RRR యూనిట్ను వెంటాడుతున్న మరో డేంజర్: పునరాలోచనలో రాజమౌళి.!
తెలుగులోనే కాక... భారతదేశంలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్లోనే టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో RRR యూనిట్ను కొందరు ప్రముఖులు భయపెడుతున్నారు. ఇంతకీ వాళ్లెవరు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

రియల్ హీరోల జీవితానికి కల్పిత కథ జోడించి
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్... అల్లూరి సీతారామరాజుగానూ, జూనియర్ ఎన్టీఆర్... కొమరం భీంగానూ నటిస్తున్నారు. 1920లో ఈ రియల్ హీరోలు కొంత కాలం పాటు కనిపించకుండా వెళ్లారు. దానికి కల్పిత కథను జోడించి RRRను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అప్పుడే అవ్వాల్సింది... ఈ కారణాలతో లేటైంది
వాస్తవానికి ఈ సినిమా జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, అనివార్య కారణాలతో అది కాస్తా వాయిదా పడింది. అంతేకాదు, షూటింగ్కు పలుమార్లు ఆటంకం ఏర్పడడం కారణంగా చిత్రీకరణ కూడా 80 శాతం మాత్రమే పూర్తయింది. దీంతో విడుదల తేదీని జనవరి 8, 2021కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం మరో ప్రకటన చేసింది.

సినిమా కోసం రాజమౌళి ప్రయత్నం.. భారీ షాక్
కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండడంతో ఆ మధ్య లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాని కారణంగా సినిమా షూటింగులు దాదాపు మూడు నెలల పాటు ఆగిపోయాయి. ఈ పిరియడ్ తర్వాత షూటింగులకు అనుమతి దొరికినా వైరస్ వ్యాప్తి కారణంగా రీస్టార్ట్ కాలేదు. అంతేకాదు, దర్శకధీరుడు రాజమౌళి, ఆయన కుటుంబం కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మళ్లీ వాయిదా.. అవన్నీ ముందుకొచ్చేలా ప్లాన్
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగులు చేయడం ఏమంత శ్రేయస్కరం కాదు. అందునా రాజమౌళి మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో RRR షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. దీని వల్ల సినిమా విడుదల కూడా మరోసారి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాయి.

RRR యూనిట్ను భయపెడుతున్న వివాదం
RRR తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. మిగిలిన వాటిని మినహాయిస్తే బాలీవుడ్ మార్కెట్పై చిత్ర యూనిట్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే చిత్ర రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్లో అక్కడి ప్రముఖులు కొత్త భయాన్ని క్రియేట్ చేస్తున్నారు.

ప్రముఖుల కారణంగా నష్టాలు వచ్చే ప్రమాదం
కొన్ని రోజులుగా బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో RRR హీరోయిన్ ఆలియా భట్ కూడా భాగమైంది. ఆమె కొత్త చిత్రం ‘సడక్ 2'ను హిందీ ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్నారు. రేపు RRRకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇదే జరిగితే నష్టాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఆయనకూ వ్యతిరేకమే... RRRకు ప్రతికూలం
ఇక, RRR హిందీ రైట్స్ను కరణ్ జోహార్ తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే జరిగినా సుశాంత్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. దీనికి కారణం అతడి ఆత్మహత్యకు కరణ్ కూడా కారణమేనన్న ఆరోపణలు వస్తుండడమే. ఒకవైపు ఆలియా... మరోవైపు కరణ్ RRR యూనిట్ను తెగ భయపెడుతున్నారు. దీంతో జక్కన్న ఎలాంటి స్టెప్ వేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











