CCL 2026- Semi Final 1: పోరాడి ఓడిన కేరళ స్ట్రైకర్స్... సీసీఎల్ ఫైనల్లో బెంగాల్ టైగర్స్
సెలబ్రిటి క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి సెమీఫైనల్లో కేరళ స్ట్రైకర్స్పై 5 వికెట్ల తేడాతో బెంగాల్ టైగర్స్ విజయం సాధించింది. కేరళ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో బెంగాల్ టైగర్స్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఎవరు ఎలా ఆడారు. కేరళ ఎక్కడ తప్పు చేసింది? బెంగాల్ విజయ రహస్యం ఏంటీ? ఫుల్ మ్యాచ్ రిపోర్ట్ పరిశీలిస్తే..

178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ టైగర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఉన్ని ముకుందన్ వేసిన తొలి ఓవర్లో పరుగులేమీ చేయకుండానే ఓపెనర్ ఇంద్రాశిష్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో జాయ్ ముఖర్జీ, జామ్మీలు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరూ వరుస సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ప్రమాదకరంగా మారుతున్న జాయ్ని వివేక్ ఔట్ చేశాడు. అనంతరం ఉదయ్, జామ్మీలు కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. ఈ దశలో జామ్మీ అర్ధ సెంచరీ పూర్తి చేసేకున్నాడు.
ఆ కాసేపటికే బినేష్ బౌలింగ్లో ఉదయ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా, ఆ వెంటనే యూసుఫ్ క్లీన్బౌల్డ్ కావడంతో 4 వికెట్లు కోల్పోయి బెంగాల్ మరోసారి కష్టాల్లో పడింది. దాంతో రాహుల్ మజుందార్, జామ్మీలు ఆచితూడి ఆడుతుండగా జామ్మీని మొహమ్మద్ క్లీన్ బౌల్డ్ చేసి కేరళను రేసులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కేరళ ఫీల్డర్లు, బౌలర్లు కట్టుదిట్టంగా వ్యవహరించడంతో పరుగులు రావడం కష్టమైంది. మ్యాచ్ కేరళ చేతుల్లోకి వెళ్లిపోతున్న దశలో జిషు, రాహుల్లు విజృంభించారు. పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వీరిద్దరూ భారీ షాట్స్తో విరుచుకుపడి లక్ష్యానికి చేరువయ్యారు.
చివరి ఓవర్లో బెంగాల్ విజయానికి 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో జిషుసేన్ గుప్తా, రాహుల్ మజుందార్లు ఉన్నారు. చివరి ఓవర్ను బీనేష్ వేశాడు. రాహుల్ మూడు సిక్సర్లు కొట్టడంతో బెంగాల్ ఘన విజయం సాధించింది. జట్టు ఫైనల్లో అడుగుపెట్టడంతో బెంగాల్ టీమ్ మొత్తం గ్రౌండ్లో సంబరాలు చేసుకుంది. బెంగాల్ టైగర్స్ బ్యాట్స్మెన్లలో జాయ్ 18, ఇంద్రాశిస్ 0, జామ్మీ 64, ఉదయ్ 6, యూసుఫ్ 10 పరుగులు, జిషుసేన్ 23 నాటౌట్, రాహుల్ మజుందార్ 40 నాటౌట్గా నిలిచారు. కేరళ బౌలర్లలో వివేక్, ఉన్నీ, మొహమ్మద్, బినేష్, అరుణ్లు తలో వికెట్ పడగొట్టారు. కీలక దశలో క్యాచ్లు జారవిడవటం, మిస్ ఫీల్డింగ్తో కేరళ చేజేతులా గెలిచే మ్యాచ్ను పొగొట్టుకుంది. అటు ఎక్స్ట్రాలు కూడా కేరళ స్ట్రైకర్స్ కొంప ముంచాయి. ఏకంగా 17 పరుగులను ఎక్స్ట్రాల రూపంలో సమర్పించుకోవడంతో కేరళ భారీ మూల్యం చెల్లించింది.
అంతకుముందు టాస్ గెలిచిన బెంగాల్ టైగర్స్ కెప్టెన్ జిషుసేన్ గుప్తా.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కేరళ బ్యాట్స్మెన్లలో ఉన్ని ముకుందన్ 41, అర్జున్ 61, జీన్ 0, మదన్ 28, ఆర్యన్ 10, వివేక్ 11 నాటౌట్, అరుణ్ 14, మొహమ్మద్ 4 నాటౌట్గా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో జమ్మీ 3, ఆదిత్య 2, రాహుల్ ఒక వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











