Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సగం కురిసిన 'వర్షం'
నటీనటులు: ప్రభాస్, త్రిషా, గోపీచంద్, ప్రకాష్రాజ్, తదితరులు
సంగీతం: దేవీశ్రీప్రసాద్
స్క్రీన్ప్లే, నిర్మాత: ఎం.ఎస్.రాజు
దర్శకత్వం: శోభన్
ప్రభాస్ను యాక్షన్ హీరోగా బ్రేక్ ఇవ్వాలన్న ప్రయత్నం, 'ఒక్కడు' స్టైల్లో వెళితే వర్కవుటవుతుందన్న తలంపుతో 'వర్షం' తీసినట్లు కన్పించింది. అటు యాక్షన్ చిత్రం కాని, ఇటు ప్రేమకథా కాని ఈ చిత్రం పాయింట్ మాత్రం బాగుంది. వరంగల్ నేపథ్యంగా ఎంచుకోవడంతో ఫస్ట్హాఫ్లో మంచి లోకేషన్స్ దొరికాయి. వరంగల్ వేయిస్థంబాల గుడి, ఫోర్ట్ లోకేషన్స్ బాగున్నాయి. వాటిని చిత్రీకరించిన తీరు కూడా బాగుంది. పాటలు బాగున్నాయి. దర్శకుడు శోభన్ అక్కడక్కడా టేకింగ్లో చమక్కులు మెరిపించాడు.
ఐతే..అన్నీ బాగున్నా కథనం బాలేదు. ప్రథమార్థంలోనూ, ఇటు ద్వితీయార్థంలోనూ సినిమా చాలా స్లోగా మూవ్ అవుతూ బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ ముందు ప్రేక్షకులు మరీ బోర్ ఫీలై సమయాన కథలో ట్విస్ట్ పెట్టి ఉత్కంఠ కలిగించారు. కానీ ఆ ఉత్కంఠ సెకాంఢాఫ్లో మొత్తం పోయింది. రోటీన్ సినిమాగానే మిగిలిపోయింది. నిర్మాత ఎం.ఎస్.రాజు రాసిన ఈ స్క్రీన్ ప్లేలో ఆయన 'సక్సెస్ ఫార్మూలా'ను పట్టుకొని ఈదాలన్న ప్రయత్నం కనిపించింది. అయితే, ప్రభాస్ మంచి యాక్షన్ హీరోగా నిలదొక్కుకోగలడని ఈ సినిమా నిరూపించింది.
త్రిషా ఈ సినిమాకు ప్రధాన బలం. ఆమె అందమే చాలావరకు సినిమాను భరించేలా చేస్తుంది. Too many cooks spoiled the broth సామెతలా ఎం.ఎస్.రాజు, దర్శకుడు శోభన్, పరుచూరి బ్రదర్స్..తలా ఓ చెయ్యి వేసి సినిమాను నడిపించే ప్రయత్నం చేయడం వల్ల ఈ వర్షం మధ్యలోనే ఉత్కంఠను రేపి ఆగిపోయింది.
కథ సింపుల్. త్రిషాకి వర్షం అంటే చాలా ఇష్టం. రైల్వేస్టేషన్లో రైలు ఆగిన సమయంలో వర్షంలో తన్మయత్వం పొందే త్రిషాని ప్రభాస్ ప్రేమిస్తాడు. అదే సమయంలో ఆమెను చూసిన విలన్ గోపిచంద్ కూడా మనసు పారేసుకుంటాడు. వీళ్ళ ముగ్గురిది వరంగలే. వర్షం పుణ్యమాని హీరో, హీరోయిన్లు ప్రేమించుకుంటారు. కానీ, త్రిషా తండ్రి ఆమెను హీరోయిన్ను చేయాలని అనుకుంటాడు. అందుకు ఒప్పుకుంటాడు. ప్రభాస్ను త్రిషా పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని ప్రకాష్రాజ్ గోపిచంద్ను ఆశ్రయిస్తాడు.
వాడు వీళ్ళద్దరు విడిపోయేలా మనస్పర్ధలు కలిగిస్తాడు. ఆ తర్వాత గోపిచంద్ను బురిడీ కొట్టించి ప్రకాష్రాజ్ ఆమెను హీరోయిన్ను చేస్తాడు. విలన్..వెంటనే షూటింగ్ స్పాట్ నుంచే తీసుకొని వెళుతాడు. తర్వాత హీరో ఒక్కడు చిత్రంలో మాదిరిగా పెద్ద ప్లాన్ వేసి తీసుకొని వస్తాడు. మళ్ళీ చివర్లో విలన్..హైదరాబాద్ వచ్చి హీరోతో సోలోగా ఫైట్ చేస్తాడు. ఎలాగూ క్లైమాక్స్లో విలన్ చస్తాడు...కానీ ఈలోపు ప్రేక్షకులను ఈ సాగతీత దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత బోర్తో చంపేస్తారు.
ప్రభాస్ బాగానే చేసినా, డైలాగ్స్ చెప్పడంలో ఇంకా పరిణతి రాలేదు. త్రిషా చూడముచ్చటగా చక్కగా ఉంది. గోపిచంద్ మరోసారి అందరికన్నా ఎక్కువగా మార్క్లు కొట్టేశాడు. అతని సంభాషణల పద్దతి (స్లాంగ్ స్టైల్) కూడా నేచురల్గా ఉంది. మిగతావారిలా తెచ్చుపెట్టుకొని మాట్లాడినట్లు లేదు. ప్రకాష్రాజ్ను ఇటీవల చూడాలంటే బోర్ కొట్టేస్తుంది, ఒకతీరు నటన. దేవీశ్రీప్రసాద్ మంచి పాటలు ఇచ్చినా, అవి సెకాంఢాఫ్లో రాకూడని సమయంలో వచ్చి ఇబ్బంది పెడుతాయి- 'అవి వస్తానంటే...మనం రావొద్దనేలా'. సీనియర్ కెమెరామెన్ ఎస్.గోపాల్రెడ్డి మరోసారి తన కెమెరా కన్ను ప్రతిభను బలంగా ప్రదర్శించాడు.