CCL 2025 : నరాలు తెగే ఉత్కంఠ.. అఖిల్ సేనదే గెలుపు, కన్ఫ్యూజన్లో చిత్తయిన భోజ్పురి జట్టు
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై రైనోస్పై కర్ణాటక బుల్డోజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ వెంటనే తెలుగు వారియర్స్ - భోజ్పురి దబాంగ్స్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. విజయం ఇరు జట్లను ఊరించి దోబుచూలాడింది. సినీ, క్రీడా అభిమానులకు ఈ మ్యాచ్ మంచి మజాను అందించింది. మరి ఈ పోరులో ఎవరు విజయం సాధించారో చూస్తే :
టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి ఓవర్లోనే ఆదర్శ్, సచిన్, అశ్విన్ బాబులు డకౌట్గా వెనుదిరిగారు. ఆ కాసేపటికే థమన్ కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో తెలుగు జట్టు కష్టాల్లో పడింది. దీంతో అఖిల్ , సాంబలు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరి పోరాటంతో తెలుగు వారియర్స్ తన తొలి ఇన్నింగ్స్లో నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. మనోజ్ తివారీ, మన్మోహన్లు తెలుగు జట్టు వెన్ను విరిచారు. ఏకంగా ఐదుగురు బ్యాట్స్మెన్లు డకౌట్ కాగా.. అఖిల్ 41, సాంబ 18, సామ్రాట్లు పోరాడారు. భోజ్పురి బౌలర్లలో మనోజ్ తివారీ , మన్మోహన్, ఆదిత్యలు తలా రెండేసి వికెట్లు, అజ్గర్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.

81 పరుగుల ఆధిక్యమే లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భోజ్పురి దబాంగ్స్ జట్టు గడగడలాడించింది. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి మనోజ్ తివారీ సేన 126 పరుగులు చేసి తెలుగు వారియర్స్పై 46 పరుగుల ఆధిక్యం సాధించింది. వీరి దెబ్బకు తెలుగు జట్లు ఫీల్డర్లు, బౌలర్లు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆదిత్య 61 (నాటౌట్), అన్షుమన్ (42), అజ్గర్ ఖాన్ (4), ఉదయ్ (16) పరుగులు చేశారు. తెలుగు వారియర్స్ బౌలర్లలో సచిన్ 4 వికెట్లు పడగొట్టారు.
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో తెలుగు వారియర్స్ జూలు విదిల్చింది . తన సెకండ్ ఇన్నింగ్స్లో నిర్ణీత 10 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. తొలుత అశ్విన్ బాబు 36, థమన్ 21లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. అనంతరం అఖిల్ 22, సాంబ 26, ఆదర్శ్ 12, సామ్రాట్ 9 తమ వంతు సాయం చేయడంతో తెలుగు వారియర్స్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. భోజ్పురి దబాంగ్స్ బౌలర్స్లో ఖాన్ 2, మనోజ్ , ఆదిత్య, మన్మోహన్లు తలో వికెట్ పడగొట్టారు. భోజ్పురి జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది.
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)లో తెలుగు వారియర్స్ - భోజ్పురి దబాంగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలు మజా అందించింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో తెలుగు వారియర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఖిల్ సేన నిర్దేశించిన 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భోజ్పురి జట్టు 9.5 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉదయ్, ఖాన్లు క్రీజులో ఉన్నంత సేపు మనీష్ జట్టు గెలుస్తుందని అనుకున్నారు.
అయితే తెలుగు వారియర్స్ వెను వెంటనే వికెట్లు తీయడంతో భోజ్పురి జట్టు ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో చేజేతులా వికెట్లు కోల్పోయింది ఆ టీమ్. ఉదయ్ 25, ఖాన్ 15, మనోజ్ 1, దినేశ్ లాల్ యాదవ్ 3, ఆదిత్య 0, అన్షుమన్ 11, పర్వేష్ లాల్ యాదవ్ 13, సుధీర్ 2, విక్రాంత్ 0, మన్మోహన్ 1 పరుగు చేశారు. తెలుగు బౌలర్లలో సచిన్ 3, సాంబ 2, అశ్విన్ బాబు , ఆది , సామ్రాట్ చెరో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











