CCL 2026: కేరళ స్ట్రైకర్స్ నుంచి స్టార్ ఆటగాడి తొలగింపుపై వివాదం... కెప్టెన్ స్పందన ఇదే!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) - 2026 ఉత్కంఠగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్ నరాలు తెగేలా ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతున్నాయి. మైదానంలో స్టార్స్ అంతా కొదమ సింహాల్ల తలపడుతున్నారు. గతంతో పోలిస్తే మైదానాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది. జనవరి 16వ తేదీ నుంచి సీసీఎల్ 2026 ప్రారంభమైంది.. ఫిబ్రవరి 1వ తేదీన జరిగే ఫైనల్తో సీసీఎల్ 2026 ముగియనుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరగ్గా.. బెంగాల్ టైగర్స్ 2, భోజ్పురి దంబాగ్స్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, తెలుగు వారియర్స్ జట్లు ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి. ఈ వారంతో సీసీఎల్ 2026లో సెమీఫైనల్ బెర్త్లు ఖరారు కానున్నాయి. అయితే అనూహ్యంగా కేరళ జట్టుకు చెందిన రాజీవ్ పిళ్లై... ముంబై జట్టులో ప్రత్యక్షం కావడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే...
రాజీవ్ పిళ్లై చుట్టూ వివాదం
సీసీఎల్ 2026లో కేరళ స్ట్రైకర్స్ జట్టు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు ఆటగాళ్ల జాబితా నుంచి రాజీవ్ పిళ్లైని యాజమాన్యం తప్పించడం వివాదాస్పదమైంది. రాజీవ్ని ఉద్దేశపూర్వకంగ తప్పించారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జనవరి 18న ముంబై హీరోస్తో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు డగౌట్లో కనిపించడంతో పాటు మైదానంలోకి దిగిన 11 మంది జట్టులో భాగమయ్యాడు. అయితే క్రీజులోకి వచ్చిన రాజీవ్ పిళ్లై ఆ రోజున ఒక బంతిని ఎదుర్కొని రనౌట్గా వెనుదిరిగాడు. అతని ఔట్ని కేరళ స్ట్రైకర్స్ పండగ చేసుకున్నారు. మొదటి నుంచి కేరళ జట్టులో భాగమై ఉండి.. ఇప్పుడు రాజీవ్ ఆ జట్టును ఎందుకు వదిలేశాడంటూ నెటిజన్లు అతనిని ట్రోల్ చేశారు.

కేరళ నుంచి ముంబై జట్టులోకి
దీంతో రాజీవ్ పిళ్లై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కేరళ స్ట్రైకర్స్ జట్టులోని 22 మంది సభ్యుల బృందంలో తాను లేనని, ఈ విషయంపై తాను వివరణ కోరడానికి ప్రయత్నించానని.. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో .. తనను వేరే జట్టు తరపున ఆడటానికి అనుమతించాల్సిందిగా ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) కోరాడు. దానిని వెంటనే మంజూరు చేశారు. దీంతో జట్టులో చోటు కల్పించేంత విలువైన ఆటగాడిగా తనను వారు భావించడం లేదని రాజీవ్ పిళ్లై ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను బయటకు వెళ్లిపోవడంతో.. రాజీవ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్ల కంటే ఇతర ఆటగాళ్లకే కేరళ స్ట్రైకర్స్ జట్టు ప్రాధాన్యత ఇస్తోందని దిశగా చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో జట్టు వైస్ కెప్టెన్ బినీష్ కొడియేరి పేరు అగ్రస్థానంలో ఉంది.
ప్రదర్శన బట్టే జట్టు కూర్పు
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న కేరళ స్ట్రైకర్స్ కెప్టెన్ ఉన్ని ముకుందన్ను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. రాజీవ్ను ట్రోలింగ్కు గురిచేయడం అన్యాయమని.. కేవలం క్రికెట్పై ఉన్న ప్రేమతోనే అతను మరో జట్టుకు ప్రాతినిథ్యం వహించడానికి నిరంతర అభ్యంతర పత్రం (ఎన్వోసీ) కోరాడని ఉన్ని ముకుందన్ వెల్లడించారు. అదే సమయంలో కేరళ స్ట్రైకర్స్ జట్టు కూర్పు అనేది నిర్దిష్టమైన వ్యక్తులతో కాదని.. ఒక యూనిట్గా ప్రదర్శనను బట్టే ఉంటుందని కెప్టెన్ క్లారిటీ ఇచ్చారు. టోర్నమెంట్కు ముందు మొత్తం జట్టు ప్రాక్టీస్పై పెట్టడానికి సమయం కేటాయించిందని.. ఇది కేవలం నెట్ సెషన్లకే పరిమితం కాలేదని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. తాము కార్పోరేట్ జట్లతో సహా కనీసం 15 మ్యాచ్లు ఆడాము.. దానిని ప్రాతిపదికగా తీసుకుని తుది జట్టును ఎంపిక చేశామని ఉన్ని స్పష్టం చేశారు.
అతనిని ట్రోల్ చేయొద్దు
కొన్ని బాధ్యతలు అప్పగించిన ఆటగాళ్లు వాటికి తగినట్లుగా రాణిస్తూ.. మంచి ప్రదర్శన ఇస్తున్నారు. జట్టును ఎంపిక చేసేటప్పుడు స్టార్డమ్ పరిగణనలోనికి రాదు. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. రాజీవ్కు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వడానికి దారి తీసిన పరిస్ధితుల గురించి నాకు తెలియదు. కెప్టెన్గా నాకు దొరికిన జట్టు పోటీతత్వంతో ఉంది. రాజీవ్ ఒక నటుడు, క్రికెటర్.. అతనిని ట్రోల్ చేయడం అన్యాయం. రాజీవ్ని ఔట్ చేసినందుకు జట్టు జరుపుకున్న సంబరాల విషయానికి వస్తే.. అది వ్యక్తిగత ద్వేషంతో చేసింది కాదని... రాజీవ్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని పెవిలియన్కు పంపినందుకే అలా చేశారని ఉన్ని ముకుందన్ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











