Thimmarajupalli TV public Talk: తిమ్మరాజుపల్లి టీవీ పబ్లిక్ టాక్.. కిరణ్ అబ్బవరం మూవీ హిట్టా? ఫట్టా?
Thimmarajupalli TV Public Talk: హీరోగా వరుస విజయాలు అందుకుంటున్నా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కిరణ్ అబ్బవరం నిర్మాతగా, వి.మునిరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమాతో దాదాపు 50 మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. సాయితేజ్, వేధా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు నటించారు.
ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే 90వ దశకపు పీరియాడికల్ డ్రామాగా రూపొందించారు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ కాంత రేఖ సంగీతం అందించగా, అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. యంగ్ టాలెంట్తో వచ్చిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 17న)ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? ప్రేక్షకుల అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా విడుదలైన వెంటనే పబ్లిక్ టాక్ ఆసక్తికరంగా మారింది. కొత్త టాలెంట్తో, కంటెంట్పై నమ్మకం ఉంచి తీసిన ఈ సినిమా ఇప్పుడు సోషల్మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ను అందిస్తోంది. సినిమా టైటిల్కే తగ్గట్టుగా కథ మొత్తం ఒక టీవీ చుట్టూ తిరుగుతుంది. 90ల కాలంలో పల్లెటూరిలో టీవీకి ఉన్న ప్రాధాన్యత, ఆ సమయంలో ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధం.. ఈ అంశాలన్నీ కథలో బలంగా కనిపిస్తాయి. శివరాత్రి సందర్భంగా టీవీ, VCR అద్దెకు తెచ్చుకుని సినిమాలు చూస్తే రోజుల్ని గుర్తు చేస్తూ సినిమా నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తుంది. ఇంటర్వెల్ వరకూ గ్రామీణ జీవితం, ప్రేమ కథలు, చిన్న చిన్న సంఘటనలతో కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. కానీ అసలు ట్విస్ట్ టీవీ దొంగతనం జరిగిన తర్వాతే మొదలవుతుంది. "ఎవరు చేశారు?" అనే మిస్టరీతో ద్వితీయార్థం ఆసక్తికరంగా మారుతుంది.
పబ్లిక్ టాక్ ప్రకారం ఈ సినిమాకు ప్రధాన మైనస్ ఫస్ట్ హాఫ్. కథ మొదలైన తర్వాత దాదాపు గంట పాటు పెద్దగా ఏం జరగకపోవడం, కేవలం క్యారెక్టర్ల సెటప్ మీద ఎక్కువ సమయం తీసుకోవడం ప్రేక్షకులకు బోర్ ఫీల్ కలిగించిందని చెప్పారు. అయితే సెకండ్ హాఫ్లో కథ మిస్టరీ వైపు మళ్లడంతో కొంత ఎంగేజ్మెంట్. ముఖ్యంగా టీవీ దొంగ ఎవరు? అనే అనుమానాలను సృష్టిస్తూ కథను ముందుకు నడిపించడం కొంతవరకు వర్కౌట్ అయిందని అభిప్రాయాలు ఉన్నాయి. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్, ఎమోషనల్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట.
ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట 'మ్యూజిక్ ఈ సినిమాకు హీరో' అన్నదే. వంశీ కాంత రేఖ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలను లిఫ్ట్ చేసింది. కొన్ని చోట్ల కథల్లో డ్రామా తక్కువగా ఉంటుంది, బీజీఎం వల్ల ఆ సీన్స్ కూడా ఎమోషనల్గా అనిపించిందని ప్రేక్షకులు చెబుతున్నారు. పాటలు కూడా కథకు సరిపోయేలా ఉండటంతో మొత్తం ఫీల్ను ఎలివేట్ చేశారంట. ముఖ్యంగా క్లైమాక్స్లో బీజీఎం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.
కొత్తవాళ్లు కానీ నేచురల్ యాక్టింగ్
ఈ సినిమాలో దాదాపు 40-50 మంది కొత్త ఆర్టిస్టులు నటించినప్పటికీ, వారి నటన ఆశించిన దానికంటే మెరుగ్గా ఉందని పబ్లిక్ టాక్ చెబుతోంది. సాయి తేజ్ సతీష్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు. ప్రదీప్ కొట్టే రాజప్పగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వేద జలంధర్, స్వాతి కరిమిరెడ్డి తమ పాత్రల్లో సహజంగా నటించారట. ముఖ్యంగా చిత్తూరు యాసను పలకడంలో చూపిన సహజత్వం ప్రేక్షకులను ఆకట్టుకుందనీ ప్రేక్షకులు చెబుతున్నారు. 'ఇది సినిమా కాదు... నిజంగా ఆ ఊర్లో జరిగే కథలా అనిపించింది' అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించడం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది. చిత్తూరు యాస, గ్రామీణ జీవన శైలి, పాత్రల రూపకల్పన ఈ అంశాలన్నీ కలిసి నేటివిటీ ఫీల్ను బలంగా తీసుకొచ్చాయట. పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో చూపించడంలో సినిమా చాలా నిజాయితీగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా పూర్తిగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్, కొన్ని అనవసరమైన సీన్స్ వల్ల ల్యాగ్ ఫీల్ రావడం ప్రధాన మైనస్గా మారిందని కొందరూ అభిప్రాయపడుతున్నారు. మిస్టరీ ట్రాక్ను మరింత బలంగా డిజైన్ చేసి ఉంటే సినిమా మరింత థ్రిల్లింగ్గా ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని చోట్ల ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యిందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ స్పష్టంగా కనిపించింది. కొందరు దీనిని 'ఫ్యామిలీతో చూస్తే మంచి సినిమా'గా ప్రశంసిస్తుండగా, మరికొందరు 'ఓకే-ఓకే మూవీ'గా చూస్తున్నారు. కొంతమంది 3.25/5 రేటింగ్ ఇస్తే, మరికొందరు 2.5/5 వరకు మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఒకసారి చూడొచ్చు అని కామన్ ఓపీనియన్ ఎక్కువగా వినిపిస్తోంది.
నిర్మాతగా కిరణ్ అబ్బవరం తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ అవసరం లేని కథను ఎంచుకుని, కొత్త టాలెంట్తో సినిమా చేయడం సాహసోపేత నిర్ణయంగా మారింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ద్వారా బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత వచ్చినా అది బోనస్గా మారే పరిస్థితి. మొత్తంగా చూస్తే 'తిమ్మరాజుపల్లి టీవీ' ఇది ప్రయోగమనే చెప్పాలి. ఇది కమర్షియల్ మసాలా సినిమా కాదు..కంటెంట్ ఆధారంగా తీసిన గ్రామీణ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా, ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని పబ్లిక్ టాక్. ఇలా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications







