IPL 2025: ఐపీఎల్లో పవన్ మేనియా.. ధోనీతో పవర్స్టార్
క్రికెట్ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ -18 (ఐపీఎల్ 2025) అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్లో తాజా సీజన్ గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడగా కేకేఆర్పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి సీజన్లో శుభారంభం చేసింది. కోల్కతా నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మ్యాచ్ ఆరంభానికి ముందు ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ సెలబ్రెటీలు తమ ఆట, పాటలతో ఆహుతులను ఉర్రూతలూగించారు. కోల్కతా యజమాని, బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ గ్రౌండ్లో అందరినీ ఉత్సహపరిచారు. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ మత్తెక్కించే పాటలతో ఫిదా చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ పుష్ప 2లోని సూసేకి అగ్గిరవ్వ సాంగ్ను ఆలపించారు. రింకు సింగ్, షారుఖ్ ఖాన్, దిశా పటానీలు డ్యాన్స్తో ఆకట్టుకున్నారు. మధ్యలో విరాట్ కోహ్లీ కూడా స్టెప్పులేశారు.

తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిన నేపథ్యంలో తదుపరి మ్యాచ్లపై భారీ అంచనాలున్నాయి. ఇక ఐపీఎల్ అంటే వెంటనే గుర్తొచ్చేది మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లే. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నైని అద్భుతంగా నడిపిస్తూ పలుమార్లు విజేతగా నిలబెట్టారు ధోనీ. 40 ప్లస్లోనూ మైదానంలో చురుగ్గా కదులుతూ తన వ్యూహాలతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్నారు ధోనీ. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఐపీఎల్లో ఆడుతుండటంతో ధోనీ కోసం మైదానానికి వచ్చే వారే ఎక్కువ.
ఎప్పటికప్పుడు ధోనీ ఐపీఎల్లో రిటైర్ ఎప్పుడు అవుతారంటూ వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. తాజా సీజన్ సమయంలోనూ ధోనీ రిటైర్మెంట్ గురించి గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. 50 ప్లస్లోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారని.. అందువల్ల ధోనీ ఐపీఎల్లో కొన్నేళ్లపాటు కొనసాగుతారని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ కోసం ధోనీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని రుతురాజ్ తెలిపాడు. ఇక గత సీజన్లో 220 స్ట్రైక్ రేట్తో ధోనీ 161 పరుగులు చేశాడు. దీంతో తాజా ఐపీఎల్లో ధోనీ ప్రదర్శనపై ఎన్నో అంచనాలున్నాయి.
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై మార్చి 23న జరిగే తన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడుతోంది. ఐపీఎల్లోనే ఈ రెండు జట్లు అత్యంత విజయవంతమైనవి. రెండు టీమ్స్ కూడా చెరో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకుని ఆరోసారి కప్ ముద్దాడాలని కృత నిశ్చయంతో ఉన్నాయి. ఈసారి చెన్నైకి ఆరో కప్ అందించాలని ధోనీ వ్యూహాలు రచిస్తున్నాడు. ముంబైని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు అందుకున్న ఈ మాజీ ఛాంపియన్ ఈసారి మాత్రం చెలరేగిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ సందర్భంగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున చెన్నైకి ఆల్ ది బెస్ట్ తెలిపారు స్టార్ యాంకర్ సుమ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వీరిద్దరూ ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిస్టర్ కూల్ ధోనీ , పవన్ ఫోటోలను పక్కపక్కన పెట్టి చేసిన ఫోటోలతో ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు.


Click it and Unblock the Notifications











