IPL 2025 opening Ceremony: అంగరంగ వైభవంగా ఐపీఎల్ 2025.. ఆరంభ వేడుకలో మెరిసే సినీతారలు ఎవరంటే?
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 2025 క్రీడా సంబురాలకు తెర లేచింది. ఈ ఏడాది జరుగబోయే టోర్నమెంట్కు దేశంలోని ప్రధాన నగరాల్లోని స్టేడియాలన్నీ ఇప్పటికే ముస్తాబయ్యాయి. ఈ నెల 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆరంభ వేడుకకు ఈడెన్ అంగరంగ వైభవంగా సిద్దమైంది. అయితే కనివినీ ఎరుగని రీతిలో జరిగే ఈవెంట్కు భారీగా సినీ తారలు తరలి రానున్నారు. అయితే ఈ ప్రారంభ వేడుకలో మెరిసే తారలు ఎవరనే వివరాల్లోకి వెళితే..
ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ విజయ కేతనం ఎగురవేసిన తర్వాత ఉరుకలు వేస్తున్న భారత క్రికెటర్లు, అలాగే ఇతర దేశాలు ఆటగాళ్లు ప్రస్తుతం ఇండియాలో జరిగే ఐపీఎల్ 18వ సీజన్పై దృష్టిపెట్టారు. మార్చి 22వ తేదీ నుంచి ఈడెన్స్ గార్డెన్స్లో జరిగే ఆరంభమ్యాచ్తో ఈ క్రేజీ టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ ఆరంభ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

శనివారం (మార్చి 22వ తేదీ) రోజున కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్ కోసం క్రికెటర్ల స్వర్గధామంగా భావించే ఈడెన్ను చూడముచ్చటగా ముస్తాబు చేశారు. ఈ మ్యాచ్ కోసం భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలు, సినీ తారలు, క్రికెటర్లు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.
ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభ మ్యాచ్ను సొంత గ్రౌండ్లో ఆడుతుండటంతో ఆ జట్టు యజమానులు షారుక్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే షారుక్, జూహీ స్నేహితులు కూడా ఈ వేడుకలో భాగమవుతారని తెలిసింది. వీరిని చూసేందుకు ఫ్యాన్స్ కూడా భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. ఆరంభ మ్యాచ్ కోసం లక్షమంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్ 2025 లో భాగంగా KKR Vs RCB జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్కు ముందు ఏర్పాటు చేసిన ఆరంభ వేడుకలో బాలీవుడ్ తారలు తళుక్కున మెరువనున్నారు. ఈ వేడుకలో స్త్రీ 2 ఫేమ్ బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్, వరుణ్ ధావన్, సింగర్ ఆర్జిత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. వీరి చేసే స్పెషల్ షో ద్వారా ప్రేక్షకులను ఉత్పాహ పరచనున్నారు. బాలీవుడ్ పాటలను ఆర్జిత్ సింగ్ ఆలపిస్తూ లైవ్ ఈవెంట్ను కొనసాగించనున్నారని తెలిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 పోటీలు మార్చి 22వ తేదీన కోల్కతాలో ప్రారంభవుతాయి. దాదాపు రెండు నెలలపాటు ఏకధాటిగా, పోటాపోటీగా మ్యాచులు జరుగనున్నాయి. సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేసేందుకు ఆటగాళ్లు కాచుకొని ఉన్నారు. 18 సీజన్ టోర్నమెంట్ మే 25వ తేదీన కోల్కతాలో జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. ఈ రెండు నెలలు క్రికెట్ సంబరాల్లో అభిమానులు తడిసి ముద్దవ్వడం ఖాయమని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











