CCL 2026: సీసీఎల్లో తెలుగు వారియర్స్ ఘోర వైఫల్యం.. సెమీఫైనల్ల్లో ఏఏ జట్లు? ర్యాంకింగ్స్లో టాప్ ఎవరంటే?
గత రెండు వారాలుగా సినీ, క్రీడా అభిమానులను అలరిస్తోన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026 తుది అంకానికి చేరుకుంది. జనవరి 25వ తేదీన ముంబై హీరోస్ - చెన్నై కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్తో లీగ్ దశ ముగిసింది. దాంతో ప్రస్తుతం అందరి చూపు ఈ వారం జరగనున్న సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ మీద పడ్డాయి. లీగ్ మ్యాచ్లు ముగియడంతో ఏ జట్టు సెమీఫైనల్కు చేరనుంది? ఏ జట్టు ఏ జట్టుతో తలపడనుంది. ఎవరి బలబలాలు ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు పరిశీలిస్తే...
కర్ణాటక, బెంగాల్ జట్ల జైత్రయాత్ర
జనవరి 16 నుంచి జనవరి 25వ తేదీ వరకు విశాఖపట్నం, కోయంబత్తూరులలో జరిగిన లీగ్ దశలో ప్రతి జట్టు మూడేసి మ్యాచ్లు ఆడింది. ఇందులో కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ జట్లు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాయి. ఆ తర్వాత కేరళ స్ట్రైకర్స్ 2 మ్యాచ్లలో గెలిచింది. వేల్స్ చెన్నై కింగ్స్, పంజాబ్ దే షేర్, తెలుగు వారియర్స్, భోజ్పురి దబాంగ్స్ జట్లు ఒక్కో మ్యాచ్లో గెలవగా.. ముంబై హీరోస్ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆడిన మ్యాచ్లు ఓడిపోయింది.

చెన్నైకి కలిసొచ్చిన అదృష్టం
కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ జట్లు మూడేసి విజయాలతో నేరుగా సెమీఫైనల్లో అడుగుపెట్టగా.. కేరళ స్ట్రైకర్స్ రెండేసి విజయాలతో సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అయితే చెన్నై, పంజాబ్, తెలుగు, భోజ్పురి జట్లు ఒక్కో మ్యాచ్లో గెలిచినా రన్రేట్ ఆధారంగా వేల్స్ చెన్నై కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం సంపాదించి సెమీస్లోకి అడుగుపెట్టింది. దాంతో మిగిలిన నాలుగు జట్లు ఇంటి ముఖం పట్టాయి.
టాప్లో కర్ణాటక బుల్డోజర్స్
కర్ణాటక, బెంగాల్ జట్లు చెరో మూడు విజయాలు సాధించినప్పటికీ రన్రేట్ (1.29770)తో బుల్డోజర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకోగా.. బెంగాల్ టైగర్స్ రెండవ స్థానంలో, కేరళ స్ట్రైకర్స్ 3వ స్థానంలో, చెన్నై కింగ్స్ నాలుగో స్థానంలో, పంజాబ్ దే షేర్ ఐదో స్థానంలో, తెలుగు వారియర్స్ ఆరో స్థానంలో, భోజ్పురి దబాంగ్స్ ఏడో స్థానంలో, ముంబై హీరోస్ ఎనిమిదవ స్థానంలో నిలిచాయి.
సెమీస్లో ఎవరెవరు? వేదిక ఎక్కడంటే?
జనవరి 31వ తేదీన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సెమీఫైనల్ మ్యాచ్లు జరగున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే తొలి సెమీఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్తో వేల్స్ చెన్నై కింగ్స్ తలపడనుంది. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు జరిగే రెండో సెమీఫైనల్లో బెంగాల్ టైగర్స్తో కేరళ స్ట్రైకర్స్ తాడోపేడో తేల్చుకోనుంది. ఈ రెండు మ్యాచ్లలో గెలిచిన జట్టు ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్లోనే జరిగే ఫైనల్లో తలపడనున్నాయి.
తెలుగు వారియర్స్ పేలవ ప్రదర్శన
గతేడాది జరిగిన సీసీఎల్ 2025లోనూ చెత్త ప్రదర్శనతో ఇంటి ముఖం పట్టిన తెలుగు వారియర్స్ ఈసారి ఖచ్చితంగా సత్తా చాటాలని, కప్ అందుకోవాలని భావించింది. కానీ ఈసారి కూడా అఖిల్ సేనను దురదృష్టం వెంటాడింది. తొలి మ్యాచ్లో భోజ్పురి దబాంగ్స్ చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో పంజాబ్ దే షేర్పై దాదాపు 52 పరుగుల తేడాతో విజయం సాధించి రేసులోకి వచ్చినట్లుగా కనిపించింది.
ఈ క్రమంలో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి కోయంబత్తూరులో కర్ణాటక బుల్డోజర్స్తో తాడోపేడో అన్నట్లుగా జరిగిన మ్యాచ్లో 226 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ... కాపాడుకోలేకపోయింది. కర్ణాటక బ్యాట్స్మెన్లు అలవోకగా సిక్సర్లు, ఫోర్లతో మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే... కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. దాంతో అఖిల్ సేన ఆశలు అడియాసలు అయ్యాయి. లీగ్ మ్యాచ్లు ముగిసేదాకా వెయిట్ చేసి రన్రేట్ ఆధారంగా సెమీస్ చేరాలని ఆశించినప్పటికీ తెలుగు వారియర్స్కు మరోసారి భంగపాటు తప్పలేదు. బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ... ఫీల్డింగ్ లోపాలు, పసలేని బౌలింగ్తో తెలుగు వారియర్స్ చేజేతులా పరాజయాన్ని మూటకట్టుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











