CCL 2025 : అఖిల్ పోరాడినా తప్పని ఓటమి, బెంగాల్ సెమీస్కి.. వారియర్స్ ఇంటికి
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)లో తెలుగు వారియర్స్ పోరాటం ముగిసింది. సూరత్లో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో బెంగాల్ టైగర్స్ విజయం సాధించింది. బెంగాల్దే విజయమని అంతా అనుకున్న వేళ .. కెప్టెన్ అఖిల్ అక్కినేని ఒంటరి పోరాటంతో తెలుగు వారియర్స్లో ఆశలు రేకెత్తించాడు. కానీ చివరికి టైగర్స్నే గెలుపు వరించింది. ఈ మ్యాచ్లో ఎవరు ఎలా ఆడారు? తెలుగు వారియర్స్ చేసిన తప్పులేంటీ? ఈ వివరాల్లోకి వెళితే..
తొలుత టాస్ గెలిచిన బెంగాల్ టైగర్స్ కెప్టెన్ జిషుసేన్ గుప్తా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ను జమ్మీ , బోనీలు ఆరంభించారు. అయితే కాసేపటికే టైగర్స్కు గట్టి దెబ్బ తగిలింది బోనీని సాంబ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ జిషుసేన్ గుప్తా , జమ్మీలు ఇన్నింగ్స్ను నడిపించారు. ముఖ్యంగా జమ్మీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో కెప్టెన్ జిషు సేన్ను ఆది క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అశ్విన్ బాబు వేసిన చివరి ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ , ఒక సింగిల్ , ఒక వైడ్తో కలిపి 24 పరుగులు పిండుకుని జట్టు స్కోరును సెంచరీ దాటించాడు జమ్మీ. కీలకమైన క్యాచ్లను తెలుగు వారియర్స్ ఫీల్డర్లు వదిలి వేశారు. మొత్తం మీద నిర్ణీత 10 ఓవర్లలో బెంగాల్ టైగర్స్ తన తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. బెంగాల్ బ్యాట్స్మెన్లలో జమ్మీ 78 , జిషు సేన్ గుప్తా 14 , బోనీ 5, రాహుల్ 5 పరుగులు చేశారు. తెలుగు వారియర్స్ బౌలర్లలో సాంబ, ఆదిలు తలో వికెట్ పడగొట్టారు.

107 పరుగుల ఆధిక్యమే లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన తెలుగు వారియర్స్కు ఆదిలోనే షాక్ తగిలింది కెప్టెన్ అఖిల్ అక్కినేని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం థమన్, సచిన్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. కానీ ఆ కాసేపటికే సచిన్, ఆదర్శ్ బాలకృష్ణ, థమన్, సాంబలు పెవిలియన్ చేరడంతో తెలుగు వారియర్స్ పని అయిపోతుందని అంతా భావించారు. అయితే చివరిలో అశ్విన్ బాబు బ్యాట్ ఝళిపించడంతో తెలుగు వారియర్స్ చెప్పుకోగదగ్గ స్కోరు సాధించింది.
నిర్ణీత 10 ఓవర్లలో అఖిల్ సేన 5 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ జట్టులో అఖిల్ 1, సచిన్ 16, ఆదర్శ్ 13, అశ్విన్ బాబు 31, థమన్ 14, సాంబ 2, సామ్రాట్ 2 పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్స్లో ఆదిత్య, రత్నదీప్, ఉదయ్, రాహుల్, జమ్మీలు తలో వికెట్ పడగొట్టారు. దీంతో తెలుగు వారియర్స్పై బెంగాల్ 19 పరుగుల తొలి ఇన్నింగ్స్ సాధించినట్లయ్యింది.
19 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ టైగర్స్ దంచికొట్టింది. తొలుత తెలుగు బౌలర్లు పట్టు బిగించినట్లు కనిపించినప్పటికీ తర్వాత వదిలేశారు. జమ్మీ, యూసుఫ్లు దాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన జమ్మీ.. రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధ సెంచరీ చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
తెలుగు ఫీల్డర్స్, బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో బెంగాల్ టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి అఖిల్ సేన ముందు 148 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఉదయ్ 19, రాహుల్ 18, ఆదిత్య 2, జమ్మీ 54, యూసుఫ్ 31 పరుగులు చేశారు. తెలుగు బౌలర్స్లో సామ్రాట్, ఆది, సాంబలు తలో వికెట్ పడగొట్టారు.
148 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తెలుగు వారియర్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఉదయ్ బౌలింగ్లో అశ్విన్ బాబు, సామ్రాట్లు డకౌట్గా వెనుదిరిగారు. ఆ తర్వాత అఖిల్ , థమన్ (18) లు ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ దశలో థమన్ ఔట్ కాగా.. ఆ వెంటనే సాంబ (4) కూడా పెవిలియన్ చేరాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అఖిల్ , సచిన్ (12)లు ఆదుకున్నారు. అయితే సచిన్ స్టంపౌట్ కావడం, తర్వాత వచ్చిన హరీష్ (0), ఆదర్శ్ (1), రఘులు (1)ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగు వారియర్స్ ఓటమి ఖాయమనుకున్నారు.
అయితే కెప్టెన్ అఖిల్ సిక్సర్లు, ఫోర్లతో ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును 100 పరుగులు దాటించాడు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 42 కొట్టాల్సిన దశలో అఖిల్ సిక్సర్లు బాదాడు. ఇదే సమయంలో జమ్మీ నో బాల్ వేయడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఫ్రీ హిట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అఖిల్ సిక్సర్ బాదాడు. కానీ చివరి మూడు బంతుల్ని జమ్మీ జాగ్రత్తగా వేయడంతో తెలుగు వారియర్స్ 15 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అఖిల్ సేన నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని 91 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. బెంగాల్ బౌలర్లలో ఉదయ్ 3, రత్నదీప్ 2, ఆదిత్య ఒక వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications











