Nag Ashwin Love Story: నిర్మాత కూతుర్ని నాగ్ అశ్విన్ ఎలా బుట్టలో వేశాడంటే? కల్కి డైరెక్టర్ క్యూట్ లవ్ స్టోరీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి నాగీ వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటనకు తోడు విజువల్ ఎఫెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడంతో కల్కికి ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్లన్నీ కళకళలాడుతుండగా.. కుటుంబ ప్రేక్షకులు భార్యాబిడ్డలతో తరలివస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ అందించిన నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ గురించిన వివరాల్లోకి వెళితే..
కల్కి 2898 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్పై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. భారతీయుల సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయలేరంటూ హేళన చేసిన వారికి నాగీ గట్టి గుణపాఠం చెప్పారని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రాజమౌళీ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను మరో మెట్టు పైకెక్కించారని పొగుడుతున్నారు. బయటివాళ్లే ఇలా ఉంటే.. మరి కుటుంబ సభ్యుల పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా అగ్ర నిర్మాత అశ్వినీదత్ అయితే అల్లుడి ప్రతిభను చూసి పొంగిపోతున్నారు. వైజయంతి బ్యానర్లో భారతదేశం గర్వపడే సినిమా తీసినందుకు, అది బ్లాక్బస్టర్గా నిలిచినందుకు అశ్వినీదత్ సంబరపడిపోతున్నారు. మగధీర తరహాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ సినిమా చేయాలని ఆయన కన్న కల ఇన్నేళ్లకు తీరింది. లేదు లేదు అల్లుడు నాగ్ అశ్విన్ తీర్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ దశనే నాగీ మార్చేశారనే అందరూ కితాబిస్తున్నారు.
ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోతుండగా.. అసలు అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకకు - అశ్విన్కు మధ్య ఎలా పరిచయం ఏర్పడింది, అది ప్రేమగా ఎలా మారింది, పెద్దలను పెళ్లికి ఎలా ఒప్పించారు అనే అంశాలపై నెటిజన్లు ఇంటర్నెట్ను జల్లెడ పట్టేస్తున్నారు. తన లవ్స్టోరీని నాగ్ అశ్విన్ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. కల్కి సూపర్ హిట్ నేపథ్యంలో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చదువులో చురుగ్గా ఉండే నాగీకి సినిమా పిచ్చి కావడంతో అతని తల్లిదండ్రులు దర్శకుడు శేఖర్ కమ్ముల వద్దకు పంపారు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.
శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్న అనుభవంతో యాదోం కీ బరాత్ అనే షార్ట్ ఫిల్మ్ను నాగీ డైరెక్ట్ చేశారు. దీనికి ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ షార్ట్ ఫిల్మ్ ఎంపికవ్వగా.. అశ్విన్ టాలెంట్కు ప్రియాంక దత్, స్వప్నా దత్లు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఎవడే సుబ్రమణ్యం తెరకెక్కించే అవకాశాన్ని ఆయనకు వీరిద్దరూ అప్పగించారు. చాలా తక్కువ ఖర్చుతో అశ్విన్ ఈ సినిమాను రూపొందించగా.. మంచి విజయం సాధించడంతో పాటు నంది అవార్డ్ కూడా దక్కించుకుంది.
ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రియాంక దత్తో పరిచయం ప్రేమగా మారింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి మీకు ఎవరైనా నచ్చితే ఓకే.. లేదంటే మనం పెళ్లి చేసుకుందామని నాగ్ అశ్విన్ తన మనసులోని మాటను ప్రియాంకతో చెప్పారు. అప్పటికే అతని మంచితనం, శ్రమించే గుణం ఇతర లక్షణాలన్నీ తెలిసి ఆమె కూడా వెంటనే ఓకే చెప్పింది. పెద్దలు కూడా అంగీకారంతో 2015లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. తర్వాత భర్తకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ప్రియాంక. మహానటి, ఇప్పుడు కల్కి బ్లాక్బస్టర్ హిట్ కావడం వెనుక ఆమె కృషి ఎంతో ఉంది.


Click it and Unblock the Notifications











