పోరాడి ఓడిన ముంబై హీరోస్.. ఉత్కంఠపోరులో కేరళ స్ట్రైకర్స్ ఘన విజయం
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా వైజాగ్లో కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇరు జట్లు గెలుపు కోసం నువ్వా? నేనా? అనే విధంగా పోరాటం చేశాయి. చివరి వరకు విజయం కోసం రెండు జట్ల ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డారు. అయితే ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్లో పోరాట పటిమ చూపిన కేరళ జట్టు 5 వికెట్ల తేడాతో ముంబై జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే...
టాస్ గెలిచిన కేరళ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకొన్నది. ఓపెనర్లు షబ్బీర్, సాకిబ్ సలీం ఇచ్చిన శుభారంభాన్ని మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు శరద్ కేల్కర్, తోమార్ నవదీప్ చక్కగా వినియోగించుకొన్నారు. భారీ షాట్స్ ఆడుతూ నవదీప్ స్కోరును పరుగులుప పెట్టించారు. అయితే శరద్ కేల్కర్, నవదీప్ వెంటవెంటనే అవుట్ అయ్యాక ముంబై జట్టు వికెట్లు టపటప రాలిపోయాయి. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. అయినప్పటికీ సిద్దాంత్ సుడిగాలి ఇన్నింగ్స్ 7 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 21 పరుగులు చేయడంతో ముంబై జట్టు భారీ స్కోరును కేరళ ముందుంచింది.

ముంబై జట్టులో షబ్బీర్ ఆలువాలియా 23 పరుగులు, సాకిబ్ 29 పరుగులు, శరద్ కేల్కర్ 38, తోమార్ నవదీప్ 58 పరుగులు, సిద్దాంత్ సచ్దేవ్ 21 పరుగులు చేశారు. కేరళ జట్టులో ఉన్ని కృష్ణన్ 3 వికెట్లు, అరుణ్ బెన్నీ 3 వికెట్లు, జీన్ పాల్ లాల్ 1 వికెట్ పడగొట్టారు.
192 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేరళ జట్టు కూడా ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నది. ఉన్ని ముకుందన్ 18 పరుగులు, అర్జున్ నందా 29 పరుగులు, జీన్ పాల్ 21 పరుగులు చేశారు. అయితే మిడిల్ ఆర్డర్లో వివేక్ గొపన్, మదన్ మోహన్ నిలకడగా ఆడటంతో విజయం వైపుకు దూసుకుపోయినట్టు కనిపించింది.
అయితే కీలక సమయంలో వివేక్ 38 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే మధన్ మాత్రం ఏ మాత్రం తొణకకుండా తన బ్యాటింగ్ ప్రతిభతో బంతిని నలుమూలల తరలించాడు. చివరి ఓవర్లో 8 పరుగులు సాధించాల్సి ఉండగా ఓ ఫోరు, సిక్సర్ సాధించి కేరళ జట్టుకు గెలుపును అందించాడు. మదన్ మోహన్ 30 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ముంబై జట్టులో ఫ్రెడ్డీ 2 వికెట్లు, రాజా రెండు వికెట్లు, రితేష్ ఒక వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications











