CCL 2025 : చెన్నై కొంపముంచిన ఎక్స్ట్రాలు.. టార్గెట్ ఊదేసిన కర్ణాటక, ఎన్ని బంతుల్లో అంటే?
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2025 (సీసీఎల్ 2025)లో భాగంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కర్ణాటక బుల్డోజర్స్ - చెన్నై రైనోస్ తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించిందో పరిశీలిస్తే :
తొలుత టాస్ గెలిచిన చెన్నై రైనోస్ కెప్టెన్ ఆర్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విక్రాంత్ - రమణలు చెన్నై ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించారు. ఇద్దరూ పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ దశలో విక్రాంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో శరణ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. గణేష్ వేసిన ఈ ఓవర్లో చెన్నై మొత్తం 20 పరుగులు పిండుకోవడంతో స్కోరు బోర్డ్ 100 పరుగుల మార్క్ దాటింది. మొత్తంగా చెన్నై నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 108 పరుగులతో తన తొలి ఇన్నింగ్స్ను ముగించింది. రమణ 18, విక్రాంత్ 27, పృథ్వీ 27, శరణ్ 17 (నాటౌట్), దశరథ్ 2, అజయ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్స్లో చందన్ రెండు వికెట్లు, గణేష్ ఒక వికెట్ పడగొట్టారు.

109 పరుగుల టార్గెట్తో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కర్ణాటక బుల్డోజర్స్ తొలి నుంచి ఎదురుదాడికి దిగింది. రాజీవ్, కృష్ణ, కరణ్లు ఫోర్లు.. సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. వారి జోరుతో నిర్ణీత బుల్డోజర్స్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. తద్వారా చెన్నైపై 34 పరుగుల తొలి ఇన్నింగ్స్ సాధించింది సుదీప్ సేన. ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కృష్ణ. కేవలం 23 బంతుల్లోనే కృష్ణ 50 పరుగులు చేయడం విశేషం. రాజీవ్ 11, చందన్ 15, కరణ్ 44, మంజునాథ్ 1, కార్తీక్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో అధవ్ 2, కలై, భరత్లు తలో వికెట్ పడగొట్టగా.. దాశరథి మొత్తం నాలుగు క్యాచ్లు పట్టుకున్నాడు. చెన్నై బౌలింగ్లో 19 ఎక్స్ట్రాలు ఉండటం గమనార్హం.
కర్ణాటకపై 28 పరుగులు వెనుకబడ్డ చెన్నై తన రెండో ఇన్నింగ్స్లో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. సుదీప్ సేన ముందు 70 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రావడం రావడంతోనే ఎదురుదాడికి దిగినప్పటికీ కర్ణాటక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కీలక ఆటగాళ్లు వెనువెంటనే ఔట్ కావడంతో చెన్నై ఒత్తిడిలో పడింది. అయితే పృథ్వీ, కలైలు ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వారు కూడా ఔట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. అజయ్ 14, శరణ్ 4, కలై 24, విక్రాంత్ 8, పృథ్వీ 30, దాశరథి 4, పరి 2, ఆధవ్ 7 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో సునీల్ 2, గణేష్ , చందన్, రాజీవ్లు తలో వికెట్ పడగొట్టారు.
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)లో భాగంగా చెన్నై రైనోస్ - కర్ణాటక బుల్డోజర్స్ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో కర్ణాటక 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 70 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన సుదీప్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జోరు మీదున్న కరణ్ 18 పరుగులకే ఔట్ కాగా.. ఆ వెంటనే కార్తీక్ డకౌట్ అయ్యాడు. ఆ కాసేపటికే కెప్టెన్ కిచ్చా సుదీప్ కూడా 3 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దీంతో కృష్ణ (22), రాజీవ్ (17)లు నెమ్మదిగా ఆడుతూ చివరిలో బ్యాట్ ఝళిపించడంతో లక్ష్యం కరిగిపోయింది. చివరికి 6.5 ఓవర్లో సిక్స్తో కర్ణాటక గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత కట్టుదిట్టంగా బంతులు వేసిన చెన్నై తర్వాత పట్టు వదలడంతో ఓటమి మూటగట్టుకుంది. రైనోస్ బౌలర్లలో ఆధవ్ 2, శరణ్ 1 వికెట్ పడగొట్టారు. అయితే ఎక్స్ట్రాలు కూడా చెన్నై ఓటమిలో కీలక పాత్ర పోషించాయి.


Click it and Unblock the Notifications











