CCL 2026: సీసీఎల్ 2026 ఫైనల్లో బెంగాల్తో కర్ణాటక ఢీ... చెన్నై పై చివరి బంతికి గెలిచిన బుల్డోజర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (2026) ఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కోయంబత్తూరులో జరిగే ఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్తో బెంగాల్ టైగర్స్ తలపడనున్నాయి. ఫైనల్ బెర్త్ల కోసం జనవరి 31వ తేదీన జరిగిన తొలి సెమీఫైనల్లో కేరళ స్ట్రైకర్స్తో బెంగాల్ టైగర్స్ తలపడింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కేరళ స్ట్రైకర్స్పై బెంగాల్ టైగర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి ఫైనలిస్ట్గా ఫైనల్లో అడుగుపెట్టింది.
దాంతో రెండో సెమీఫైనల్లో గెలిచి బెంగాల్ టైగర్స్తో ఫైనల్లో తలపడే జట్టు ఎవరా అన్నది ఉత్కంఠగా మారింది. శనివారం సాయంత్రం జరిగిన సెకండ్ సెమీఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్ - వెల్స్ చెన్నై కింగ్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై కింగ్స్ జట్టు 19.5 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక బుల్డోజర్స్ జట్టు 19.5 ఓవర్లలో 161 పరుగులు చేసి ఫైనల్లో చేరింది. అయితే చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సినీ క్రీడా అభిమానులకు అసలైన వినోదాన్ని అందించింది.

కర్ణాటక కెప్టెన్ కిచ్చా సుదీప్.. సినీ రంగంలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు కావడంతో టాస్కు ముందు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసిన సుదీప్.. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం టాస్ గెలిచిన వెల్స్ చెన్నై కింగ్స్ కెప్టెన్ విక్రాంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విక్రాంత్ ఉన్నంతసేపు పరుగుల వరద పారగా.. అతని నిష్క్రమణ తర్వాత చెన్నై స్కోర్ బోర్డ్ వేగం తగ్గింది. బ్యాట్స్మెన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో 200 పరుగులు చేస్తుంది అనుకున్న జట్టు పేకమెడలా కుప్పకూలింది.
కర్ణాటక బౌలర్ల దెబ్బకు చెన్నై కింగ్స్ జట్టు 19.5 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చెన్నై బ్యాట్స్మెన్లలో రమణ 2, విక్రాంత్ 66, శంతను 5, పృథ్వీ 0, శరణ్ 9, సత్య ఎన్జే 0, అశోక్ 12, అధవ్ 31, దశరాథి 12, పారి 9 పరుగులు చేయగా, భరత్ 1 నాటౌట్గా నిలిచాడు. కర్ణాటక బుల్డోజర్స్ బౌలర్లలో సచిన్ 3, చందన్ 2, కరణ్ 2, ప్రతాప్, డార్లింగ్ కృష్ణలు తలో వికెట్ పడగొట్టారు.
161 పరుగుల లక్ష్యంత బరిలోకి దిగిన కర్ణాటక బుల్డోజర్స్కు ఓపెనర్లు డార్లింగ్ కృష్ణ, నిరూప్లు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. క్రీజులో కుదురుకుంటున్న దశలో డార్లింగ్ కృష్ణను పారి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే నిరూప్ రనౌట్ కాగా.. చందన్ను అధవ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. భారీ షాట్కు ప్రయత్నించిన రాజీవ్ విక్రాంత్కు దొరికపోవడంతో 4 వికెట్లు కోల్పోయి కర్ణాటక కష్టాల్లో పడింది. ఈ దశలో కార్తీక్, కరణ్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. అప్పుడప్పుడూ భారీ షాట్స్ ఆడారు.
ఆ తర్వాత కార్తీక్ విధ్వంసం సాగిస్తూ 44 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. ప్రమాదకరంగా మారుతోన్న కార్తీక్ను అధవ్ ఔట్ చేశాడు. దాంతో మంజునాథ్, కెప్టెన్ కిచ్చా సుదీప్లు ఆచితూచి ఆడారు. ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్కు కర్ణాటక విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉంది. ఈ పరిస్ధితుల్లో అశోక్ సెల్వన్కు బంతి అప్పగించాడు చెన్నై కెప్టెన్ విక్రాంత్. కట్టుదిట్టంగా బంతులు విసిరిన అశోక్.. కిచ్చా సుదీప్, ప్రతాప్ నారాయణ్లకు ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి 19.5 ఓవర్లలో కిచ్చా సుదీప్ విన్నింగ్ షాట్ కొట్టి జట్టును, కర్ణాటక అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.
ఈ విజయంతో కర్ణాటక సీసీఎల్ 2026 ఫైనల్లో చేరగా... ఈసారి కప్పు కొట్టాలన్న చెన్నై కింగ్స్ ఆశలు అడియాసలయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కర్ణాటక బుల్డోజర్స్తో బెంగాల్ టైగర్స్ తలపడనుంది. ఈ రెండు జట్లు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. కర్ణాటక బుల్డోజర్స్ జట్టు సీసీఎల్ ఛాంపియన్గా రెండు సార్లు అవతరించింది. గతంలో 2013, 2014లలో వరుసగా రెండు సార్లు కట్ కొట్టింది. 2014 తర్వాత ఇంత వరకు కర్ణాటక ఈ ట్రోఫీ గెలవలేదు. బెంగాల్ టైగర్స్ జట్టు 2024లో సీసీఎల్ విజేతగా నిలిచింది.


Click it and Unblock the Notifications











