CCL 2025 : రోషన్ పోరాటం వృథా.. చేజేతులా ఓడిపోయిన అఖిల్ సేన, చెన్నై బోణీ
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రీడా, సినీ అభిమానులకు మంచి మజా అందించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై రైనోస్ - తెలుగు వారియర్స్ తలపడ్డాయి. సెకండ్ ఇన్నింగ్స్లో ఇరు జట్లు పోటా పోటీగా తలపడటంతో స్టేడియం హోరెత్తింది. మరి రెండు జట్లలో విజయం ఎవరినీ వరించిందో చూస్తే :
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై రైనోస్ తన తొలి ఇన్నింగ్స్లో నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రఘు వేసిన తొలి ఓవర్లోనే రమణ, శరణ్లు ఔట్ కావడంతో చెన్నైకి గట్టి దెబ్బ తగిలింది. ఆ కాసేపటికీ అజయ్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును విక్రాంత్ , దాశరథి ఆదుకున్నారు. వీరిద్దరూ సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తెలుగు వారియర్స్ తొలుత కట్టడి చేసినప్పటికీ ఆది వేసిన చివరి ఓవర్లో చెన్నై భారీగా పరుగులు పిండుకుంది. చెన్నై బ్యాట్స్మెన్లలో రమణ 10, విక్రాంత్ 61, శరణ్ 0, అజయ్ 12, దాశరథి 35 పరుగులు చేశారు. తెలుగు వారియర్స్ బౌలర్లలో రఘు 2, సామ్రాట్ ఒక వికెట్ పడగొట్టారు.

126 పరుగుల ఆధిక్యమే లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తెలుగు వారియర్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ అఖిల్, ఆదర్శ్లు ఔటయ్యాడు. ఆ కాసేపటికే అశ్విన్ బాబు కూడా పెవిలియన్ చేరడంతో తెలుగు జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో రోషన్, సచిన్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ క్రమంలో సచిన్ ఔట్ కావడంతో రోషన్ ఎదురుదాడికి దిగాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోషన్ చివరి వరకు క్రీజులో నిలిచి 73 పరుగులు చేశాడు.
దీంతో నిర్ణీత 10 ఓవర్లలో తెలుగు వారియర్స్ 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. దీంతో చెన్నైకి 20 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తెలుగు జట్టులో అఖిల్ 1, సచిన్ 18, ఆదర్శ్ 0, అశ్విన్ బాబు 4, రోషన్ 73 (నాటౌట్), సామ్రాట్ 3, ప్రిన్స్ 0, రఘు 1 (నాటౌట్) పరుగులు చేశారు. చెన్నై రైనోస్ బౌలర్లలో శరణ్ 3, కలై, ఆధవ్, పరిలు తలో వికెట్ పడగొట్టారు.
20 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై రైనోస్ తడబడింది. తెలుగు వారియర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. చెన్నై జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుండటంతో పృథ్వీ , అజయ్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వారిద్దరూ వెంట వెంటనే ఔట్ కావడంతో జట్టు ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది.
నిర్ణీత 10 ఓవర్లలో చెన్నై రైనోస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసి.. తెలుగు వారియర్స్ ముందు 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాట్స్మెన్లలో పృథ్వీ 31, అజయ్ 25, శంతను 7, దాశరథి 4, విక్రాంత్ 8, పరి 0, శరణ్ 0, రమణ 1, కలై 5 (నాటౌట్), ఆధవ్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. తెలుగు బౌలర్లలో ఆది 3, సాంబ, సచిన్, సామ్రాట్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ హీరో రోషన్ మేకా ఔట్ అయ్యాడు. ఆ కాసేపటికే అశ్విన్ , సామ్రాట్లు కూడా పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో సాంబ, కెప్టెన్ అఖిల్లు బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటంతో తెలుగు జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి తెలుగు వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో 25 పరుగుల తేడాతో చెన్నై రైనోస్ జట్టు టోర్నీలో బోణీ కొట్టింది. చివరిలో సచిన్ పోరాడటంతో పరుగుల తేడా తగ్గింది. తెలుగు వారియర్స్ బ్యాట్స్మెన్స్లో రోషన్ 6, అశ్విన్ బాబు 2, సామ్రాట్ 0, సాంబ 10, అఖిల్ 27, ఆదర్శ్ 11, సచిన్ 27, రఘు 6 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శరణ్ 2, ఆధవ్ , భరత్, కలైలు తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











