ఏపీకి టాలీవుడ్ను తరలిస్తారా? తెలుగు సినీ పరిశ్రమ అందుకు సిద్దమ్మేనా?
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సినీ పరిశ్రమ ఎంతో ఇష్టపడే చంద్రబాబు సీఎం కాగా.. స్వయంగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో టాలీవుడ్కు ఏపీలో మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారు. అయితే కొత్తగా సినిమాటోగ్రఫి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేన నేత, కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకు అద్భుతమైన లోకేషన్లు ఉన్నాయని .. చిత్రీకరణలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు , సినీ ప్రముఖులకు మంత్రి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలివెళ్తుందా , అసలు హైదరాబాద్ నుంచి టాలీవుడ్ను కదపగలరా అనే చర్చ సినీ జనాల్లో జరుగుతోంది. దీనికి గల సాధ్యాసాధ్యాలను ఒకసారి పరిశీలిస్తే.

మద్రాస్ నుంచి తరలివచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడటానికి చాలా ఏళ్లే పట్టింది. దశాబ్ధాల క్రితమే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో కట్టి మిగిలిన వారికి మార్గదర్శకంగా నిలిచారు. ఆ వెంటనే రామానాయుడు , ఎన్టీఆర్, కృష్ణ వంటి దిగ్గజాలు స్టూడియోలు నిర్మించారు. నాటి ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమకు, సినీ ప్రముఖులకు అనేక రాయితీలు ప్రకటించి ఇండస్ట్రీ భాగ్యనగరంలో నిలదొక్కుకునేందుకు కృషి చేశారు. తర్వాతి రోజుల్లో డబ్బింగ్ , రికార్డింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఇలా వేల మందికి ఉపాధి కల్పించే పోస్ట్ ప్రొడక్షన్ విభాగాలు హైదరాబాద్లో నెలకొన్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ రాకతో హైదరాబాద్కు చిత్ర నిర్మాణ రంగంలో తిరుగు లేకుండా పోయింది.
తెలుగు నేల ఒక్కటిగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు.. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాల పంపకం జరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కూడా ఏపీకి తరలివెళ్లాలని ప్రతిపాదనలు వచ్చాయి. నిజానికి టాలీవుడ్కు 60 శాతానికి పైగా ఆదాయం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచే వస్తోంది. విశాఖలో ఆల్రెడీ రామానాయుడు స్టూడియో ఉండగా తలకొన, తడ, హార్స్లీ హిల్స్, కోనసీమలలో అందమైన షూటింగ్ స్పాట్లు ఉన్నాయి. ఏపీకి చిత్ర పరిశ్రమను తరలించి .. అమరావతిలో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలు సైతం వచ్చాయి.

అయితే నాడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. టాలీవుడ్ హైదరాబాద్లోనే ఉంటుందని ఇందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే కేసీఆర్ ఏనాడూ సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు, షూటింగ్లకు అనుమతి , సినీ ప్రముఖులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఇలా ఏది కోరితే అది క్షణాల్లో ఏర్పాటు చేశారు చంద్రశేఖర్ రావు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది. కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమైన ప్రేక్షకులు అప్పుడప్పుడే థియేటర్లకు వస్తున్న దశలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలతో మరిన్ని నష్టాలను ఎదుర్కొంది.

సినీనటుడిని అయిన తన చేతుల్లోనే సినిమాటోగ్రఫి శాఖ ఉండాలని భావించిన పవన్ కళ్యాణ్ తన పార్టీకే ఈ శాఖను ఇప్పించుకున్నారు. పాలనలో తన మార్క్ ఉండాలని భావిస్తోన్న ఆయన తన చేతుల మీదుగానే ఏపీకి చిత్ర పరిశ్రమను తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారని ఫిలింనగర్ టాక్. ఈ నెల 26న విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఈ భేటీలో చర్చించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వీరు కలవనున్నారు.
అయితే హైదరాబాద్లో సినీ ప్రముఖుల వ్యాపారాలతో పాటు బోల్డెన్నీ అంశాలు ముడిపడి ఉన్నాయి. మరోవైపు చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు తరలిస్తామంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకుంటుందా. ఇలా వారిని ఒప్పించి ఏపీకి టాలీవుడ్ను తరలించడం అంత తేలికకాదు. కాకపోతే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు మాత్రం పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











