CCL 2025 : వార్ వన్ సైడ్ .. తెలుగు వారియర్స్పై కర్ణాటక ఘన విజయం
సినీ, క్రీడా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2025 (సీసీఎల్ 2025) ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 8న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై రైనోస్ - బెంగాల్ టైగర్స్ విజయం సాధించింది. ఆ వెంటనే తెలుగు వారియర్స్ - కర్ణాటక బుల్డోజర్స్ మధ్య రెండో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. టోర్నీలోనే హాట్ ఫేవరేట్స్ అయిన ఈ రెండు జట్లలో ఎవరు గెలిచారో చూస్తే :
తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు కృష్ణ - రాజీవ్లు కర్ణాటక ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించారు. ముఖ్యంగా కృష్ణ అయితే ఫోర్లు , సిక్సర్లతో తెలుగు వారియర్స్పై విరుచుకుపడ్డాడు. అతని దెబ్బకు బంతి మైదానంలో నలువైపులా పరుగులు పెట్టింది. కృష్ణ చివరి వరకు క్రీజులో నిలబడి 80 పరుగులతో నాటౌట్గా నిలవగా రాజీవ్ 1, కార్తీక్ 3, మంజునాథ్ 2, కరణ్ 11 పరుగులు చేశారు.

మరోవైపు తెలుగు వారియర్స్ ఎక్స్ట్రాల రూపంలోనే భారీగా పరుగులు సమర్పించుకోగా.. అఖిల్ ఫీల్డింగ్ మోహరింపు కూడా సరిగా లేదు. బెంగళూరు బ్యాట్స్మెన్ను తెలుగు వారియర్స్ ఏమాత్రం నియంత్రించలేకపోయారు. మొత్తంగా కర్ణాటక బుల్డోజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ను ముగించింది. తెలుగు బౌలర్స్లో ఆది, ఖయ్యూంలు తలో వికెట్ పడగొట్టారు.
114 పరుగుల లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన తెలుగు వారియర్స్కు ఓపెనర్లు అఖిల్, అశ్విన్ బాబులు మెరుపు ఓపెనింగ్ అందించారు. ఫోర్తో ఖాతా తెరిచిన అఖిల్ .. అశ్విన్ ఔటైనా ఆదర్శ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి అర్ధ శతకం సాధించాడు. మెరుపు ఫీల్డింగ్తో తెలుగు వారియర్స్ను 5 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్ద కట్టడి చేసింది కర్ణాటక. తెలుగు బ్యాట్స్మెన్లలో అఖిల్ 51, అశ్విన్ బాబు 12, ఆదర్శ్ 25, సాంబ 1, సామ్రాట్ 3, థమన్ 3, సచిన్ జోషి 1 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్స్లో మంజునాథ్, చందన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో తెలుగు వారియర్స్పై కర్ణాటక 14 పరుగుల ఆధిక్యం సాధించింది.
రెండో ఇన్నింగ్స్లోనూ కర్ణాటక బుల్డోజర్స్ చెలరేగిపోయారు. నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 123 పరుగులకు తోడు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో వచ్చిన 14 పరుగులతో మొత్తంగా 137 పరుగులు అందుకున్నట్లు అయ్యింది. దీంతో తెలుగు వారియర్స్ ముందు 138 పరుగులు ఉంచింది కర్ణాటక. చందన్ 12, మంజునాథ్ 12, సుదీప్ 14, కృష్ణ 16, రాజీవ్ 25, కరణ్ 34 పరుగులు చేశారు. తెలుగు బౌలర్స్లో సాంబ, అశ్విన్ బాబు, సామ్రాట్లు తలో వికెట్ పడగొట్టారు.
138 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన తెలుగు వారియర్స్కు థమన్, సామ్రాట్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వారి ఊపు చూస్తే మ్యాచ్ త్వరగానే ముగిసేలా కనిపించింది . అయితే వారిద్దరూ నిమిషాల వ్యవధిలో ఔట్ కావడం .. కీ ప్లేయర్స్ అఖిల్, సచిన్, ఆదర్శ్, అశ్విన్ బాబులు వెంట వెంటనే పెవిలియన్ చేరారు. దీంతో కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో 46 పరుగుల తేడాతో అఖిల్ సేన ఓటమి పాలైంది.
రెండో ఇన్నింగ్స్లో నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది తెలుగు వారియర్స్. థమన్ 37, సామ్రాట్ 2, సచిన్ 2, అఖిల్ 9, అశ్విన్ బాబు 5, సాంబ 16, ఆదర్శ్ 1, రఘు 7, హరీష్ 5 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో గణేష్ 4, చందన్ 2, అనూప్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే కేవలం నిర్లక్ష్యంగా షాట్స్ ఆడటం, ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే తెలుగు వారియర్స్ ఓడిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











