CCL 2026: తెలుగు వారియర్స్ సత్తా చాటేనా? తెలుగు గడ్డపై అఖిల్ సేన పరువు నిలబెట్టుకుంటుందా?
సినీ తారల క్రికెట్ పండుగ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 ఘనంగా ప్రారంభమైంది. భారతీయ సినీ పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన సినీ రంగాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు జట్టుగా ఏర్పడి క్రికెట్ టోర్నీని గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో తమ అధిపత్యాన్ని కొనసాగించిన తెలుగు వారియర్స్ జట్టు ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలతో పేలవమైన ప్రదర్శనను కొనసాగించింది. గత రెండు సీజన్లుగా కప్ను సాధించలేకుండా తడబాటుకు గురవుతున్నది. ఈ క్రమంలో కెప్టెన్ అఖిల్ అక్కినేని ఈ ఏడాది తమ సత్తాను చాటి జట్టును విజయపథం వైపు నడిపిస్తారా? అనే వివరాల్లోకి వెళితే..
CCL 2026 టోర్నీలో మొత్తం 8 భాషలకు చెందిన సినీ పరిశ్రమ కళాకారులు పాల్గొంటారు. సీసీఎల్ ప్రీలిమినరీ రౌండ్ మ్యాచులను ఆంధ్ర ప్రదేశ్లోని వైజాగ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు ఈ పోటీలు వైజాగ్లోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, వైజాగ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి అని నిర్వాహకులు తెలిపారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2011 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు వారియర్స్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2015, 2016, 2017, 2023 సంవత్సరంలో కప్ గెలుచుకొన్నది. ఈ టోర్నీలో అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ గెలుచుకోగా, ఆ తర్వాత చెన్నై రెండుసార్లు, కర్ణాటక రెండుసార్లు, బెంగాల్ ఒకసారి, ముంబై, పంజాబ్ చేరోసారి టైటిల్ గెలిచాయి.
అయితే తెలుగు వారియర్స్ గత రెండు సీజన్లుగా పేలవమైన ప్రదర్శనను కొనసాగించింది. ఈ టోర్నీలో చివరిసారిగా 2023 సంవత్సరంలో టైటిల్ను గెలుచుకొన్నది. ఆ తర్వాత నుంచి ఫైనల్కు చేరుకొన్న దాఖలాలు కనిపించలేదు. 2024 సంవత్సరంలో పటిష్టమైన కర్నాటక బుల్డోజర్స్ జట్టుపై బెంగాల్ టైగర్స్ జట్టు సంచలన విజయం సాధించింది. 2025 సంవత్సరంలో చెన్నై రైనోస్ జట్టుపై పంజాబ్ దే షేర్ జట్టు విజయం సాధించి కప్ను సొంతం చేసుకొన్నది.
2026 సంవత్సరం తెలుగు వారియర్స్ జట్టుకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సంవత్సరం నిలకడగా ఆడి జట్టు కప్ సాధిస్తుందా? అని సినీ, క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. టాలెంటెడ్ ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. టీమ్లో సమతూల్యత కనిపిస్తున్నది. అయితే సరైన సమయంలో కలిసి కట్టుగా ఆడి జట్టును విజయం వైపు కెప్టెన్ అఖిల్ అక్కినేని నడిపించాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తున్నది. జట్టు యజమానులు రానా దగ్గుబాటి, సచిన్ జోషి ఈ ఏడాది ఎలాంటి వ్యూహాన్ని రచించారో వేచి చూడాల్సిందే.
తెలుగు వారియర్స్ జట్టులో అఖిల్ అక్కినేని, ఆది సాయికుమార్, అశ్విన్ బాబు, తమన్, ఆదర్శ్ బాలకృష్ణ, నిఖిల్ సిద్దార్థ, ప్రిన్స్, సచిన్ జోషి, సుధీర్ బాబు, సుశాంత్, ఖయ్యూం, సామ్రాట్, రఘు, నందకిషోర్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











