Women's Day 2025: ఔట్సైడర్ నుంచి సూపర్స్టార్గా, సీఎంనే ఢీకొట్టిన తెగువ..ఈ నటి సక్సెస్ స్టోరీ తెలుసా?
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలవై ఉంటారని మన పూర్వీకులు చెబుతుంటారు. మహిళలకు భారతీయ సంస్కృతి అంతటి విలువనిచ్చింది. అయితే దేవతగా కొలవాల్సిన స్త్రీలపై నేడు జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. లింగ సమానత్వం గురించి గొప్పలు చెప్పడమే కానీ నేటికీ వివక్ష ఎదుర్కొంటున్న స్త్రీలు కోట్లలో ఉన్నారు. అలాంటి పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సినీ రంగంలో మగవారికి సవాల్ విసిరి ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఫైర్ బ్రాండ్ లైఫ్ స్టోరీ ఒకసారి పరిశీలిస్తే :
23 మార్చి 1986న హిమాచల్ ప్రదేశ్లోని సూరజ్పూర్లో ఓ రాజపుత్ర కుటుంబంలో జన్మించారు కంగనా రనౌత్. ఆమె పూర్తి పేరు కంగనా అమర్దీప్ రనౌత్. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కంగన చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నారు. కానీ తన 15వ ఏటనే ఇంట్లో నుంచి పారిపోయి ఢిల్లీ వచ్చిన కంగన మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అయితే అక్కడ ఎత్తును కారణంగా చూపి కొందరు ఈమెను అవమానించారు. మోడలింగ్ తనకు సరిపడదని గ్రహించిన కంగన తన మకాం ముంబైకి మార్చారు.

2006లో గ్యాంగ్స్టర్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్.. ఆ తర్వాత వోహ్ లమ్హే, లైఫ్ ఇన్ ఏ మెట్రో, ఫ్యాషన్ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ క్వీన్గా నిలిచారు. తను వెడ్స్ మను, కైట్స్, నాక్ ఔట్, గేమ్, రెడీ, క్రిష్ 3 వంటి చిత్రాలతో ఎదురులేకుండా సాగిపోయారు. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల్లో కంగన కూడా ఒకరు. తన నటనకు గాను జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పద్మశ్రీ అవార్డ్ను పొందారు.
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్తో ఆమె ప్రేమాయణం నడిపారు. కానీ వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి హృతిక్ను పలుమార్లు టార్గెట్ చేసింది. ఇక ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం, కాంట్రవర్సీలతో సావాసం , చేసిన మాటలకు కట్టుబడి ఉండటం కంగన శైలి. ఏకంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఢీకొట్టడంతో శివ సైనికులు కంగనాను పలుమార్లు బెదిరించారు. ముంబైలో అడుగుపెడితే అంతు చూస్తామని హెచ్చరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

బీజేపీకి మద్ధతుదారైన కంగనా రనౌత్ 2024 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. నటిగానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా కంగనా రనౌత్ సక్సెస్ అయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో చోటు చేసుకున్న అంశాలతో ఆమె తెరకెక్కించిన ఎమర్జెన్సీ వివాదాస్పదమైంది. ఇందులో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగన నటించారు. ఈ సినిమా విడుదలకు పలు అవాంతరాలు ఎదురైనా న్యాయ పోరాటం చేసి అనుకున్నది సాధించిన మొండిఘటం కంగనా రనౌత్. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను , అడ్డంకులను దాటుకుని ఔట్సైడర్ అంటూ తనను వెక్కిరించిన వారితోనే క్వీన్గా నీరాజనాలు అందుకున్నారు. లేడీ సూపర్స్టార్గా, ఎంపీగా , ఓ మహిళగా కంగన ఎందరికో ఆదర్శం.


Click it and Unblock the Notifications











