CCL 2025 : వరుస ఓటములతో అట్టడుగున .. తెలుగు వారియర్స్ సెమీఫైనల్ చేరాలంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సినీ తారలు క్రికెటర్లను మించి పోరాడుతూ విజయం కోసం చెమటలు కక్కుతున్నారు. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతూ సినీ, క్రీడా అభిమానులకు మజాను అందిస్తున్నాయి. తొలుత అంతంత మాత్రంగా టికెట్ అమ్మకాలు ఉండగా.. గత వారం నుంచి టికెట్ సేల్స్ భారీగా పెరిగి మైదానాలన్నీ నిండిపోతున్నాయి. వీకెండ్స్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.
ఫిబ్రవరి 8న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రారంభమవ్వగా.. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు జరిగాయి. తాజా సీజన్లో కిచ్చా సుదీప్ సారథ్యంలోని కర్ణాటక బుల్డోజర్స్, జిషుసేన్ గుప్తా సారథ్యంలోని బెంగాల్ టైగర్స్ జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్లు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాయి. ఆటగాళ్లంతా మంచి ఫాంలో ఉండటంతో ఈ రెండు జట్లతో పోటీకి దిగాలంటేనే మిగిలిన జట్లు భయపడుతున్నాయి.

కర్ణాటక, బెంగాల్ జట్లు ఆడిన రెండు మ్యాచ్లలోనూ గెలిచి చెరో నాలుగు పాయింట్లతో నిలిచాయి. కాకపోతే కిచ్చా సుదీప్ బుల్డోజర్స్ మాత్రం నెట్ రన్ రేట్ (+2.139) విషయంలో దూకుడుగా వ్యవహరించి ఓవరాల్గా టాప్లో నిలిచింది. ఆ తర్వాత బెంగాల్ టైగర్స్ +1.672 రన్ రేట్తో రెండో స్థానంలో నిలిచింది. పాయింట్లు కర్ణాటకతో సమానంగా వచ్చినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఈసారి విజేత ఖచ్చితంగా ఈ రెండు జట్లలో ఒకటి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఆ తర్వాత భోజ్పురి దబాంగ్స్ , తెలుగు వారియర్స్ రెండు మ్యాచ్లలో ఒక్కోటి చొప్పున గెలిచాయి. అనంతరం చెన్నై రైనోస్, పంజాబ్ దే షేర్, ముంబై హీరోస్ నిలిచాయి. భోజ్పురి జట్టు +1.184 రన్ రేట్తో ఉండగా.. తెలుగు వారియర్స్ -0.975 రన్రేట్తో నిలిచాయి. టోర్నీలోని హాట్ ఫేవరేట్స్లో ఒకటిగా బరిలోకి అఖిల్ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.
తొలి మ్యాచ్లో కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో అఖిల్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్లో భోజ్పురి దబాంగ్స్తో తెలుగు వారియర్స్ తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో అఖిల్ సేన పోరాడి గెలిచింది. కాస్తలో తప్పిపోయింది కానీ ఆ మ్యాచ్ కూడా చేజారిపోయేది. గాడిలో పడ్డారు అనుకునే లోపు చెన్నై రైనోస్తో జరిగిన మూడో మ్యాచ్లో తెలుగు వారియర్స్ మరోసారి బొక్కబోర్లాపడింది. 108 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన తెలుగు జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. మూడు మ్యాచ్లలో రెండు ఓటములతో అఖిల్ సేన సెమీస్ ఆశలు క్లిష్టంగా మారాయి.
ఇక సెమీస్ బెర్త్ల విషయానికి వస్తే కర్ణాటక, బెంగాల్లు ఇప్పటికే సెమీస్లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్ సెమీస్కి వెళ్లాలంటే తదుపరి మ్యాచ్లో బెంగాల్ టైగర్స్పై ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అది కూడా భారీ విజయం అయితేనే ఛాన్స్లు ఉంటాయి. మరి అఖిల్ సేన సెమీఫైనల్కు వెళ్తుందో? లేదో? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











