Sing Geetham Public Talk: సింగ్ గీతం మూవీ పబ్లిక్ టాక్.. సింగీతం శ్రీనివాసరావు ఎలా ఉందంటే?
Sing Geetham Public Talk: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన ఫాంటసీ మ్యూజికల్ డ్రామా 'సింగ్ గీతం'. ఈ సినిమాని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ నిర్మించారు. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా పూర్తిగా పాటల రూపంలో సాగే సినిమా అనే కాన్సెప్ట్తో ఆసక్తి రేకెత్తించింది. అయితే.. ఈ సినిమా నేడు (జూన్ 12న) థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? ప్రేక్షకుల అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..
కథ విషయానికొస్తే.. జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ప్రతాప్ (అయాన్) జీవితంలో అనుకోని మలుపు తిరుగుతుంది. ఓ లాయర్ ద్వారా తన తండ్రికి చెందిన ఆస్తి పత్రాలు అందుకున్న అతడు, వాటి ఆధారంగా కుబేరపురం అనే గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ తన తండ్రి ఒకప్పుడు భారీ గోల్డ్ మైన్ యజమాని అని తెలుసుకుంటాడు. అయితే ప్రస్తుతం ఆ గోల్డ్ మైన్స్పై కన్నేసిన రేణు (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి వాటిని ఓ విదేశీ వ్యాపారవేత్తకు అమ్మేసి కోట్లాది రూపాయలు సంపాదించాలని ప్లాన్ చేస్తుంటారు. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కుబేరపురానికి వచ్చిన ప్రతాప్ కూడా మొదట్లో అదే ఆలోచనలో ఉంటాడు. అయితే గ్రామంలో ప్రకృతిని ప్రేమించే గౌరి (అహల్య బమ్రూ) పరిచయం అతడి జీవితాన్ని మార్చేస్తుందట.

ఇక గ్రామంలో మిగిలి ఉన్న ఏకైక చెట్టును కాపాడేందుకు గౌరి పోరాడుతుంటే, ఆ చెట్టును నరికి వేయాలనే ప్రయత్నాలు జరుగుతాయి. ఈ క్రమంలో జరిగిన అనుకోని సంఘటన గౌరిని కుబేరుడి గుహ వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత గ్రామంలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఒక్కసారిగా గ్రామస్థులందరూ సాధారణంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు మాట్లాడే ప్రతి మాట పాట రూపంలో బయటకు రావడం మొదలవుతుంది. దీంతో ఇది శాపమా? వ్యాధా? లేక మరేదైనా అద్భుతమా? అని గ్రామస్థులు అయోమయంలో పడిపోతారు. అసలు కుబేరపురం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ప్రతాప్ గతం ఏమిటి? గోల్డ్ మైన్స్ చుట్టూ నడిచే అసలు కథ ఏంటి? గౌరి-ప్రతాప్ మధ్య ప్రేమ ఎలా మొదలైంది? బంగారం కోసం రేణు చేసే కుట్రలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? అనే అంశాలకు సమాధానమే'సింగ్ గీతం'సినిమా.
ఇలా వినూత్న కథనంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు మాత్రం కొత్త అనుభూతి అందించిందట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే పాటల సంభాషణలు, వినూత్న కథనం, కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయట. అయితే ఇది పూర్తిగా మ్యూజికల్ ఫార్మాట్లో సాగడం వల్ల కొంతమందికి అలవాటు పడేందుకు సమయం పట్టొచ్చని టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ కథలోని కొత్తదనం, సింగీతం మార్క్ ట్రీట్మెంట్ ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెడుతుందని చెబుతున్నారు.
సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇక్కడే సినిమా అసలు బలం కనిపిస్తోందని ప్రేక్షకుల అభిప్రాయం. ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ నుంచి కథ ఎమోషనల్ మలుపు తిరుగుతుందని, చివరి అరగంట సినిమాకు హైలైట్గా నిలుస్తుందని చెబుతున్నారు. క్లైమాక్స్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని దర్శకుడు చాలా సున్నితంగా చెప్పారని పలువురు ప్రశంసిస్తున్నారు.
సినిమాలో నటించిన కొత్త తరం నటీనటులు కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నారు. అహల్యా బమ్రూ తన సహజ నటన, ఎమోషనల్ సన్నివేశాలతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోందని ప్రేక్షకులు చెబుతున్నారు. హీరో అయాన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. షాలిని కొండేపూడి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచి నటన కనబరిచిందని అంటున్నారు. తులసి, బెనర్జీ, రాహుల్ రవీంద్రన్ తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారట.
అయితే సినిమా గురించి మాట్లాడేటప్పుడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిందే. దాదాపు మొత్తం సినిమా పాటల రూపంలోనే సాగడం వల్ల సంగీతం ఈ సినిమాకి ప్రాణంగా మారింది. ప్రతి సన్నివేశానికి తగిన మ్యూజికల్ ఫ్లో ఇవ్వడం, డైలాగ్స్ను పాటలుగా మార్చడం, ఎమోషన్స్ను సంగీతంతో ఎలివేట్ చేయడం వంటి అంశాల్లో దేవిశ్రీ అద్భుతంగా పనిచేశాడని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. చాలా మంది అయితే ఈ సినిమాకు అసలు హీరో దేవిశ్రీ ప్రసాదే అని కామెంట్లు చేస్తున్నారు.
వీఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నప్పటికీ, మరికొన్ని చోట్ల ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ సినిమా సృష్టించిన ఫాంటసీ ప్రపంచాన్ని తెరపై చూపించడంలో చిత్రబృందం చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
మొత్తంగా చూస్తే 'సింగ్ గీతం' సాధారణ కమర్షియల్ సినిమా కాదు. కొత్త తరహా కథనాన్ని, సంగీతంతో నడిచే ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఇది మంచి అనుభూతిని ఇస్తుందని పబ్లిక్ టాక్ చెబుతోంది. మొదటి భాగం కాస్త సహనాన్ని పరీక్షించినా, రెండో భాగంలోని భావోద్వేగాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాతో సింగీతం శ్రీనివాసరావు మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నారు. 94 ఏళ్ల వయసులో సినిమా తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యంత వయసున్న దర్శకుడిగా నిలిచారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications






