CCL 2026: గెలుపు ముందు చతికిలపడ్డ కేరళ స్ట్రైకర్స్... ఉత్కంఠపోరులో బెంగాల్ విజయం
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో బెంగాల్ టైగర్స్ జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కోయంబత్తూరులో ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్లో కేరళ స్ట్రైకర్స్ను బెంగాల్ జట్టు 13 పరుగుల తేడాతో ఓడించింది. 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ 19.2 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో బెంగాల్ జట్టు సెమీస్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది? ఎవరెవరు ఎలా రాణించారు? కేరళ ఎక్కడ తప్పు చేసింది. ఫుల్ మ్యాచ్ రిపోర్ట్ ఇక్కడ చూద్దాం.

తొలుత టాస్ గెలిచిన కేరళ స్ట్రైకర్స్ కెప్టెన్ ఉన్ని ముకుందన్ ఫీల్డింగ్ ఎంచుకుని బెంగాల్ టైగర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే బెంగాల్ టైగర్స్కు షాక్ తగిలింది. ఇంద్రాశిష్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. కేరళ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బెంగాల్కు పరుగులు రాబట్టడం కష్టమైంది. అయినప్పటికీ జాయ్ అడపాదడపా మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో అతను అభిమానులను అలరించాడు. ఈ క్రమంలోనే పవర్ ప్లే ముగిసిన వెంటనే బెంగాల్ జట్టు 50 పరుగుల మార్క్ను క్రాస్ చేసింది.
50 దాటిన తర్వాతి నుంచి బెంగాల్ బ్యాట్స్మెన్లు ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో జామ్మీ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో జామ్మీ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రమాదకరంగా మారుతున్న జామ్మీని వివేక్ ఔట్ చేశాడు. అతను పెవిలియన్ చేరిన తర్వాత బెంగాల్ స్కోర్ బోర్డ్ వేగం మందగించింది. ఇంతలో బినేష్ మరో షాకిచ్చాడు. మంచి ఊపుమీదున్న జాయ్ ముఖర్జీని స్టంపౌట్గా వెనక్కిపంపాడు. ఆ తర్వాత కెప్టెన్ జిషుసేన్ గుప్తా, యూసుఫ్లు జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును 150 పరుగుల మార్క్ దాటించారు.
మొత్తంగా బెంగాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. జాయ్ 42 పరుగులు, ఇంద్రశిష్ 5 పరుగులు, జామ్మీ 51 పరుగులు, రాహుల్ 7 పరుగులు, జిషుసేన్ గుప్తా 46 పరుగులు, యూసఫ్ 15 పరుగులు, రత్నదీప్ 1, ఉదయ్ 4 పరుగులతో నాటౌట్గా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో వివేక్ 3 వికెట్లు, బినేష్ 3 వికెట్లు, మణికుట్టన్ ఒక వికెట్ పడగొట్టారు.
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ స్ట్రైకర్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద కెప్టెన్ ఉన్ని ముకుందన్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెంగాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటం ఓ వైపు వికెట్లు పడుతుండటంతో కేరళ జట్టు బ్యాట్స్మెన్లు పరుగులు తీయడం కష్టంగా మారింది. 9వ ఓవర్లో జట్టు 50 పరుగుల మార్క్ దాటగలిగింది. ఈ దశలో ఫస్ట్ మ్యాచ్ హీరో మదన్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసపెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ 14వ ఓవర్ నాటికి జట్టు స్కోర్ను 100 పరుగుల మార్క్ దాటించాడు. అయితే బెంగాల్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసి రేసులోకి దూసుకొచ్చారు.
చివరిలో ఆర్యన్, అరుణ్, బినేష్లు ధాటిగా బ్యాటింగ్ చేసి కేరళ జట్టులో గెలుపు ఆశలు రగిల్చారు. ఇంతలో అరుణ్ ఔట్ అయినా ఆర్యన్, దినేష్లు భారీ షాట్లు ఆడి జట్టు స్కోరును 160 పరుగులు దాటించారు. అయితే చివరి ఓవర్లో కేరళ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. జామ్మీ బౌలింగ్కు వచ్చాడు. తొలి బంతికి ఒక రన్ తీయగా.. రెండో బంతికి సింగిల్ తీసేందుకు బీనేష్ ప్రయత్నించగా దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దాంతో 19.2 ఓవర్లలో 164 పరుగుల వద్ద కేరళ ఇన్నింగ్స్ ముగిసింది. ఉత్కంఠపోరులో గెలవడంతో బెంగాల్ జట్టు సంబరాలు మిన్నంటాయి. ఈ గెలుపుతో జిషుసేన్ గుప్తా టీమ్ సెమీస్కు క్వాలిఫై అయ్యింది.


Click it and Unblock the Notifications











