన్ని తేల్చుకోలేక సినిమా మొత్తం గందరగోళంగా మార్చారు. మాటలు కాకుండా పాటలు అనే కాన్సెప్ట్తో సినిమాను నడపడం పూర్తిగా బెడిసి కొట్టింది. రెండున్నర గంటలపాటు సహనానికి పరీక్షగా, అర్ధపర్థం లేని పాటలతో విసిగించేలా చేస్తుంది. కథలో చలనం ఉండదు. ఎంతసేపు కథ ముందుకు వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతూ ఇక ఏంటి? అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఫస్టాఫ్లో పాత్రల పరిచయంతో సాగదీస్తూ చూసేవారికి ఇది శాపమా? రోగమా? అనే సినిమాలోని డైలాగ్ను గుర్తు చేశారు. హమ్మయ్య.. మొదటి భాగం ముగిసింది.. ఇక రెండో భాగంలోనైనా విషయమేమైనా చెబుతారా? అని ఎదురు చూసిన వారికి అదే పాటతో మరింత విసుగు తెప్పించారు. ఇక ఈ సినిమాలో విషయం లేదని ఫిక్స్ అయ్యే టైమ్లో ముఖ్యంగా 10, 15 నిమిషాలు ఎమోషనల్గా చెప్పిన కథతో అప్పటి వరకు వేగిన నసతో కొంత ఊరట కలిగించేలా ఉంటుంది. ఇక సరే ఏదో చూశాములే అని తమాయించుకొనే సమయంలో విజయ్ దేవరకొండను స్పెషల్ అప్పీయరెన్స్తో తెరమీదకు తీసుకొచ్చి.. పార్ట్ 2 ఉందని ఏమైనా చెబుతారోననే భయాన్ని కొంత కలిగించారు. టోటల్గా సింగ్ గీతం ప్రయోగం వికటించిందనే చెప్పాలి.
నటీనటులు విషయానికి వస్తే.. ప్రతాప్గా ఆయాన్, గౌరీగా ఆహల్య, రేణుగా షాలిని, ఇంకా యువ ప్రతిభావంతులు అంత చక్కగా నటించారు. తమ పాత్రల్లో లీనమైపోయి పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నారు. తమ వయసుకు మించిన టాలెంట్ను చాటుకొన్నారు. సినిమా కొంత మేరకైనా ఫర్వాలేదని చెప్పాల్సి వస్తే.. యువ నటీనటుల ప్రతిభనే కారణంగా మారుతుంది. అతిథి పాత్రలో నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్ గుర్తుండిపోతారు. బెనర్జీ, తులసి, ఇతరుల పాత్రలు ఫుల్ లెంగ్త్లో ఉన్నా.. ఆ క్యారెక్టర్ల ఇంపాక్ట్ సినిమాపై ఎక్కడా కనిపించదు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అంతగా ఆకట్టుకొలేకపోయాయి. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ఎమోషనల్ కంటెంట్ బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ఆకర్షణగా మారింది. భారీగా వేసిన సెట్స్ సినిమాలో ఓ మూడ్ను క్రియేట్ చేయడానికి వర్కవుట్ అయింది. స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. కానీ కథ, కథనాల విషయంలో ఇంకాస్త బెటర్గా ప్లాన్ చేయాల్సింది. పర్యావరణం మానవాళికి ఎంత ముఖ్యమో చెప్పాలనే తపన, తనకు ఉన్న కన్సర్న్ ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ చూపించడం అభినందనీయం. ఈ కథలో బలమైన పాయింట్ ఉంది. కానీ మాటల రూపంలోనే చెబితే కంటెంట్ ఎమోషనల్గా వర్కవుట్ అయి ఉండేదనిపించింది. ఈ సినిమా చూడటానికి ఒకే ఒక కారణం సింగీతం శ్రీనివాసరావు గారిపై ఉన్న అభిమానమే తప్పా.. కంటెంట్ గురించి, ఇతర విషయాల గురించి వెళితే నిరాశపడే అవకాశం ఉంది. ఓన్లీ మ్యూజిక్.. నో మ్యాజిక్.


Click it and Unblock the Notifications