CCL 2026: కరణ్ మ్యాజిక్.. దబాంగ్స్ ఆశలు గల్లంతు, సెమీస్లోకి కర్ణాటక బుల్డోజర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జరిగిన మ్యాచ్లో భోజ్పురి దబాంగ్స్ను కర్ణాటక బుల్డోజర్స్ 18 పరుగుల తేడాతో ఓడించింది. కర్ణాటక నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దబాంగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. ఆడిన మూడు మ్యాచ్లను గెలిచిన కర్ణాటక బుల్డోజర్స్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో కర్ణాటక గెలుపుకు దారి తీసిన పరిస్ధితులేంటీ? భోజ్పరి దబాంగ్స్ ఎక్కడ తప్పు చేసింది? ఫుల్ మ్యాచ్ రిపోర్ట్ పరిశీలిస్తే...

203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భోజ్పురి దబాంగ్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఊపులో ఉన్న కెప్టెన్ మనోజ్ తివారీ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కార్తీక్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే భారీ షాట్ ఆడిన అన్షుమన్ .. సునీల్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇంతలోనే ఓపెనర్ టైగర్ కూడా భారీ షాట్కు యత్నించి కార్తీక్కు దొరికిపోయాడు. దాంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి దబాంగ్స్ కష్టాల్లో పడింది.
దీంతో ఆదిత్య, ఉదయ్, రాజీవ్లు కర్ణాటక బౌలర్లను ఎదుర్కొన్నారు. వీరి భాగస్వామ్యంతో దబాంగ్స్ 100 పరుగుల మార్క్ను దాటుతూ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతోంది. దాంతో కర్ణాటక కెప్టెన్ సుదీప్.. బౌలర్లు మార్చి ఈ ముగ్గురిని పెవిలియన్ పంపాడు. మ్యాచ్పై కర్ణాటక పట్టు బిగిస్తోన్న దశలో చివరిలో సుధీర్ సింగ్ ఫోర్లు, సిక్సర్లతో దబాంగ్ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే 19వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన కరణ్.. సుధీర్ను క్లీన్ బౌల్డ్ చేసి కర్ణాటక బుల్డోజర్స్ను మరోసారి రేసులోకి తీసుకొచ్చాడు.
అప్పటి నుంచి మ్యాచ్ క్షణక్షణం ఉత్కంఠను రేపింది. అదే ఓవర్లో మన్మోహన్ను కరణ్ క్లీన్బౌల్డ్ చేయడంతో దబాంగ్స్ ఓటమి ఖరారైంది. దబాంగ్స్ గెలవాలంటే చివరి ఓవర్లో 6 బంతుల్లో 26 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో అర్జున్ బౌలింగ్కు వచ్చాడు. తొలి బంతికి రోహిత్ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి సింగిల్. మూడో బంతికి బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. నాలుగో బంతికి సింగిల్, ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. చివరి బంతికి దినేష్ అర్జున్కి క్యాచ్ ఇచ్చి పదో వికెట్గా వెనుదిరిగాడు. దాంతో దబాంగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయి పరాజయాన్ని మూటకట్టుకుంది.
భోజ్పురి దబాంగ్స్ బ్యాట్స్మెన్లలో మనోజ్ తివారీ 10, అన్షుమన్ 1, టైగర్ 7, ఆదిత్య 34, ఉదయ్ 36, రాజీవ్ 38, మన్మోహన్ 9, అస్గర్ 16, సుధీర్ 1, దినేష్ 1, రోహిత్ 7 పరుగులతో నాటౌట్గా నిలిచారు. కర్ణాటక బౌలర్లలో సునీల్ 2, కార్తీక్ 1, మంజునాథ్ 2, కరణ్ 2, అర్జున్ 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్ కిచ్చా సుదీప్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కర్ణాటక బుల్డోజర్స్ 202 పరుగులు చేసింది. డార్లింగ్ కృష్ణ 53, సుదీప్ 26, రాజీవ్ 62, మంజునాథ్ 12, కరణ్ 21 చందన్ 9, నిరూప్ 5, కార్తీక్ 1, అర్జున్ 1 పరుగు చేయగా.. సునీల్ 0 నాటౌట్, సచిన్ 4 నాటౌట్గా నిలిచారు. భోజ్పురి బౌలర్లలో అస్గర్ , ఆదిత్యలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఉదయ్ 1 వికెట్ తీశారు. కర్ణాటక బౌలర్లలో నలుగురు బ్యాట్స్మెన్లు రన్ఔట్ కావడం గమనార్హం. చివరి 20 పరుగుల వద్ద కర్ణాటక 4 కీలక వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగిపోయి సుదీప్ సేనకు భారీ స్కోర్ చేయడం కష్టంగా మారింది.


Click it and Unblock the Notifications











